కరోనావైరస్ - న్యూజీలాండ్‌: లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సాధారణ జీవనం ఇలా ఉంది..

కరోనావైరస్ రహిత దేశంగా న్యూజీలాండ్‌ను ప్రకటిస్తున్న సమయంలో ఆ దేశ ప్రధాని జెసిండ్రా ఆర్డ్రెన్ ఆనందంతో డ్యాన్స్ చేశారు.

రెండు వారాల నుంచి ఆ దేశంలో కొత్తగా కేసులు నమోదు కాలేదు. మరోవైపు అప్పటికే దేశంలో రోగులంతా కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో జూన్ 8 నుంచి ఆ దేశంలో లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు.

న్యూజీలాండ్‌లో మార్చి 25 నుంచి లాక్ డౌన్ మొదలయ్యింది. నాలుగు దశల్లో హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వం నాల్గో దశకు చేరుకునేసరికి ఆ దేశంలో ఉన్న ప్రధాన వ్యాపార కేంద్రాలు, పాఠశాలల్ని ముసివేసింది. ప్రజల్ని ఇళ్లకు పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది.

50 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయడం ద్వారా కోవిడ్-19ను తరిమి కొట్టిన తర్వాత ఇప్పుడు తిరిగి మొదటి దశ నిబంధనల్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా ఆ దేశంలో జన జీవనం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది.

ప్రస్తుతానికి విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయి. తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఇక ఆ దేశంలో సామాజిక దూరం పాటించాల్సిన అవసరం లేదు. అలాగే బహిరంగ సమావేశాలపై కూడా ఎలాంటి నిషేధాజ్ఞలు లేవు.

స్థానిక పర్యాటకానికి తిరిగి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని భావిస్తోంది. లాక్ డౌన్ నిబంధనల్ని దాదాపు సడలించిన 48 గంటల తర్వాత ఆ దేశంలో పరిస్థితికి ఈ ఛాయా చిత్రాలు అద్దం పడుతున్నాయి.

స్నేహితులతో బీచ్ వాలీబాల్

సుదీర్ఘ లాక్ డౌన్ అనంతరం న్యూజీలాండ్‌కు ఉత్తరాన ఉన్న కేంబ్రిడ్జ్ బీచ్‌లో స్నేహితులంతా కలిసి వాలీ బాల్ మొదలుపెట్టారు.

అయితే ఇప్పటికీ దేశ సరిహద్దు నియమ నిబంధనల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది న్యూజీలాండ్. ఇతర దేశాల నుంచి స్వదేశీయులు ఎవ్వరు న్యూజీలాండ్ వచ్చినా కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్ పాటించాల్సిందే.

ప్రజలు తమ కదలికల్ని, తమ రోజు వారీ దినచర్యల్ని, అలాగే ఎవరెవరితో కలుస్తున్నారన్న విషయాలన్నింటినీ డైరీలో తప్పనిసరిగా పొందుపరచాలని ఆ దేశ ప్రభుత్వం సూచిస్తోంది. ఫలితంగా సెకెండ్ వేవ్ ఇన్ఫెక్షన్స్ సమయంలో బాధితుల్ని ట్రాక్ చేసేందుకు అనువుగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఉత్తర ఐలాండ్‌లోని ప్లెంటీ ప్రాంతంలోని తౌరంగ అవకడొ ప్యాక్ హౌజ్, ట్రివిలియన్ కివీఫ్రూట్‌లలో తిరిగి విధులకు హాజరైన సిబ్బందిని కలిశారు ఆ దేశ ప్రధాని అర్డ్రెన్.

నిబంధనల్ని సడలించడం ద్వారా ఆ దేశంలో జన జీవనం చాలా వరకు సాధారణ స్థితికి చేరుకుంటోంది.

ఆ దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన అక్లాండ్‌లో భవన నిర్మాణ కార్మికులు తిరిగి తమ కార్యకలాపాలను మొదలుపెట్టారు.

చాలా రోజుల తర్వాత తమ స్నేహితుల్ని కలవడంతో కొందరు సరదాగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యాలను ఈ చిత్రంలో మనం చూడవచ్చు.

మళ్లీ మొదలైన కళలు-క్రీడలు

మూడు నెలలుగా మైదానం ముఖం చూడని రగ్బీ ఆటగాళ్లు స్థానికంగా జరిగే వారాంతపు పోటీల కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. స్టేడియంలను తిరిగి ప్రారంభించనుండటంతో మళ్లీ క్రీడాభిమానులు సందడి మొదలు కానుంది. తమ అభిమాన ఆటగాళ్ల ఆటను ప్రత్యక్షంగా వారు తిలకించవచ్చు. శనివారం నుంచి ఫైవ్ సూపర్ రగ్బీ క్లబ్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 తర్వాత జరుగుతున్న అతి పెద్ద క్రీడా పోటీలు ఇవే అని చెప్పవచ్చు.

మొదలైన ప్రజా రవాణా

జూన్ 9 నుంచి ప్రజా రవాణా వ్యవస్థ మళ్లీ ప్రారంభమయ్యింది. ఫెర్రీల ప్రయాణాలపై కూడా ప్రభుత్వం ఆంక్షల్ని ఎత్తివేసింది.

దీంతో తూర్పు నుంచి పశ్చిమ తీరానికి వెళ్లే ప్రయాణీకులు మళ్లీ ఫెర్రీ ప్రయాణాలను మొదలుపెట్టారు. న్యూజీలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌లోని దృశ్యాలివి.

మళ్లీ మునపటి రోజులు

ఔట్ డోర్ కార్యకలాపాలపై కూడా అక్కడ ప్రభుత్వం ఆంక్షల్ని ఎత్తి వేసింది. దీంతో న్యూజీలాండ్ వాసులు తమ స్నేహితులతో కలిసి సర్ఫింగ్ కూడా చేయవచ్చు. జూన్ 9 నుంచే అక్కడ సర్ఫింగ్ ప్రారంభమయ్యింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)