కరోనావైరస్: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై ఫిర్యాదు చేస్తారా?

    • రచయిత, ఫ్రాన్సెస్ మావో
    • హోదా, బీబీసీ న్యూస్

లాక్ డౌన్ సమయంలో తమ ఇంటి పక్కన తెరిచి ఉంచిన బార్‌ని, అక్కడికి వచ్చే వినియోగదారుల రాకపోకలని జెన్నీ, వెరోనికా అనే ఇద్దరు అమ్మాయిలు గమనించారు.

కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న చికాగో నగరంలో ఇలా బార్‌కి వచ్చి తాగుతున్న వారిని చూసి వారిపై కోప్పడ్డారు.

కానీ, ఆ బార్ గురించి కనుక్కోవడానికి ఒక అధికారి వచ్చి వారిని కలిసినప్పుడు మాత్రం వారి దగ్గర సమాధానం లేదు.

మమ్మల్ని అడిగేసరికి మేము వేగుల్లా మారకూడదని నిర్ణయించుకున్నామని వారు అన్నారు .

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇంటి దగ్గరే ఉండటానికి నిర్ణయించుకున్నారు.

కానీ, ఎవరైనా నిబంధనలు ఉల్లఘించినప్పుడు ఆ విషయాన్ని రిపోర్ట్ చెయ్యాలా వద్దా అనేది వెరోనికా లాంటి వాళ్లకి సందిగ్ధంగా మారింది.

వారి పని వారు చూసుకోవాలా లేదా సామాజిక బాధ్యతగా గుర్తించి ఫిర్యాదు చేయాలో వారికి అర్ధం కాలేదు.

చాలా దేశాలు, నగరాల్లో లాక్ డౌన్ నియమాలని ఉల్లంఘిస్తే జరిమానాలు, శిక్షలు విధిస్తామని కూడా ఆదేశాలు జారీ చేశారు.

నియమాల ఉల్లంఘనని రిపోర్ట్ చేయడానికి కొన్ని దేశాలలో హాట్ లైన్లు కూడా ప్రారంభించారు.

ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో వీడియో గేమ్ ఆడుకోవడానికి ఒకే చోట కలిసిన స్నేహితుల గురించి, అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఒక విందు గురించి పోలీసులకి ఫిర్యాదు అందటంతో వారికి జరిమానా విధించారు.

న్యూ సౌత్ వేల్స్‌లో గుంపులు గుంపులుగా ప్రజలు బీచ్‌కి వెళ్లడంతో ఇన్ఫెక్షన్ రేటు పెరిగింది. దాంతో, లాక్ డౌన్ నియమాలని ఉల్లంఘించిన వారి గురించి ఫిర్యాదు చేయమని, ఆ రాష్ట్ర ప్రధాని (ప్రీమియర్) గ్లడీస్ బెరెజిక్లియాన్ విజ్ఞప్తి చేశారు.

ఆ తర్వాత, పోలీసులకి లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన గురించి సుమారు 5000 కాల్స్ వచ్చినట్లు చెప్పారు. అందులో కొన్ని తప్పుడు సమాచారం ఇచ్చిన కాల్స్ కూడా ఉన్నాయి.

ఒక జంట ఫేస్‌బుక్‌లో హాలిడే ఫొటోస్ పోస్ట్ చేసినట్లు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తే అవి ఒక సంవత్సరం క్రితం నాటివని తేలింది.

సింగపూర్‌లో ప్రజల కదలికల్ని రిపోర్ట్ చేసేందుకు ఒక అధికారిక యాప్‌ని ప్రవేశ పెట్టారు.

ఇందులో రెండు రోజుల్లో 700 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ప్రజలు స్వయంగా చూసిన విషయాలని మాత్రమే రిపోర్ట్ చేయమని ప్రభుత్వం ప్రజలకి విజ్ఞప్తి చేసింది.

అధికారిక హాట్ లైన్‌లు మాత్రమే కాకుండా, ఆన్‌లైన్‌లో నియమాలని ఉల్లంఘించే వారిని బయటపెట్టే పేజీలు కూడా తెరిచారు. ఫేస్ బుక్‌లో సింగపూర్‌కి చెందిన కోవిడియట్ అనే గ్రూప్‌లో 26000 మంది సభ్యులు ఉన్నారు.

ఇందులో నియమాలని ఉల్లంఘించిన వారిని చాలా దూరం నుంచి, అపార్ట్‌మెంట్ బాల్కనీల నుంచి తీసిన చిత్రాలు పోస్ట్ చేశారు.

ఇతరుల పై ఫిర్యాదు చేయడం సాధారణం కాదా?

లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించిన వారి గురించి ఫిర్యాదు చేయడం నైతికమా కాదా అనే ప్రశ్నలు తలెత్తాయి.

సూపర్ మార్కెట్ దగ్గర, పార్క్‌ల దగ్గర తిరిగే వారందరికీ ఈ సందేహం కలుగుతుందని సిడ్నీ యూనివర్సిటీలో మోరల్ ఫిలాసఫర్‌గా పని చేస్తున్న డాక్టర్ హన్నా టీర్ని చెప్పారు.

"ఈ పరిస్థితుల్లో ఎవరితోనైనా మాట్లాడాలని ఉంటుంది. కానీ, వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు సామాజిక దూరం పాటిస్తే మంచిది’’ అని ఆయన అన్నారు.

ఏ కొంత మంది ఈ నియమాన్ని ఉల్లంఘించినా మిగిలిన అందరి శ్రమా వృధా అయిపోతుంది.

సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో సైకాలజీ పరిశోధకులు మిన్ జెంగ్ హౌ, లిల్లీ జియా సామాజిక దూరం పాటించటం లేదని ఫిర్యాదు చేయడానికి దోహదం చేసే కారణాల గురించి పరిశోధన చేస్తున్నారు.

“ఫిర్యాదు చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి ఒక దృఢమైన సామాజిక బాధ్యత దోహదం చేస్తుంది.”

“సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే అలా చేస్తారు” అని వారు అన్నారు.

అలాగే, ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలియకపోతే కూడా కొందరు ఫిర్యాదు చేయడానికి వెనకాడతారని చెప్పారు. వెరోనికా విషయంలో అదే జరిగిందని అన్నారు.

"అయితే ఈ సమయంలో బలహీనులపై పోలీసులు తమ అధికారం చూపిస్తే అది విచారకరమని హన్నా టిర్ని అన్నారు.

యూకేలో కూడా పోలీసులు నిబంధనల్ని ఉల్లఘించిన వారిపై ఫిర్యాదు చేయమని సూచించినప్పటికీ ఏది ఫిర్యాదు చేయాలి, ఏది చేయకూడదు అనే అంశాలపై చర్చ జరుగుతోంది.

అలాగే, బ్రిటిష్ పోలీసు వ్యవస్థ ‘‘పోలీసింగ్ బై కన్సెంట్’’.. అంటే పోలీసులు తమ పని తాము చేసేందుకు ప్రజలు సమ్మతించడం అనే దాని ఆధారంగా పనిచేస్తోంది. పోలీసులు తమపని తాము చేయాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఎవరినైనా అరెస్ట్ చేసి బంధించే అధికారం పోలీసులకు వస్తుంది.

ప్రజలు బయట నడిచేందుకు వెళ్లడం తప్పా కాదా అనే అంశంపై కొంత చర్చ జరిగిన తర్వాత, కొంత దూరం మేర నడవడానికి వెళ్లడం తప్పు కాదని నిర్ణయించారు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫిర్యాదు చేసే విధానం ఎంత సమర్ధవంతంగా పని చేస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న.

ఉదాహరణకి న్యూ యార్క్ నగరంలో ఇలాంటి ఉల్లంఘనల కోసం తెరిచిన హాట్ లైన్ అసలైన ఫిర్యాదుల కన్నా , ప్రాంక్ కాల్స్‌తో నిండిపోయింది.

“ప్రజలు మాట వినేటట్లు చేయడానికి నియమాలని ఉల్లఘించిన వారిని శిక్షించడం ఒక మార్గం. అయితే, అదొక్కటే పరిస్థితులు చక్కబడటానికి చేతిలో ఉన్న ఆయుధం కాకూడదు” అని డాక్టర్ టిర్ని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)