చైనాలో యాంటీ వైరస్ కార్లు నిజమా? గిమ్మిక్కా?

    • రచయిత, జస్టిన్ హార్పర్
    • హోదా, బీబీసీ న్యూస్

వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలని దృష్టిలో పెట్టుకుని చైనాలో కార్ల ఉత్పత్తిదారులు యాంటీ వైరస్ ఫీచర్లతో వాహనాలను ప్రవేశపెడుతున్నారు.

కొత్తగా తయారు చేసే మోడళ్ళు ఫేస్ మాస్క్ ఇచ్చే రక్షణని కార్ లోపల ఇస్తాయి.

గీలి లాంటి కొంత మంది పెద్ద ఉత్పత్తి దారులు ఇప్పటికే అలాంటి కార్లని మార్కెట్ లో లాంచ్ చేశారు. లండన్ బ్లాక్ క్యాబ్స్ ని గీలి తయారు చేస్తుంది.

కరోనావైరస్ వలన విధించిన లాక్ డౌన్ మూలంగా చైనాలో తొలి త్రైమాసికంలో కార్ల అమ్మకాలు బాగా పడిపోయాయి.

యాంటీ వైరస్ ఫీచర్స్ తో కార్లని తయారు చేసిన తొలి సంస్థ గీలి. అంతకు ముందు నుంచే నగరాలలో ఉన్న కాలుష్యం గురించి గీలి మోటార్ వాహనాల యజమానులని హెచ్చరిస్తోంది.

వాతావరణంలో ఉండే సూక్ష్మ కణాలు కారులోకి రాకుండా, డ్రైవర్లు, ప్రయాణం చేసేవారిని హానికారక పదార్ధాల నుంచి రక్షించాలన్నదే ఈ సంస్థ చేపట్టిన ‘హెల్త్ కేర్ ప్రాజెక్ట్' ఉద్దేశ్యం.

కార్ కంట్రోల్ లని, డోర్ హ్యాండిల్స్ ని బాక్టీరియా, వైరస్ రహితంగా చేయడానికి యాంటీ మైక్రోబియల్ పదార్ధాలని కూడా తయారు చేస్తోంది.

"చాలా మంది వినియోగదారులు తమ ఇంటి తర్వాత ఎక్కువ సమయం కార్లోనే గడుపుతారు. చాలా మందికి ఇది రెండవ ఇల్లు లాంటిది. ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా మాత్రమే ప్రజలు కోరుకుంటున్న అత్యున్నత జీవన ప్రమాణాలను అందించగలమని" గీలి ప్రతినిధి చెప్పారు.

కారు డ్రైవర్లు, ప్రయాణీకుల ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరమయ్యే ఫీచర్స్ ని అభివృద్ధి చేయడమే తమ దీర్ఘ కాలిక లక్ష్యమని చెప్పారు.

ప్రస్తుతం గీలి డ్రోన్ల ని ఉపయోగించి కొత్త కార్ల తాళాలని తమ వినియోగదారులకి అందిస్తోంది.

బ్రిటిష్ బ్రాండ్ ఎంజి స్వంతదారు ఎస్ఏఐసి , కార్ ఏసీ ద్వారా ప్రసరించే గాలిని శుభ్రపరచడానికి అల్ట్రా వయొలెట్ లైట్ ని ప్రవేశ పెట్టింది.

గీలి ప్రత్యర్థి గువాంగ్ ఝౌ ఆటోమొబైల్ (జి ఏ సి) తాము ఉత్పత్తి చేసే కొత్త మోడళ్ల పై మూడు స్థాయిలలో గాలిని శుభ్రపరిచే ఫిల్టరింగ్ విధానాన్ని వినియోగదారులకి అందించే ప్రయత్నాలు చేస్తోంది.

అయితే, ఈ కొత్త ఫీచర్లన్నీ కేవలం గిమ్మిక్కులేనని ఫ్రోస్ట్ & సల్లివాన్ పరిశోధన సంస్థ అంటోంది.

కార్లలో ఆరోగ్యానికి అవసరమయ్యే ఫీచర్లని ప్రవేశపెట్టడం పై దృష్టి ఉంది. అయితే, అంతకు ముందే తయారు చేస్తున్న వాటికి కోవిడ్ కాస్త బలాన్ని ఇచ్చిందని ఫ్రోస్ట్ & సల్లివాన్ నిపుణుడు వివేక్ వైద్య అన్నారు.

కొత్తగా ప్రవేశపెట్టే ఫీచర్ల వలన ప్రయాణీకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం మాత్రమే కాకుండా , కొన్ని బ్రాండ్లని ప్రత్యేకంగా నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించవచ్చని చెప్పారు. ఇది కేవలం చైనా కి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇది జరగవచ్చు,

అయితే, చైనా మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ షాన్ రీన్ దీనిని ఖండిస్తున్నారు. "కోవిడ్ 19 తో ప్రజల్లో నెలకొన్న భయాలని కంపెనీలు తమ ఉత్పత్తులు అమ్మడానికి వాడుకుంటూ వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని” అన్నారు.

2015 లో టెస్లా కాలుష్య రహిత ఫిల్టరేషన్ విధానాలతో కార్లని అమ్మింది. ఇవి చైనాలో చాలా ప్రాముఖ్యం పొందాయి. కంపెనీ బయో వెపన్ డిఫెన్స్ మోడ్ తో నగరాలలో కాలుష్యం గురించి ఆందోళన ఉన్నవారి కోసం ఉత్పత్తులని తయారు చేసింది.

“ప్రస్తుతం కార్ల ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయని ప్రచారం చేస్తున్నారు. నేను డాక్టర్ ని కానీ, శాస్త్రవేత్తని కానీ కాదు. కానీ,తమ ఉత్పత్తులు వైరస్ వ్యాప్తిని అరికడతాయని చెప్పే కంపెనీల ప్రకటనల పట్ల జాగ్రత్త వహించాలని”, రీన్ సూచించారు.

ఉపరితలాల నుంచి వైరస్ సోకకుండా కాపాడేందుకు యాంటీ వైరస్ కోటింగ్ పెయింట్ ని ప్రవేశ పెడుతున్నట్లు నిప్పన్ కంపెనీ ప్రకటించింది. అయితే, ఇది ప్రత్యేకంగా కరోనా వైరస్ గురించి చెప్పలేదు.

ఈ పెయింట్ ని హాస్పిటళ్లలో వాడటానికి తయారు చేసినట్లు సంస్థ చెప్పింది. ఇప్పటికే ఈ పెయింట్ ని వుహాన్ లో నాలుగు హాస్పిటళ్ళకి విరాళంగా ఇచ్చినట్లు తెలిపింది.

గత 20 ఏళ్లలో చైనాలో ఫిబ్రవరిలో కార్ల అమ్మకాలు మొదటి సారి 80 శాతం పడిపోయాయి. మార్చ్ లో పరిస్థితి కాస్త చక్కబడినట్లు కనిపించింది గాని, గత సంవత్సరం ఇదే నెలతో పోల్చి చూస్తే ఇది 43 శాతం తక్కువ.

ఏప్రిల్ లో ప్రజలు తిరిగి పనులకి వెళ్లడం ప్రారంభిస్తే ఈ అమ్మకాలు కాస్త పెరగవచ్చని భావిస్తున్నప్పటికీ , పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడటానికి సందేహాలు ఉండవచ్చు.

సామాజిక దూరం, స్వీయ నిర్బంధం ఇప్పటికే బాగా అలవాటు పడి ఉండటంతో అందరూ కాస్త జాగ్రత్తగానే ఉండటం సహజం. దీంతో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కన్నా తమ సొంత కార్ల లోనే ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. దీంతో కార్లకి డిమాండ్ పెరగవచ్చని యాక్సెంచర్ గ్రోత్ మర్కెట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియాన్ ఫ్రాంకో కసాటి అన్నారు.

కార్ల అమ్మకాలు పెంచడానికి చైనీస్ ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల పై రిబేట్ ఇవ్వడం , పాత కార్లని కొనుగోలు చేయడం లాంటి పనులు చేస్తోంది.

“కార్ల అమ్మకాలు ప్రీ కోవిడ్ స్థాయికి వెళ్లాలంటే ఇంకొక మూడు సంవత్సరాలు పడుతుందని”, తమ అధ్యయనం చెబుతోందని వైద్య అన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)