సాహర్ తాబార్: జైలులో నిర్బంధించిన ఇరానీ ఇన్‌స్ట్రాగ్రామ్ స్టార్‌కు ‘కరోనావైరస్’

ఇరాన్‌లో జైలులో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌కు కరోనావైరస్ సోకిందని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు.

ఫతేమే ఖీష్వాంద్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సాహర్ తాబార్‌గా ప్రసిద్ధి చెందారు. ఆమె ఏంజెలినా జోలీ జోంబీగా మారితే ఎలా ఉంటారనే వేషధారణతో ఫొటోలు పోస్ట్ చేయటం వల్ల పాపులర్ అయ్యారు.

ఆమెను దైవదూషణ, హింసను ప్రేరేపించటం ఆరోపణల మీద 2019 చివర్లో అరెస్ట్ చేశారు.

ఆమెకు జైలులో కరోనావైరస్ సోకిందన్న వాదనను షాహ్రే రే మహిళా జైలు అధికారి మెహిదీ మొహమ్మదీ తిరస్కరించారు.

మధ్య ఆసియాలో కరోనావైరస్ మరణాలు అత్యధికంగా ఇరాన్‌లోనే సంభవించాయి.

తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువగా ఉంది. ఈ వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 6,200 దాటింది. అయితే.. వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఖీష్వాంద్ తరఫు న్యాయవాది పాయమ్ డేరాఫ్షాన్.. ఇరాన్ న్యాయవ్యవస్థకు బహిరంగ లేఖ రాశారు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

తన కక్షిదారుకు కరోనావైరస్ లక్షణాలు కనిపించటంతో జైలులో క్వారంటైన్ విభాగానికి తరలించినట్లు ఆమె తల్లి తనకు తెలియజేశారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆరోపిత నేరాలు చేసినపుడు ఖీష్వాంద్ మైనర్ అని.. ఆమె కేసు ప్రాథమిక ప్రక్రియ ఇంకా పూర్తికానందున ఆమె తాత్కాలిక విడుదలకు అర్హత లభించలేదని కూడా ఆయన వివరించారు.

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ గత మార్చి నెలలో 85,000 మంది ఖైదీలను విడుదల చేసింది. వారిలో బ్రిటిష్-ఇరానియన్ స్వచ్ఛంద కార్యకర్త నజానిన్ జాఘారీ రాట్‌క్లిఫ్ కూడా ఉన్నారు.

2017లో ఖీష్వానంద్ ఇన్‌స్ట్రాగ్రామ్ ఫొటోలు వైరల్‌గా మారినపుడు ఆమె అంతర్జాతీయంగా పతాక శీర్షికలకు ఎక్కారు. ఆ తర్వాత ఆమె అకౌంట్‌ను తొలగించారు.

ఖీష్వానంద్ దాదాపు 50 కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నారన్న వార్తలతో సోషల్ మీడియా యూజర్లు చాలా మంది ఆందోళన వ్యక్తంచేశారు.

అయితే.. ఆ ఫొటోలను మేకప్ ద్వారా, ఫొటోషాప్ ద్వారా తయారు చేశామని ఆమె రష్యాకు చెందిన స్పుత్నిక్ న్యూస్ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

ఇరాన్‌లో చట్టాలను అతిక్రమించారన్న ఆరోపణలతో అరెస్టయిన సోషల్ మీడియా ప్రముఖుల సుదీర్ఘ జాబితాలో ఆమె కూడా చేరారు.

2018లో ఒక టీనేజ్ యువతి తను డాన్స్ చేస్తున్న వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేశారు.

అదే సంవత్సరం.. మషాద్ నగరంలోని ఒక మాల్‌లో పురుషులు, మహిళల సమూహం డ్యాన్స్ చేస్తున్న వీడియో దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించటంతో నగర అధికారి ఒకరిని అరెస్ట్ చేశారు.

2017లో జుంబా డ్యాన్స్ చేసినందుకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)