అమెరికా, చైనా వాణిజ్యం: ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఓ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా భారానికి కారణమైన అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ఒక అంగీకారానికొచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో దీనిపై మాట్లాడుతూ.. ఈ ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థలో మార్పు తెస్తుందని అన్నారు.
చైనా నాయకులు దీన్ని రెండు దేశాల విజయంగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరచుకునేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.
అమెరికా నుంచి దిగుమతులను 2017 నాటి స్థాయిని దాటి 20 వేల కోట్ల డాలర్లకు పెంచుతామని, మేధో సంపత్తి నిబంధనలను బలోపేతం చేస్తామని చైనా హామీ ఇచ్చింది.
చైనా ఉత్పత్తులపై ఇటీవల తాము విధించిన అధిక సుంకాలను తగ్గించడానికి అమెరికా అంగీకరించింది.
అయితే, సరిహద్దు పన్నుల్లో అత్యధికం ఇంకా అలానే ఉండడంతో మరోసారి చర్చలు అవసరమని వ్యాపారవర్గాలు అంటున్నాయి.
''ఇంకా చేయాల్సింది చాలా ఉంది'' అని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్లోని చైనా సెంటర్ అధ్యక్షుడు జెరెమీ వాటర్మన్ అన్నారు.

అమెరికా, చైనాలు ఒకరిపై మరొకరు పన్నులు భారం మోపుతూ 2018 నుంచి వాణిజ్య యుద్ధం చేస్తున్నారు. దీనివల్ల 45 వేల కోట్ల డాలర్ల విలువైన వివిధ వస్తువులపై అధిక సుంకాలు పడుతున్నాయి.
ఈ వాణిజ్య యుద్ధం రెండు దేశాల మధ్య వర్తకానికి అంతరాయమేర్పరచడమే కాదు ప్రపంచ ఆర్థిక వృద్ధిపైనా ప్రభావం చూపింది.
ఒప్పందాలపై సంతకాల సందర్భంగా వ్యాపారవేత్తలు, రిపబ్లికన్ డోనర్లు హాజరైన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా, చైనా సంబంధాల బలోపేతానికి ఈ ఒప్పందం వేదిక అవుతోందన్నారు.
గతంలో రెండు వైపుల నుంచీ జరిగిన తప్పులను దిద్దుకుంటున్నామని.. భవిష్యత్ ఆర్థిక న్యాయం, ఆర్థిక భద్రతను అందిస్తున్నామన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒప్పందంలో ఏముంది?
* అమెరికా నుంచి తమ దిగుమతులను 2017 స్థాయితో పోల్చితే కనీసం 20 వేల కోట్ల డాలర్లు పెంచేందుకు చైనా అంగీకరించింది. వ్యవసాయ రంగ కొనుగోళ్లు 3200 కోట్ల డాలర్లు, తయారీరంగంలో 7,800 కోట్ల డాలర్లు, ఇంధన రంగంలో 5,200 కోట్ల డాలర్లు, సేవారంగ దిగుమతులు 3,800 కోట్ల డాలర్లకు పెంచుతామని చైనా చెప్పింది.
* నకిలీ ఉత్పత్తుల తయారీపై కఠిన చర్యలు తీసుకునేందుకు చైనా అంగీకరించింది. వాణిజ్య రహస్యాలను దొంగిలించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కంపెనీలకు సులభతరమయ్యేలా చూస్తామని చెప్పింది.
* 36 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా వస్తువులపై అమెరికా గరిష్ఠంగా 25 శాతం వరకు సుంకాలు కొనసాగిస్తుంది. అమెరికాకు చెందిన 10 వేల కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై చైనా తాను విధించిన కొత్త సుంకాలనే కొనసాగించనుంది.
ఇవి కూడా చదవండి:
- విశాఖ రైల్వే జోన్ ప్రకటించి ఏడాదవుతోంది... అది ఎక్కడి దాక వచ్చింది
- అడవులను బూడిద చేస్తున్న అగ్నిజ్వాలలతో ఆస్ట్రేలియా ఎలా పోరాడుతోందంటే...
- అత్యాచారాలపై కేసులు పెట్టిన బాధితులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయా...
- ఉత్తరాంధ్ర మత్స్యకారులు: "పాకిస్తాన్ జైలులో మమ్మల్ని చాలా చులకనగా చూసేవాళ్లు.. చచ్చిపోదాం అనిపించేది"
- చైనా కరెన్సీ నోట్లపై చిరస్థాయిగా నిలిచిపోయిన 'ట్రాక్టర్ హీరోయిన్' ఇక లేరు
- నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయట్లేదు: దిల్లీ ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








