ఇరాన్ ప్రకటన: 'ఉక్రెయిన్ విమానాన్ని 'పొరపాటున' మేమే కూల్చాం'

ఉక్రెయిన్ పౌర విమానాన్ని'పొరపాటున' కూల్చామని ఇరాన్ సైన్యం చెప్పిందని ఆ దేశ అధికారిక టీవీ చానల్ వెల్లడించింది.

'మానవ తప్పిదం' కారణంగా ఆ దాడి జరిగిందంటూ శనివారం నాడు ఇరాన్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. అందుకు బాధ్యులైన వారిని గుర్తిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారని టీవీ చానల్ తెలిపింది.

బుధవారం నాడు టెహ్రాన్ సమీపంలో ఆ విమానం కూలిపోవడానికి కారణం ఇరాన్ ప్రయోగించిన క్షిపణే అంటూ వినిపించిన ఆరోపణలను ఇరాన్ ఇంతకుముందు తోసిపుచ్చింది.

మిసైల్ దాడికి పేలిపోయిన ఉక్రెయిన్ అంతర్జాతీయ విమానం పీఎస్752లో 176 మంది ప్రయాణికులున్నారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన కొన్ని గంటలకే ఈ విమానం కూలిపోయింది.

అమెరికా మీద ప్రతీకారదాడులు చేయాలని భావించిన ఇరాన్ ఆ విమానాన్ని యుద్ధ విమానంగా భావించి దాడికి పాల్పడి ఉంటుందని అమెరికా మీడియాలో అప్పటికే కొన్ని కథనాలు వచ్చాయి.

ఆధారాలు క్షిపణి దాడి జరిగినట్లు చూపిస్తున్నా, ఇరాన్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పింది.

అయితే విమానం కూలిన ప్రాంతంలో గురువారం ఒక బుల్ డోజర్‌ శిథిలాలు తొలగిస్తున్నట్లు కనిపించడంతో, కీలకమైన ఆధారాలను తొలగించారని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జవద్ జరీఫ్ ఒక ట్వీట్ చేశారు.

"ఉక్రెయిన్ విమానాన్ని కూల్చడానికి అమెరికా 'సాహసకృత్యాలు' కూడా కొంతవరకూ కారణమని" ఆయన ఆరోపించారు.

"జరుగుతోంది ప్రపంచం అంతా చూస్తోంది. విమానంలో ప్రయాణించిన వారి కుటుంబాలు నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నాయి" అని శుక్రవారం కెనడా విదేశాంగ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ ఇరాన్‌ను హెచ్చరించారు.

అంతకు ముందు రోజు ఉక్రెయిన్ విమానాన్ని ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణితో ఇరాన్ కూల్చేసినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చెప్పారు.

న్యూయార్క్ టైమ్స్ ప్రసారం చేసిన ఒక వీడియోలో రాత్రి చీకట్లో ఒక క్షిపణి విమానాన్ని ఢీకొనడం కనిపించింది. పది సెకన్ల తర్వాత అది నేలపై పడగానే ఒక భారీ పేలుడు శబ్దం వినిపించింది.

కూలిన విమానంలో మృతిచెందినవారిలో 82 మంది ఇరాన్ ప్రజలు, 57 మంది కెనడా వారు, 11 మంది ఉక్రెయిన్ వారు ఉన్నారు. వీరితోపాటు స్వీడన్, బ్రిటన్, అఫ్గానిస్తాన్, జర్మనీ ప్రయాణికులు కూడా ఉన్నారు.

ఇరాన్ ప్రకటన ఏం చెబుతోంది?

"పొరపాటున ఉక్రెయిన్ విమానం PS752ని క్షిపణితో కూల్చేశామని ఇరాన్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసిందని" ఇరాన్ టీవీ శనివారం ఉదయం చెప్పింది.

ఆ విమానం దేశ ఇస్లామిక్ వ్యవస్థను కాపాడేందుకు ఏర్పాటైన రివల్యూషనరీ గార్డ్స్ సైనిక కేంద్రానికి దగ్గరగా వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు.

"అమెరికాతో ఉద్రిక్తతలు పెరగడంతో ఆ సమయంలో ఇరాన్ సైన్యం చాలా అప్రమత్తంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మానవతప్పిదం వల్ల పొరపాటున క్షిపణి విమానాన్ని తాకింది" అని చెప్పారు.

సైన్యం తమ ప్రకటనలో విమానాన్ని కూల్చినందుకు క్షమాపణలు కోరింది. "భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తమ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తామని" చెప్పింది.

క్షిపణి ప్రయోగానికి బాధ్యులైనవారిపై విచారణ చేపడతామని చెప్పింది.

ఇరాన్ అంతకు ముందు ఏం చెప్పింది?

ఇరాన్ సైన్యం తాజా ప్రకటన, అది ఇటీవల చేసిన ప్రకటనలకు భిన్నంగా ఉంది. శుక్రవారం విమాన ప్రమాదంపై మాట్లాడిన ఇరాన్ తాము అసలు క్షిపణితో దానిని కూల్చలేదని చెప్పింది

"మాకు తెలిసిన వివరాల ప్రకారం, విమానం కచ్చితంగా క్షిపణి వల్ల కూలిపోలేదు" అని ఇరాన్ పౌర విమానయాన సంస్థ(సీఏఓఐ) చీఫ్ అలీ అబెద్జదేహ్ చెప్పారు.

ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి అలీ రబేయ్ ఈ వార్తలను 'మానసిక యుద్ధం'గా వర్ణించారు.

కానీ, ఆధారాలు క్షిపణి దాడి జరిగిందనే సూచించాయి. దీనిపై పారదర్శక విచారణ జరగాలనే వాదనలు గట్టిగా వినిపించాయి.

ముందెప్పుడూ జరగని విధంగా 2014 జులైలో ప్రయాణికుల విమానంపై క్షిపణి దాడి జరిగింది.

రష్యా తయారీ క్షిపణితో ఉక్రెయిన్ మీదుగా ఎగురుతున్న మలేసియా ప్రయాణికుల విమానం ఎంహెచ్ 17ను కూల్చేశారు. ఈ ప్రమాదంలో 298 మంది మృతిచెందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)