ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మిలిటెంట్ సంస్థ సీనియర్ కమాండర్, భార్య మృతి

ఫొటో సోర్స్, AFP
గాజా స్ట్రిప్లో 'పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్(పీఐజే)' అనే మిలిటెంట్ గ్రూప్ అత్యంత సీనియర్ కమాండర్లలో ఒకరిని వైమానిక దాడిలో ఇజ్రాయెల్ చంపేసింది.
బహా అబూ అల్-అటా అనే ఈ కమాండర్ ఇంటిపై ఇజ్రాయెల్ క్షిపణిని ప్రయోగించడంతో ఆయనతోపాటు భార్య చనిపోయారని పీఐజే తెలిపింది.
అల్-అటా ఒక 'టైంబాంబు' అని, ఉగ్రవాద దాడులకు అతడు సన్నాహాలు చేస్తున్నాడని ఇజ్రాయెల్ చెప్పింది.
గాజా నగరంలోని షెజాఇయా డిస్ట్రిక్ట్లోని ఓ భవనం మూడో అంతస్తులో అల్-అటా దంపతులు నిద్రపోతుండగా ఇజ్రాయెల్ ఈ దాడి జరిపిందని పాలస్తీనాలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అల్-అటా దంపతుల పిల్లలు నలుగురు, ఒక పొరుగింటి వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.
అల్-అటా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని పీఐజే ప్రకటించింది. అల్-అటా మృతి నేపథ్యంలో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పై రాకెట్ల దాడులు జరిగాయి. దాదాపు 50 రాకెట్లను ప్రయోగించారు. వీటిలో కొన్ని గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ నగరం సోడెరాట్ను తాకాయి.
పీఐజేకు ఇరాన్ మద్దతు ఉంది. గాజాలో పీఐజే రెండో అతిపెద్ద మిలిటెంట్ సంస్థ.
ఇటీవలి నెలల్లో పీఐజే ఇజ్రాయెల్పై ఉగ్రవాద దాడులకు, చాలా రాకెట్ దాడులకు పాల్పడిందని, మరిన్ని ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం చెప్పింది.

ఫొటో సోర్స్, AFP
సిరియా రాజధాని డమాస్కస్లో దాడి; ఇద్దరి మృతి
అల్-అటా చనిపోయిన సమయంలోనే సిరియా రాజధాని డమాస్కస్లో పీఐజే మరో సీనియర్ నేత అక్రమ్ అల్-అజౌరీ నివాసంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపిందని సిరియా ప్రభుత్వ వార్తాసంస్థ సనా తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని, 10 మంది గాయపడ్డారని చెప్పింది.
మృతుల్లో అల్-అజౌరీ ఉన్నాడా, లేదా అన్నది స్పష్టం కాలేదు. మృతుల్లో అతడి కొడుకు మోవజ్ ఉన్నాడని సిరియా వార్తాసంస్థ సనా పేర్కొంది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు.
పీఐజే కేంద్ర కార్యాలయం డమాస్కస్లో ఉంది. ఇది గాజా స్ట్రిప్లోనూ కార్యకలాపాలు సాగిస్తుంది.

ఖండించిన హమాస్
గాజా స్ట్రిప్ను నియంత్రించే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ 'హమాస్'కు పీఐజేను ప్రత్యర్థిగా భావిస్తారు. అయితే అల్-అటాను చంపేయడాన్ని హమాస్ ఖండించింది. ఈ హత్యకు ఇజ్రాయెల్ శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించింది.
గాజా స్ట్రిప్, డమాస్కస్లలో ఇజ్రాయెల్ దాడులు సోమవారం రాత్రి జరిగాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పెరిగిన ఉద్రిక్తతలను ఈ దాడులు సూచిస్తున్నాయి.
మధ్యధరా సముద్రం, ఇజ్రాయెల్, ఈజిప్టు మధ్య 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పున గాజాస్ట్రిప్ విస్తరించి ఉంది. ఇక్కడ సుమారు 19 లక్షల మంది నివసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్లో 5,300 కోట్ల బ్యారెళ్ల నిల్వలున్న కొత్త చమురు క్షేత్రం కనుగొన్నాం - అధ్యక్షుడు రౌహానీ
- బెంజమిన్ నెతన్యాహు: ఇజ్రాయెల్ ఆర్మీ కమాండో నుంచి.. ఐదోసారి దేశ ప్రధాని రేసు వరకూ...
- కాలాపానీని భారత్లో చూపించినందుకు నేపాల్కు కోపం ఎందుకు?
- టీఎన్ శేషన్ కన్నుమూత: ఎవరికీ భయపడని భారత ఎన్నికల కమిషనర్... దేశ రాజకీయ నేతలే ఆయన బ్రేక్ఫాస్ట్
- షావొమీ 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్: పిక్సెల్ పెరిగితే ఫొటో క్వాలిటీ పెరుగుతుందా
- టిక్ టాక్ యాప్తో దేశ భద్రతకు ప్రమాదమా?
- పెద్ద నోట్ల రద్దు: ‘రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్’
- మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








