స్కూలు నుంచి ఇంటికెళ్లాలంటే.. రెండు విమానాలు మారాలి, 5 రోజులు కొండలు ఎక్కాలి

చదువుకునేందుకు పట్టణానికి వెళ్లి పన్నెండేళ్ల పాటు ఇంటి ముఖం చూడకుండా అక్కడే ఉండేందుకు మీ చిన్నారిని వదిలేయగలరా?
అన్నేళ్ల పాటు తన బిడ్డను చూడకుండా ఉండేందుకు సాధారణంగా ఏ తల్లీ అంగీకరించదు. కానీ, నేపాల్లోని మారుమూల గ్రామాల తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం అలాంటి క్షోభను భరించక తప్పట్లేదు.
అలా నాలుగేళ్ల ప్రాయంలో ఇళ్లు వదిలి సుదూర ప్రాంతంలోని పట్టణంలో చదువుకుని 12 ఏళ్ల తర్వాత ఇటీవల సొంతూరికి వెళ్లిన కొందరు టీనేజీ విద్యార్థుల ప్రయాణం ఒక అద్భుతమైన డాక్యుమెంటరీగా మారింది.
హిమాలయాల్లోని మారుమూల గ్రామానికి చెందిన ఈ బాలుడి పేరు జీవన్ మహాతర. నేపాల్ రాజధాని కఠ్మాండూలో చదువుకుంటున్నాడు. 12 ఏళ్ల తర్వాత అమ్మానాన్నలను చూసేందుకు సొంతూరికి వెళ్లాడు.
"మా అమ్మానాన్నలను చూసి పన్నెండేళ్లు అవుతోంది. వాళ్ల ముఖాల్లో నవ్వు మాత్రమే నాకు ఇప్పుడు గుర్తుంది. ఆ నవ్వు వెనుక ఎంతో క్షోభను చూశాను" అని జీవన్ చెప్పాడు.
నేపాల్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న కొన్ని మారుమూల గ్రామాలకు ఏమాత్రం రవాణా సదుపాయాలు లేవు. అక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే సాహస యాత్ర చేయాల్సిందే.
ఆ గ్రామాల్లోని కొందరు తల్లిదండ్రులు చదువు కోసం తమ పిల్లలను పట్టణాలకు పంపుతున్నారు. కానీ, ఆ పిల్లలు కొన్నిసార్లు పదేళ్లు గడిచినా తిరిగి సొంతూరికి వెళ్లలేకపోతున్నారు.

కఠ్మాండూలో స్నోలాండ్ అనే స్కూలును ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. పేద, గ్రామీణ పిల్లలకు ఈ పాఠశాలలో ఉచిత విద్య అందిస్తారు. అత్యంత పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు.
ఆ పాఠశాలలోనే జీవన్ కూడా చదవుకుంటున్నాడు.
అతడు తన సొంతూరికి వెళ్లాలంటే 2 విమానాలు మారాలి, దాదాపు 5 రోజులపాటు ట్రెక్కింగ్ చేయాలి.

"స్నోలాండ్ స్కూల్లో చేరినప్పుడు నా వయసు నాలుగేళ్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మా కుటుంబంతో ఎన్నడూ మాట్లాడలేదు. ఎందుకంటే, మా ఊరికి ఎలాంటి కమ్యూనికేషన్
సదుపాయం లేదు. ఇప్పుడు మా ఊరు కూడా కఠ్మాండూలా మారిపోయి ఉంటుందనుకున్నాను. కానీ, చూశాక అర్థమైంది. మా ఊరు ఏమీ మారలేదు. పారిశుద్ధ్యం గురించి అక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు." అని జీవన్ వివరించాడు.

ఫొటో సోర్స్, Wall Productions
పన్నెండేళ్ల తర్వాత ఇంటికెళ్లిన జీవన్ తన తల్లిని చూడగానే గుర్తుపట్టలేకపోయాడు.
"ఆమె మా అమ్మేనా? కాదా? అనిపించింది. మా అమ్మ వయసు మీదపడిపోయింది. నన్ను చూడగానే అమ్మ ఎంతో సంతోషపడింది. నన్ను ఒక విద్యావంతుడిలా చూసింది. అందుకు నాకెంతో ఆనందం వేసింది" అని జీవన్ చెప్పాడు.
జీవన్ కథ ఒక అద్భుత డాక్యుమెంటరీగా మారింది.
"మా అమ్మానాన్నలకు మెరుగైన జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే, నా చదువు కోసం వాళ్లు 12 ఏళ్లకు పైగా త్యాగం చేశారు. కాబట్టి, మా ఊరికి వెళ్తాను, అభివృద్ధి చేస్తాను" అంటున్నాడు జీవన్.
ఇవి కూడా చదవండి
- రోహిత్ శర్మ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- 99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు
- నమ్మకాలు-నిజాలు: పీరియడ్స్ ఆపే మాత్రలు వేసుకోవడం మంచిదా, కాదా
- కిమ్-పుతిన్: తొలిసారిగా భేటీ కానున్న ఉత్తర కొరియా, రష్యా నాయకులు
- శ్రీలంక పేలుళ్లు న్యూజిలాండ్ మసీదుల్లో దాడులకు ప్రతీకారంగా జరిగినవా?
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









