You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#Balakot: భారత వైమానిక దాడులపై పాకిస్తాన్లో ప్రత్యక్ష సాక్షి కథనం : బీబీసీ ఎక్స్క్లూజివ్
భారత వైమానిక దాడి గురించి పాకిస్తాన్కు చెందిన ప్రత్యక్ష సాక్షి మహ్మద్ ఆదిల్ బీబీసీతో మాట్లాడారు.
బాంబు పేలుళ్లు జరిగిన సందర్భంలో తన అనుభవం గురించి మాట్లాడారు.
''నాపేరు మహ్మద్ ఆదిల్. మేం ఇక్కడే జాబా గ్రామంలో ఉంటాం.
తెల్లవారుజామున 3గంటలకు పెద్ద శబ్దం వచ్చింది.
పిడుగు పడ్డ శబ్దంలా అనిపించింది. ఇక మేం నిద్రపోలేదు. 5-10నిమిషాల తర్వాత, అవి బాంబులు పేలిన శబ్దాలని మాకు తెలిసింది'' అన్నారు.
''బాంబులు పేలిన చోట మా బంధువులు ఉన్నారు.
మా బంధువు ఒకరు గాయపడ్డారు. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. మొత్తం 5 బాంబుపేలుళ్లను, విమానాల చప్పుళ్లను విన్నాం.
ఉదయాన్నే కొన్ని బాంబు శకలాలను, నాలుగైదు ఇళ్లు నేలమట్టం అవ్వడం చూశాము'' అని ఆదిల్ వివరించారు.
''బాలాకోట్ సమీపంలోని నిషేధిత జైషే మొహమ్మద్ స్థావరంపై ఈ రోజు తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపాం'' అని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ గోఖలే మంగళవారం దిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు.
భారత దాడులపై స్పందించే హక్కు తమకుందని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాలశాఖ చెప్పింది.
తమ దాడుల్లో జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ బావమరిది మౌలానా యూసుఫ్ అజర్ (అలియాస్ ఉస్తాద్ ఘోరీ) ఆధ్వర్యంలోని అతిపెద్ద శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేశామని, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని గోఖలే తెలిపారు. మృతుల్లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేవారు, సీనియర్ కమాండర్లు, జిహాదీలు ఉన్నారని చెప్పారు.
పర్వతాల మీద ఉన్న ఈ శిబిరంపై సాధారణ పౌరుల ప్రాణాలకు హాని లేకుండా వైమానిక దాడులు జరిపామని గోఖలే తెలిపారు. ఇది సైనిక చర్య కాదని, ఉగ్రవాద నిరోధక దాడి అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)