నేపాల్‌: హిమాలయాల్లో ఎనిమిది మంది పర్వతారోహకుల ప్రాణాలు తీసిన మంచు తుపాను

నేపాల్ మంచు తుపాన్ పర్వతారోహకులు

నేపాల్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. అక్కడున్న చాలా క్యాంపులు ధ్వంసమయ్యాయి. ఎనిమిది తొమ్మిది మంది పర్వతారోహకులు చనిపోయారు.

నలుగురు నేపాలీ గైడ్ల సహాయంతో దక్షిణ కొరియాకు చెందిన ఐదుగురు సభ్యుల బృందం పర్వతారోహణకు బయలు దేరింది. అయితే, మంచు తుపాన్ సంభవించడంతో వారంతా గుర్జా బేస్ క్యాంపులో చిక్కుకుపోయారని శనివారం పోలీసులు తెలిపారు.

బేస్ క్యాంప్ ప్రాంతంలో 8 మంది మృతదేహాలు గుర్తించినట్లు హెలికాప్టర్‌ ద్వారా సహాయ చర్యలు చేపట్టడానికి వచ్చిన బృందం నిర్ధరించింది. మరో వ్యక్తి జాడ ఇంకా తెలియరాలేదు.

అదనంగా ఆక్సిజన్ వాడకుండా ప్రపంచంలో ఎత్తైన 14 పర్వతాలను వేగంగా అధిరోహించిన దక్షిణ కొరియా పర్వతారోహకుడు కిమ్ చాంగ్ -హో కూడా మృతిచెందినవారిలో ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది.

''మంచు తుపాను కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చెట్లు కుప్పకూలాయి. టెంట్లు ధ్వంసమయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.'' అని పోలీసు అధికార ప్రతినిధి శైలేశ్ తపా ఏఎఫ్‌పీ మీడియాకు తెలిపారు.

మృతుల బృందంలోని సభ్యులు అక్టోబరు 7న పర్వతారోహణకు బయలుదేరారు. 24 గంటలు గడిచినా వారి నుంచి సమాచారం రాకపోవడంతో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే సంఘటన స్థలానికి కాలినడకన వెళ్లేందుకు పోలీసులు, రెస్య్యూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న హెలికాప్టర్ ఆదివారం తిరిగి వచ్చే అవకాశం ఉంది.

నేపాల్‌లోని అన్నపూర్ణ పరిధిలో ఉన్న గుర్జా పర్వతం ఎత్తు 7,193 మీటర్లు. సమీప గ్రామం నుంచి ఇక్కడున్న బేస్ క్యాంపుకు వెళ్లాలంటే ఒక రోజు మొత్తం ట్రెక్కింక్ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)