అక్షయ్ కుమార్: పొగాకు ఉత్పత్తుల బ్రాండ్‌కు ప్రకటనతో ఆన్‌లైన్‌లో ట్రోల్స్.. క్షమాపణ చెప్పిన నటుడు

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ఒక వాణిజ్య ప్రకటన (యాడ్) వివాదాస్పదమైంది.

ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తున్నాయి. ట్విటర్‌లో ఆయన పేరు కూడా ట్రెండ్ అవుతోంది.

ట్రోల్స్, మీమ్స్, విమర్శల నడుమ తన అభిమానులకు అక్షయ్ కుమార్ క్షమాపణలు చెప్పారు.

ఇంతకీ ఈ వివాదం ఎలా మొదలైంది? నెటిజన్లు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? వీటిపై అక్షయ్ కుమార్ ఏమన్నారు?

పొగాకు ఉత్పత్తులపై ప్రకటన

ఓ పొగాకు ఉత్పత్తుల బ్రాండ్‌ కోసం తాజాగా అక్షయ్ కుమార్ ఒక యాడ్‌లో నటించారు. దీనిలో ఆయన ఆ పొగాకు బ్రాండ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ కనిపించారు.

ఈ బ్రాండ్ కోసం ఇప్పటికే బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్‌లు కూడా యాడ్‌లు చేశారు.

అయితే, ధూమపానానికి దూరంగా ఉండాలని చెప్పే ప్రకటనలో అక్షయ్ కుమార్ ఇదివరకు నటించారు.

దీంతో ఒకప్పుడు ధూమపానం వద్దని, ఇప్పుడు పొగాకు ఉత్పత్తులు వాడాలని సూచించడంపై ఆన్‌లైన్‌లో ఆయనపై ట్రోల్స్ వెల్లువెత్తాయి.

నెటిజన్లు ఏమన్నారు?

బాలీవుడ్ నటుల ద్వంద్వ వైఖరులకు తాజా ప్రకటన నిదర్శనమని ఓ ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు.

‘‘అక్షయ్ కుమార్.. ఇది సిగ్గుచేటు. మొదట్లో ధూమపానంతో ఆరోగ్యానికి హానికరమని చెప్పారు. ప్రజలు దీనికి దూరంగా ఉండాలని అన్నారు. ఇప్పుడు పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ప్రకటనలో నటించారు. ఇది ద్వంద్వ వైఖరికి నిదర్శనం’’అని ఆయన అన్నారు.

‘‘అక్షయ్ కుమార్.. మొదట తాను ప్రమోట్ చేసిన పొగాకు ఉత్పత్తులతో క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్లీ తానే ప్రమోట్ చేసిన పాలసీ బజార్ నుంచి ఆరోగ్య బీమాతో సాయం చేస్తారు’’అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

‘‘ఫూఫూ అని సిగరెట్ ఊదడంలో హీరోగిరీ లేదు. తూ.తూ అని ఊయడంలో ఉంది’’అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

అక్షయ్ కుమార్ కేసరి సినిమాలోని సీన్‌ వాయిస్‌ను మార్చి ఓ నెటిజన్ మీమ్‌గా పోస్ట్ చేశారు.

వీటిపై అక్షయ్ కుమార్ ఏమన్నారు?

తాజా విమర్శల నడుమ ట్విటర్ వేదికగా అక్షయ్ కుమార్ స్పందించారు. తన అభిమానులకు ఆయన క్షమాపణలు చెప్పారు.

‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. గత కొన్ని రోజులుగా మీ స్పందనలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. నేను పొగాకు ఉత్పత్తిని ప్రమోట్ చేయలేదు. ఇకపై చేయను కూడా. విమల్ ఇలాచీ ప్రకటన విషయంలో మీ స్పందనలను నేను అర్థం చేసుకోగలను’’అని అక్షయ్ వివరించారు.

‘‘ఆ ప్రకటన నుంచి సంపాదించిన మొత్తాన్ని నేను మంచి పని కోసం ఖర్చు చేస్తాను. ఆ ప్రకటన బహుశా కాంట్రాక్ట్ ముగిసేవరకు కొనసాగుతూ ఉండొచ్చు. కానీ, భవిష్యత్‌ ప్రకటనల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాను’’అని ఆయన ట్వీట్ చేశారు.

ఇదివరకు మహేశ్ బాబు ప్రకటన విషయంలోనూ...

టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు గతంలో చేసిన ఓ పొగాకు ఉత్పత్తి ప్రకటన కూడా ఇలానే విమర్శలకు కారణమైంది.

2021లో మహేశ్ బాబు ఈ యాడ్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

‘‘ఏ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలో మహేశ్ బాబు లాంటి నటులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది చాలా చెత్త నిర్ణయం’’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

‘‘అది ఇలాచీ కాదు గుట్కా. ఇలాంటి స్టార్‌హీరో ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు? గుట్కా కొనండి.. ఉచితంగా క్యాన్సర్ తెచ్చుకోండి అని చెప్పాలని అనుకుంటున్నారా? ఇలాంటి ప్రకటనలతో వారు చాలా డబ్బులను సంపాదిస్తున్నారు’’అని ఓ ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అక్షయ్ కుమార్ కూడా ఇలాచీ ఉత్పత్తిని ప్రమోట్ చేస్తూ వివాదంలో చిక్కుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)