You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పిడుగుపాటు: రాజస్థాన్లో సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగులు పడి 11 మంది మృతి - Newsreel
రాజస్థాన్లోని జైపుర్లో ఆదివారం పిడుగుపాటుకు 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.
12శతాబ్దంనాటి అమేర్ కోటకు చెందిన క్లాక్టవర్పైకి ఎక్కి ప్రజలు సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో క్లాక్టవర్పై 27 మంది ఉన్నారు. వీరిలో కొందరు భయంతో పైనుంచి కిందకు దూకేసినట్లు అధికారులు వెల్లడించారు.
‘‘ఈ కోటకు పర్యటకులు ఎక్కువగా వస్తుంటారు. ప్రస్తుతం మరణించిన వారిలో చాలా మంది యువతే ఉన్నారు’’అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఒక్క ఆదివారంనాడే రాజస్థాన్లో వేర్వేరుచోట్ల పిడుగుపాటుకు మరో తొమ్మిది మరణించినట్లు స్థానిక మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.
యూపీలో పిడుగుపాటుకు 28 మంది మృతి
మరోవైపు ఉత్తర్ప్రదేశ్లోనూ పిడుగుపాటుకు 28 మంది మరణించారు. ఒక్క ప్రయాగ్రాజ్లోనే 13 మంది చనిపోయారు.
మృతుల సంఖ్య ఇక్కడ మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. చాలా మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. మరోవైపు డజన్లకొద్దీ పశువులు కూడా పిడిగుపాటు వల్ల మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
దేశంలో 2004 నుంచి పిడుగుల వల్ల ఏటా దాదాపు 2,000 మంది మరణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)