కరోనావైరస్: 'దిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కోవిడ్-19'

దేశ రాజధాని దిల్లీ నగర జనాభాలో దాదాపు ప్రతి నలుగురిలో ఒకరికి కరోనావైరస్ సోకినట్లు ఒక నమూనా సర్వే సూచిస్తోంది.

ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో.. 21,387 మంది రక్త నమూనాలను పరీక్షించగా వారిలో 23.48 శాతం మందిలో కరోనావైరస్‌కు సంబంధించిన యాంటీబాడీస్ కనిపించాయి. అంటే వారికి ఈ వైరస్ సోకి ఉండటమో, సోకి తగ్గటమో జరిగిందని అర్థం.

నగరంలో నిర్ధారిత కేసుల సంఖ్య సూచించే దానికన్నా చాలా ఎక్కువగా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు ఈ సర్వే సూచిస్తోంది.

దిల్లీలో ఇప్పటివరకూ 1,23,747 కేసులు ఉన్నాయి. ఇది మొత్తం 1.98 కోట్ల నగర జనాభాలో ఒక శాతంతో సమానం.

అయితే.. రాండమ్‌గా నిర్వహించిన సాంపిల్ సర్వే 23.44 శాతం మందికి వైరస్ సోకినట్లు సూచిస్తోంది. ఆ లెక్కను నగర జనాభా సంఖ్యకు అన్వయిస్తే కరోనా సోకిన వారు 46.5 లక్షల మంది ఉండాలి.

ఈ తేడా.. ''వైరస్ సోకిన వారిలో చాలా ఎక్కువ మందికి ఎటువంటి లక్షణాలూ కనిపించటం లేద''ని చెప్తున్నట్లు ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

దిల్లీలోని పలు ప్రాంతాల్లో జనాభా చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి సర్వేలో కనిపించిన 23.48 శాతం సంఖ్య కూడా తక్కువే కావచ్చునని కూడా ఆ ప్రకటన చెప్తోంది.

అలాగే గణనీయ సంఖ్యలో జనాభాకు ఇంకా వైరస్ ముప్పు పొంచివుందని.. అన్ని రకాల రక్షణ చర్యలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఉద్ఘాటించింది.

కరోనావైరస్‌కు సంబంధించి ఇటువంటి నమూనా సర్వే నిర్వహించటం భారతదేశంలో ఇదే మొదటిసారి. వైరస్ వ్యాప్తి గురించి మరింత మెరుగైన అవగాహన పొందటానికి ఈ సర్వే కీలకమని నిపుణులు చెప్తున్నారు.

పరీక్ష సదుపాయాలను మెరుగుగా పంపిణీ చేయటానికి, ప్రాంతాల వారీగా నిర్దిష్ట కంటైన్‌మెంట్ విధానాలను రూపొందించటానికి ఈ సర్వే దోహదపడుతుంది.

భారతదేశంలో కరోనా మహమ్మారి బలంగా దెబ్బతీసిన ప్రాంతాల్లో దిల్లీ ఒకటి. జూన్ నెలలో తొలి రెండు వారాల్లో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది.

అప్పటి నుంచి ఆస్పత్రి సదుపాయాలను మెరుగుపరిచారు. రోజు వారీ నమోదయ్యే కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.

దిల్లీలో గడచిన రెండు వారాల్లో రోజుకు 1,200 నుంచి 1,600 వరకూ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందలి నెల జూన్ చివరి వారంలో రోజు వారీగా నమోదైన కేసుల సంఖ్యలో దాదాపు సగం.

సోమవారం నాడు రాజధాని నగరంలో కేవలం 954 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

పరీక్షలు, ట్రేసింగ్, కంటైన్‌మెంట్, ఐసొలేషన్ గణనీయంగా పెరగటం వల్ల కేసుల సంఖ్య తగ్గినట్లు చెప్పవచ్చు.

నగరంలో కోవిడ్ మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)