ఇండియా లాక్ డౌన్‌: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వలస కూలీలు

    • రచయిత, విజువల్ డేటా టీమ్
    • హోదా, బీబీసీ

ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రధాని మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని ప్రకటించారు. దేశంలో అనేక సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో లక్షలాది వలస కార్మికుల బ్రతుకు రోడ్డున పడింది. రవాణా సౌకర్యాలు కూడా ఆగిపోవడంతో రోజు కూలి మీద ఆధారపడే కార్మికులు తమ సొంత ఊళ్ళకి వెళ్ళడానికి కాలి నడకన బయలుదేరారు.

లాక్ డౌన్ ప్రకటించిన రోజు దగ్గర నుంచి దేశంలో నమోదు అయిన రోడ్డు ప్రమాదాలలో అనేక మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో సగటున ప్రతి రోజు సాధారణ పరిస్థితుల్లో గంటకి 17 మంది రోడ్ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతారు. అయితే, లాక్ డౌన్ విధించినప్పటి నుంచి చోటు చేసుకున్న రోడ్ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయింది వలస కార్మికులే అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ సమయంలో సాధారణ జన స్రవంతి ఎవరూ రోడ్ల పై లేరు.

కరోనావైరస్ సామాజిక వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ని ప్రకటించింది. మోదీ ప్రజలని ఇంటి వద్దనే ఉండి, సామాజిక నిర్బంధాన్ని పాటించమని విజ్ఞప్తి చేశారు. అయితే, ఇది అందరికీ వీలు అవ్వలేదు. వేలాది మంది వలస కార్మికులు తమ సొంత ఊళ్ళకి వెళ్లిపోవడానికి బస్సు స్టేషన్లకి, రైల్వే స్టేషన్లకి తరలి వెళ్లారు.

మార్చ్ 30 నాటికి ... కరోనా వైరస్ మరణాలు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఇదే సమయంలో లాక్ డౌన్ కారణంగా రోడ్ ప్రమాదాల వలన, ఇతర ఆరోగ్య పరిస్థితుల వలన మరో 20 మరణాలు నమోదు అయ్యాయి.

బీబీసీ పరిశీలించిన ఇతర మీడియా రిపోర్టుల ప్రకారం, మొత్తం నాలుగు రోడ్ ప్రమాదాలు జరగగా అందులో రెండు అనారోగ్య కారణాల వలన, మరొకటి మరో కారణం వల్ల చోటు చేసుకున్నాయి.

రోడ్డు ప్రమాదాలు

హైదరాబాద్ దగ్గర పెద్ద గోల్కొండ వద్ద జరిగిన ఒక రోడ్ ప్రమాదంలో 8 మంది మరణించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక పేర్కొంది. మరణించిన వారిలో ఓపెన్ ట్రక్‌లో ప్రయాణం చేస్తున్న వలస కార్మికులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కర్నాటకలోని తమ ఇళ్లకు వెళుతుండగా ఒక లారీ ఢీకొని ఈ ప్రమాదం జరిగింది.

లాక్ డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి తెలంగాణలో అనేక మంది వలస కార్మికులు పనులు కోల్పోయారు.

రెండు వేర్వేరు ప్రమాదాల్లో గుజరాత్ లోని ఆరుగురు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

మార్చ్ 28 వ తేదీన మహారాష్ట్ర నుంచి గుజరాత్ లోని తమ స్వస్థలాలకు నడిచి వెళుతున్న నలుగురు వలస కార్మికుల్ని పెరోల్ గ్రామం దగ్గర ముంబై - అహ్మదాబాద్ హైవే మీద వేగంగా వస్తున్న ట్రక్ ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.

అదే రోజు గుజరాత్ లోని వల్సాడ్ దగ్గర ఇద్దరు మహిళా కార్మికులు ప్రమాదానికి గురై మరణించారు. వాళ్ళు రైల్వే క్రాసింగ్ దాటుతుండగా, సరుకులు రవాణా చేస్తున్న రైలు వేగంగా రావడంతో పట్టాల కింద పడి చనిపోయారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఈ మహిళలు లాక్ డౌన్ వలన తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు.

మార్చి 29 వ తేదీన కుండ్లి మానేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే మీద ఒక వాహనం ఢీకొని మరో నలుగురు మరణించినట్లు ఏ ఎన్ ఐ వార్తా సంస్థ పేర్కొంది. వీరంతా హై వే మీద నడుస్తూ వెళుతున్నట్లు తెల్పింది.

ఆరోగ్య కారణాలు

మార్చి 26వ తేదీన మధ్యప్రదేశలోని మోరెనాలో ఉన్న తన ఇంటికి వెళుతూ మార్గ మధ్యంలో 37 ఏళ్ల వ్యక్తి మరణించారు.

రన్వీర్ సింగ్ దిల్లీలో ఫుడ్ డెలివరీ మ్యాన్‌గా పని చేస్తుండేవారు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి వెళుతుండగా ఈ మరణం చోటు చేసుకుంది. అతను మధ్య దారిలో కళ్ళు తిరిగి పడి చనిపోయారు.

మార్చి 27 వ తేదీన గుజరాత్‌లోని సూరత్ లో 67 సంవత్సరాల వ్యక్తి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతుండగా దారిలో చనిపోయారు.

8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని ఇంటికి వెళ్ళడానికి హాస్పిటల్ నుంచి అతనికి ఎటువంటి వాహనం దొరకలేదు. అతను దారిలో స్పృహ కోల్పోయి పడిపోగా, హాస్పిటల్ వారు అతను మరణించారని ధృవీకరించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)