దిల్లీ: కరోనావైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి.. ‘మొదటి మూడు రోజులు మాటలు కూడా సరిగా రాలేదు’

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు వెయ్యి కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వ్యాధి సోకి దేశంలో ఇప్పటి వరకు 27 మంది మరణించారు. దాదాపు వంద మంది ఈ వ్యాధి నుంచి కోలుకోగలిగారు.

ఆ వంద మందిలో దిల్లీకి చెందిన రోహిత్ దత్తా ఒకరు. బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఏం చెప్పారో చదవండి.

నేను యూరప్ నుంచి తిరిగి రాగానే రాత్రి జ్వరం వచ్చింది. నా శరీర ఉష్ణోగ్రత 99.5 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పెరిగింది. విమానంలో సుదీర్ఘ ప్రయాణం చేయడం వల్ల అలసిపోవడంతో అలా అయ్యిందేమో అనుకుకున్నాను.

ఆ తర్వాత డాక్టర్‌‌కు చూపించుకున్నాను. డాక్టర్ కొన్ని మాత్రలు ఇచ్చారు. అవి మూడు రోజులు వేసుకున్నా జ్వరం తగ్గలేదు. దాంతో అనుమానం వచ్చి ఫిబ్రవరి 29న, కరోనావైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటానని వైద్యుడికి చెప్పాను.

మరుసటి రోజు నాకు పరీక్షలు చేశారు. అందులో పాజిటివ్‌ అని తేలింది. దిల్లీలో కరోనావైరస్ సోకిన మొదటి రోగిని నేనే.

ప్రభుత్వం నుంచి ఒక బృందాన్ని మా ఇంటికి పంపింది. నన్ను ఎవరెవరు కలిశారో అందరినీ తీసుకెళ్లి పరీక్షలు చేశారు. వారందరికీ నెగెటివ్ అని వచ్చింది.

నన్ను తీసుకెళ్లి ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు. అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించారు.

ఈ వైరస్ మహమ్మారితో పోరాటం ఒక యుద్ధం లాంటిదని అందరూ అర్థం చేసుకోవాలి. చైనాలో కరోనావైరస్ సోకిన వారిని గుడారాలలో ఉంచి వైద్యం చేశారు. కాబట్టి సౌకర్యాల కంటే ఆరోగ్యం ముఖ్యమని ప్రజలు గ్రహించాలి. వైద్యులకు సహకరించాలి.

మొదటి మూడు-నాలుగు రోజులు నా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మాటలు కూడా సరిగా రాలేదు. నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. కాబట్టి మా వాళ్లతో టచ్‌లో ఉండేవాడిని.

కొంచెం జ్వరం వచ్చినట్లు అనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. బయట తిరగకూడదు. విశ్రాంతి తీసుకోవడం మంచిది.

నేను కూడా బాగా విశ్రాంతి తీసుకున్నాను. కొద్ది రోజులకు ఆరోగ్యం కుదుటపడింది. ఆస్పత్రిలోనే ఫోన్‌లో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం ప్రారంభించారు.

14 రోజుల ఒంటరితనం ఒక వ్యక్తిని మార్చేస్తుందని నేను చెప్పగలను. అలాంటి సమయంలో తాను ఏం తప్పు చేశానన్న దాని గురించి మనిషి ఆలోచిస్తాడు.

ఆరోగ్యం బాగాలేకుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మరచిపోకండి. మీరు ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా తిరిగి ఇంటికి వస్తారు. ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)