కరోనా లాక్‌డౌన్: తెలంగాణ రాష్ట్రంలోని 3 లక్షల మంది వలస కార్మికులకు అన్నం పెట్టేదెవరు?

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ తెలుగు

"మా దగ్గర సరుకులు అయిపోతున్నాయి. మాకు తరువాత భోజనం ఎక్కడ దొరుకుతుందో తెలీదు. ఇది నెలాఖరు. ఇంటికి పంపేంత డబ్బు కూడా లేదు మా దగ్గర. ఇప్పుడు మేం చేయగలిగిందంతా ఇంట్లో వాళ్లతో మాట్లాడి ఆశ కల్పించడమే'' హైదరాబాద్‌లో కూలీగా పనిచేసే రామచంద్ర యాదవ్ చెప్పిన మాటలివి.

రామచంద్ర యాదవ్ ఝార్ఖండ్‌లోని గిరిడి జిల్లా నుంచి వచ్చారు. ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఇక్కడకు వచ్చారు. చాలా కాలం పాటూ చిన్నా చితకా పనులు చేసి, భవన నిర్మాణ కూలీగా చేసి, మొత్తానికి జ్యూస్ అమ్ముకోవడానికి ఒక తోపుడు బండి కొనగలిగారు. తనతో పాటు ఝార్ఖండ్‌కు చెందిన 20 మంది కలిసి హైదరాబాద్‌లోని ట్రూప్ బజారులో మూడు గదులు ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటామని బీబీసీతో రామచంద్ర చెప్పారు.

"మేమంతా ఇక్కడకు బతుకుదెరువు కోసం వచ్చాం. కొంత మంది తోపుడు బండ్లపై జ్యూస్ అమ్ముతాం. కొందరు సర్వర్లుగా పనిచేస్తున్నారు. ఇంకొందరు భవన నిర్మాణ కూలీలుగా చేస్తున్నారు. మాకు, ఊళ్లో ఉన్న మా కుటుంబాలకు మా సంపాదనే ఆధారం. మేం ఏడాదికి ఒక్కసారే ఊరు వెళ్తాం. మాలో చాలా మంది రోజుకు 500 నుంచి 600 రూపాయలు సంపాదిస్తారు" అని ఆయన చెప్పారు.

రామచంద్ర లాంటి ఎందరో వలస కూలీలు తమ బతుకు బావుంటుందన్న ఆశతో హైదరాబాద్ వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి వచ్చిన లాల్ బహదూర్‌కి లాక్‌డౌన్ అంటే జీతం వస్తుందో రాదో తెలియని పరిస్థితి.

"ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాను. ఒక కాంట్రాక్టరు దగ్గర పెయింటర్‌గా పనిచేస్తున్నాను" అని ఆయన చెప్పారు. ముషీరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర ఆయన ఉంటున్నారు.

"నేనిక్కడ పనిచేయబట్టి నెల అయ్యింది. నాతో పాటూ రూంలో ఇంకొకరు ఉంటారు. కానీ ఇప్పుడు మా దగ్గర సరుకులు అయిపోతున్నాయి. మరోవైపు జీతం వస్తుందో రాదో తెలియని పరిస్థితి" అని ఆయన చెప్పారు.

వీళ్లే కాదు. పనిలేని ఇలాంటి ఎందరో చాలా ఇబ్బందులుపడుతున్నారు. ఫాతిమా, ఆమె భర్త మజీద్‌లు చెత్త వేరుచేసే వ్యాపారం పైనే బతుకుతున్నారు. కానీ, ఇప్పుడు ఇద్దరికీ పనిలేక ఇంట్లోనే ఉంటున్నారు. "ప్రస్తుతానికి కొంత అప్పు చేశాను. కానీ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం ఉంది" అన్నారు ఫాతిమా.

ప్రభావతి ఇళ్లల్లో పనిచేస్తుంటారు. ఆమె భర్త శేఖర్ కూలీ పనులకు వెళ్తారు. ప్రస్తుతానికి వీళ్ల దగ్గర గతంలో దాచుకున్న కొంచెం డబ్బు ఉంది. దాంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. "నేను రెండిళ్లలో పనిచేస్తాను. కరోనావైరస్ భయంతో ఇక పనిలోకి రావద్దని వాళ్లు చెప్పేశారు. కానీ నాకింకా మార్చి నెల డబ్బులు రావాలి. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలీదు" అంటూ ఆందోళనతో చెప్పారు ప్రభావతి. ఆమె నెలకు 3 వేల సంపాదిస్తారు.

ప్రభుత్వ సాయం వీరికి అందుతుందా?

మరోవైపు పేదల కోసం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.లక్షా 70 వేల కోట్లతో సాయం ప్రకటించారు. జన్‌ధన్ ఖాతాలలో పేదలకు కొంత నగదు బదిలీ చేస్తామని చెప్పారు. పేదలందరికీ జన్ ధన్ యోజన ఖాతాలు లేవు.

"మాకు చదువు రాదు. పనుల కోసం వచ్చి ఇక్కడ ఉంటున్నాం. మాకు బ్యాంకు ఖాతాలు ఎలా వస్తాయి? మాకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు లేదు. నా జీతం నగదు రూపంలోనే వస్తుంది. నేను మా అమ్మ ఖాతాలో డబ్బు వేస్తాను. వాళ్లు తీసుకుని వాడుకుంటారు'' అని రామచంద్ర చెప్పారు. లాల్ బహదూర్ పరిస్థితి కూడా దాదాపు అదే.

ప్రభావతికి మాత్రం జన్ ధన్ ఖాతా ఉంది. ఆ ఖాతా ఉన్న మహిళలకు వచ్చే మూడు నెలలూ నెలకు రూ.500 చొప్పున ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇదే కాకుండా ఆమెకు ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండరు ఉచితంగా వస్తుంది.

ఇక తెలంగాణ ప్రభుత్వం తెల్లకార్డు ఉన్న వారికి 1500 రూపాయల నగదు బదిలీ ప్రకటించింది. 87 లక్షల 59 వేల తెల్లరేషన్ కార్డుల ద్వారా 2 కోట్ల 83 లక్షల మందికి ఇది వస్తుంది.

అయితే, ప్రభావతీ, మౌలాలీలో ఆమె ఇంటి దగ్గర్లో ఉండే చాలా మంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇళ్లల్లో పనిచేసే వారే. అందులో కొంత మందికి రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సాయం ప్రకటించింది. అక్కడ తెల్ల కార్డు దారులకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. మార్చి 29 నుంచి 12 కిలోల బియ్యం, కిలో పప్పు కూడా వారికి ఇవ్వబోతున్నారు.

"ఇది కష్ట సమయం. పేద కుటుంబాలకు ఏప్రిల్ 4న 1000 రూపాయలు ఇవ్వబోతున్నాం. గ్రామ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఇస్తారు'' అని మార్చి 22న ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.

అయితే, రాష్ట్రంలో ఉండని వారి విషయంలో ఏం చేస్తారన్నది స్పష్టత లేదు. చాలా అనుమానాలు, భవిష్యత్తుపై భయాలు ఉన్నాయని జాతీయ పని మనుషుల వేదిక ప్రాంతీయ కన్వీనర్ లిస్సీ జోసెఫ్ అన్నారు.

కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవంటున్నారు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి. "మహిళ ఖాతాల్లో 500 రూపాయలు వేయడం సరిపోదు. జన్‌ ధన్ ఖాతాలకూ, పేదలందరికీ నెలకు 5 వేల రూపాయల చొప్పున మూడు నెలలు వేయాలని మేం కోరుతున్నాం'' అన్నారు ఏచూరి.

భిక్షాటన, సెక్స్ వర్క్ ద్వారా డబ్బు సంపాదించే రజితకు ఇప్పుడంతా శూన్యంగా ఉంది. "నేను రైల్వే స్టేషన్ల దగ్గర అడుక్కుంటాను. ఇప్పడంతా మూసేసి ఉంది. మా బతుకు ఏరోజుకారోజే'' అంటూ నిస్సహాయంగా చెప్పారు రజిత.

వలస కూలీలే కాదు, ఆటో డ్రైవర్లు, ఇళ్లల్లో పనులు చేసే వారు కూడా లాక్ డౌన్ ఇబ్బందులు అనుభవిస్తున్నారు. చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్ వచ్చి, ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో ఉండిపోయారు.

సిలిగురికి చెందిన రిటీ చౌదరి తన 17 ఏళ్ల కూతురిని వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువచ్చారు. వాళ్లు మార్చి 21న ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. "మేం వచ్చిన రోజే సాయంత్రం డాక్టరు చూశారు. ఇంటికి వెళ్లిపోయి మళ్లీ మూడు నెలల తరువాత రావాలని డాక్టరు చెప్పారు. మాకు మార్చి 23కి రైలు టికెట్ ఉంది కానీ, ఆ రైలు రద్దయింది. ఇంకెలా వెళ్లాలా? అని ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపు లాక్ డౌన్ ప్రకటించేశారు" అంటూ ఆమె చెప్పారు.

ప్రస్తుతం రోజుకు 1600 రూపాయలు చెల్లిస్తూ లాడ్జీలో ఉంటున్నారు ఈ తల్లీ కూతుళ్లు. "నేను మా ఊళ్లో కలప అమ్ముతాను. నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోగా, అప్పుచేసి నా కూతురుని తీసుకుని వచ్చాను. ఇప్పడు తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్నాయి. మాకు ప్రస్తుతం దయతో భోజనం పెడుతున్న వారిపై ఆధారపడి బతుకుతున్నాం'' అని ఆమె అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి?

రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భవన నిర్మాణదారుల సంఘంతో సమావేశమై వలస కూలీల పరిస్థితిపై సమీక్షించారు.

"తిండి, కనీస సౌకర్యాలు, వైద్యం అంబాటులో ఉండాలి" అని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రస్తుతానికి ఇల్లులేని దాదాపు 500 మంది జీహెచ్ఎంసీ నిర్వహిస్తోన్న 17 షెల్టర్లలో ఉంటున్నట్టు అధికారులు తెలిపారు.

తిండిలేని వారికి భోజనం అందించేందుకు కొందరు స్వచ్ఛంద సేవకులు ముందుకు వచ్చారు. ఖలీదా పర్వీన్ వంటి వారు వలస కూలీలున్న చోటకు వెళ్లి తాను వండి తెచ్చిన భోజనం పెడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం హరేకృష్ణ ఫౌండేషన్‌తో కలసి ప్రభుత్వ క్యాంటీన్లు తెరిచి ఉంచుతోంది. మొత్తం 150 ఉండగా వాటిలో 78 -80 తెరచి ఉన్నాయి. వీటిలో భోజనం ఉచితంగా పెడతారు. "రాత్రి భోజనానికి కూడా ఏర్పాట్లుచేస్తున్నాం. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పనిచేయగలుగుతాం'' అన్నారు జిహెచ్ఎంసీ అధికారి ఒకరు.

‘‘12,436 బృందాలు, అంటే దాదాపు 3 లక్షలకు పైగా వలస కార్మికులు రాష్ట్రంలో ఉన్నారు. వారంతా తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు. వాళ్ళ బాగోగులు మనం చూసుకోవాలి. వాళ్లను వెంటనే గుర్తించమని కలెక్టర్లకు చెప్పాను. వారిలో ఎక్కువ మంది రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో ఉన్నారు. పెద్దపల్లి, ఖమ్మం, రామగుండాల్లో కూడా కొందరున్నారు. వాళ్లకు తెల్లకార్డు లేకపోయినా 12 కేజీల బియ్యం, రూ.500 నగదు ఇస్తాం. రాష్ట్రంలో ఎవరినీ ఆకలితో ఉండనివ్వం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)