కశ్మీర్: శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆందోళన ప్రదర్శనలో ఘర్షణ

కశ్మీర్‌లోని సౌరా ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల తర్వాత జరిగిన ఆందోళన ప్రదర్శన హింసాత్మకంగా మారింది.

ఆందోళనకారులకు, భద్రతదళాలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులు రాళ్లు రువ్వగా, భద్రతదళాలు వారిపై టియర్ గ్యాస్, పెల్లెట్స్ ప్రయోగించాయి.

వందల సంఖ్యలో ప్రజలు ఈ ఆందోళన ప్రదర్శనలో పాల్గొన్నారు.

జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ మూడు వారాల క్రితం భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇంటర్నెట్, మొబైల్ సేవలను ప్రభుత్వం నిలిపివేయడంతో అక్కడి సమాచారం కూడా పెద్దగా బయటకు రావడం లేదు.

ఘర్షణలో ఓ వ్యక్తి కంటి నుంచి రక్తం కారుతూ కనిపించాడని, అతడి మెడకు కూడా గాయం అయ్యిందని బీబీసీ ప్రతినిధి ఆమిర్ పీర్జాదా తెలిపారు.

అయితే, మొత్తంగా ఎంత మందికి గాయపడ్డారన్నదానిపై స్పష్టత రాలేదు. పెల్లెట్స్ గాయాలతో ఆస్పత్రులకు వెళ్తే అరెస్టు చేస్తారన్న భయంతో చాలా మంది ఆందోళనకారులు చికిత్సకు వెళ్లరు.

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు సౌరా ప్రాంతం కేంద్రంగా మారుతోంది.

ఆర్టికల్ 370 సవరణ ఇలా..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని సవరించడం ద్వారా ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం తొలగించింది.

జమ్ము-కశ్మీర్ రాష్ట్రం స్థానంలో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకదాని పేరు జమ్ము-కశ్మీర్, ఇంకోదాని పేరు లద్దాఖ్.

రెండు కేంద్ర పాలిత ప్రాంతాలూ లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలోకి వస్తాయి.

జమ్ము, కశ్మీర్లో అసెంబ్లీ ఉంటుంది. లద్ధాఖ్‌లో అసెంబ్లీ ఉండదు.

అక్కడ భద్రత స్థితి, సీమాంతర ఉగ్రవాదం వల్లే వాటికి కేంద్ర పాలిత ప్రాంతాల హోదా ఇచ్చామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు.

అయితే, భారత ప్రభుత్వం ఏకపక్షంగా తమ ప్రత్యేక అధికారాలను లాక్కుందంటూ కశ్మీరీలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)