ఐపీఎల్-2019 విజేత ముంబయి ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌పై 1 పరుగు తేడాతో విజయం

ఐపీఎల్ విజేతలు

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది.

ముంబయి ఇండియన్స్ నాలుగో సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్-12లో ముంబయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడించింది.

గెలుపు కోసం చెన్నై సూపర్ కింగ్స్ 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా లసిత్ మలింగ బౌలింగ్‌కు వచ్చాడు.

మలింగ ప్రతి బంతినీ లైన్ అండ్ లెంత్ తప్పకుండా వేస్తూ మ్యాచ్‌ను ముంబయి ఇండియన్స్ వైపు మలుపు తిప్పాడు.

చివరి ఓవర్లో మలింగ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి చివరి బంతికి శార్దూల్ ఠాకూర్‌ను ఎల్బీడబ్ల్యు చేయడంతో విజయం ముంబయి ఇండియన్స్‌ను వరించింది.

అద్భుత బౌలింగ్‌తో 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన జస్‌ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

150 పరుగుల విజయ లక్ష్యంతో మైదానంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ఫాఫ్ డు ప్లెసి, షేన్ వాట్సన్ ఇన్నింగ్స్ ధాటిగానే ప్రారంభించారు.

చెన్నై

ఫొటో సోర్స్, ALLSPORT/GETTY IMAGES

33 పరుగుల దగ్గర నాలుగో ఓవర్ చివరి బంతికి డు ప్లెసిస్(26) అవుటయ్యాడు.

తర్వాత వచ్చిన సురేశ్ రైనా, అంబటి రాయుడు, కెప్టెన్ ఎంఎస్ ధోనీ వెంటవెంటనే అవుటవడంతో చెన్నై సూపర్ కింగ్స్ కష్టాలు మొదలయ్యాయి.

70 పరుగుల దగ్గర రాహుల్ చాహర్ వేసిన పదో ఓవర్ 3వ బంతికి సురేశ్ రైనా(8) పరుగులకు ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.

తర్వాత బుమ్రా బౌలింగ్‌లో డి కాక్‌కు క్యాచ్ ఇచ్చిన అంబటి రాయుడు ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.

82 పరుగుల దగ్గర చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయ్యాడు.

హార్దిక్ పాండ్యా వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి వాట్సన్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా, ఇషాన్ కిషన్ చేసిన త్రోకు ధోనీ రనౌట్ అయ్యాడు.

ధోనీ రనౌట్

ఫొటో సోర్స్, Getty Images

చాలాసేపు రీప్లేలు పరీక్షించిన థర్డ్ అంపైర్లు చివరికి ధోనీకి అవుట్ ఇచ్చారు.

రెండో వైపు వాట్సన్ ముంబయి బౌలర్లను ఎదుర్కుంటూ స్కోరును ముందుకు నడిపించాడు.

16వ ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు వంద దాటింది. అదే ఓవర్లో ఓపెనర్ షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తైంది.

బుమ్రా వేసిన 19వ ఓవర్లో డ్వేన్ బ్రావో(15) అవుట్ అవడంతో చెన్నైకి మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి.

18వ ఓవర్లో ఓపెనర్ షేన్ వాట్సన్ హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టడంతో చెన్నై విజయం వైపు వెళ్తున్నట్టే కనిపించింది. కానీ, మ్యాచ్ ఉత్కంఠ అంతా చివరి ఓవర్‌కు చేరుకుంది.

ముంబయి ఇండియన్స్

ఫొటో సోర్స్, Mumbai Indians/facebook

ఫొటో క్యాప్షన్, చివరి ఓవరుతో ముంబయిని గెలిపించిన మలింగ

చివరి బంతి వరకూ ఉత్కంఠ

చివరి ఓవర్లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరంకాగా, ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ఆ ఓవర్‌ను మలింగకు అప్పగించాడు.

20 ఓవర్ తొలి బంతికి వాట్సన్ ఒక పరుగే చేశాడు.

20 ఓవర్ రెండో బంతికి జడేజా ఒక పరుగు చేశాడు.

20 ఓవర్ మూడో బంతికి వాట్సన్ రెండు పరుగులు రాబట్టాడు.

20 ఓవర్ నాలుగో బంతికి వాట్సన్ రనౌట్ అయ్యాడు.

20 ఓవర్ ఐదో బంతికి ఠాకూర్ రెండు పరుగులు చేశాడు.

20 ఓవర్ చివరి బంతి రెండు పరుగులు చేయాల్సి ఉండగా శార్దూల్ ఠాకూర్ ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.

దీంతో ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ముంబయి వశమైంది.

చెన్నై జట్టులో టాప్ స్కోరర్ షేన్ వాట్సన్ 59 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి.

ముంబై బౌలర్లలో జస్పీత్ బుమ్రా 2, రాహుల్ చహర్, కృణాల్ పాండ్య, మలింగ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ముంబై బ్యాటింగ్

ఫొటో సోర్స్, Mumbai Indians/ facebook

149 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్ జోరుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ 45 దగ్గర ఓపెనర్స్ ఇద్దరూ అవుటైపోవడంతో కష్టాల్లో పడింది.

శార్దూల్ ఠాకూర్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి 29 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్.. వికెట్ కీపర్ ఎం.ఎస్ ధోనీకి క్యాచ్ ఇవ్వగా, తర్వాత ఓవర్ వేసిన దీపక్ చాహర్ మూడో బంతికి రోహిత్ శర్మ కూడా ధోనీకే క్యాచ్ అందించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులకే అవుటైపోవడం ముంబయి ఇండియన్స్ అభిమానులను నిరాశపరిచింది.

తర్వాత జట్టు స్కోరు 82 దగ్గర మూడో వికెట్ పడింది. సూర్యకుమార్ యాదవ్(15) ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు.

మరో ఏడు పరుగుల తర్వాత కృణాల్ పాండ్య(7) కూడా భారీ షాట్ కొట్టబోయి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు.

శార్దూల్ ఠాకూర్ క్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కృణాల్ క్యాచ్ పట్టిన శార్దూల్ ఠాకూర్

బంతి వేసిన తర్వాత కృణాల్ కొట్టిన షాట్‌ను అందుకోడానికి ముందుకు పరిగెత్తిన శార్దూల్ ఒకసారి అది మిస్సైనా రెండోసారి ఒడిసి పట్టాడు.

101 స్కోర్ దగ్గర ముంబయి ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చాడు.

తర్వాత హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్, ముంబయి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య జట్టు స్కోరును 140 వరకూ తీసుకొచ్చారు.

ఇక జట్టు స్కోరు పెరుగుతుందని భావించిన ముంబయి అభిమానులకు దీపక్ చాహర్ మరోసారి షాక్ ఇచ్చాడు. దూకుడు పెంచాలనుకున్న హార్దిక్ పాండ్య(16) 19వ ఓవర్ మూడో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు.

హార్దిక్ డీఆర్ఎస్ కోరినా ఫలితం లేకుండాపోయింది.

తర్వాత ఒక వైపు పొలార్డ్ ధాటిగా ఆడుతున్నా అతడికి తోడు నిలిచే బ్యాట్స్‌మెన్ కరువయ్యారు.

రాహుల్ చాహర్, మిచెల్ మెక్ క్లింఘన్ ఇద్దరూ వెంటవెంటనే డకౌట్ అవ్వడంతో స్కోరు 150 పరుగుల లోపే ఉండిపోయింది.

అందరూ అవుటవుతున్నా ఒకవైపు జోరు చూపించిన కీరన్ పొలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 3 సిక్సర్లు, 3 పోర్లున్నాయి.

నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ముంబయి ఇండియన్స్ 8 వికెట్లు కోల్పోయి 149 మాత్రమే చేయగలిగింది.

చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 26 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్ చెరి రెండు వికెట్లు తీశారు.

ఐపీఎల్ హైదరాబాద్

ఫొటో సోర్స్, TWITTER/IPL

ధోనీ - రోహిత్... ఎవరు గెలిచినా రికార్డే...

ఐపీఎల్ - 2019లో ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి.

ఇటు ఎంఎస్ ధోనీ అభిమానులు, అటు రోహిత్ శర్మ అభిమానులు కూడా ఎవరికివారు తమకిష్టమైన ఆటగాడి నాయకత్వంలోని జట్టే గెలవాలని కోరుకుంటున్నారు.

ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ లేదా రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న ముంబయి ఇండియన్స్‌లో ఎవరు గెలిచినా అది ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు కాబోతోంది.

అందుకు కారణం, ఈ రెండు జట్లూ చెరో మూడుసార్లు ట్రోఫీ గెలవడమే. ఈ రోజు మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టు నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.

హైదరాబాద్ ఐపీఎల్
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ చూసేందుకు వచ్చిన క్రికెట్ ఫ్యాన్

చెన్నై, ముంబయి మధ్య నాలుగో ఫైనల్

చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం ఇది నాలుగోసారి.

తొలిసారి 2010లో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై గెలిచింది.

అనంతరం 2013, 2015 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లలోనూ ఈ రెండు జట్లే తలపడ్డాయి. ఈ రెండు సందర్భాల్లోనూ ముంబయికి విజయం దక్కింది.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై జట్టు ఇంతకుముందు ఏడుసార్లు ఫైనల్‌కు చేరి మూడుసార్లు విజయం అందుకోగా... ముంబయి ఇంతకుముందు నాలుగుసార్లు ఫైనల్‌కు చేరి మూడుసార్లు గెలిచింది.

ఐపీఎల్

హైదరాబాద్‌లో సందడే సందడి

హైదరాబాద్‌లో ఆదివారం (12.05.2019) సాయంత్రం ఐపీఎల్ ఫైనల్. క్రికెట్ ఫ్యాన్స్‌కు సందడే సందడి. నగరంలో ఇప్పుడు అన్ని దారులూ ఉప్పల్ స్టేడియం వైపే దారి తీస్తున్నాయన్నట్లుంది.

ఐపీఎల్ హైదరాబాద్

రెండేళ్ల తరువాత ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ మళ్ళీ హైదరాబాద్‌కు వచ్చింది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దారులన్నీ బారులు తీరిన వాహనాలతో నిండిపోయాయి.

ఐపీఎల్

ఉప్పల్ స్టేడియం చుట్టూ ఈ మధ్యాహ్నం నుంచే కోలాహలం మొదలైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)