కుంభమేళా 360 VIDEO: పాప ప్రక్షాళన కోసం పోటెత్తిన 22 కోట్ల మంది.. మోక్షం కోసం ఎదురుచూపులు

మీ కంప్యూటర్లో 360 వీడియోను వీక్షించటానికి క్రోమ్, ఒపెరా, ఫైర్ఫాక్స్ లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేటెస్ట్ వెర్షన్ అవసరం.
మొబైల్ ఫోన్లో ఈ వీడియోను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్లో యూట్యూబ్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో ఓపెన్ చేయాలి.
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో జనం గుమిగూడే సంబరంగా కుంభమేళా ఖ్యాతి గడించింది. ఈ కుంభమేళాలో అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి.
ఉత్తర్ ప్రదేశ్లోని అలహాబాద్ (ఇటీవలే ప్రయాగ్రాజ్ అని పేరు మార్చారు) నగరంలో.. గంగా - యమున నదులు సంగమించే చోట శతాబ్దాలుగా కుంభమేళా జరుగుతోంది.
అయితే గత రెండు దశాబ్దాలుగా ఇది అత్యంత భారీ కార్యక్రమంగా మారింది.

ఫొటో సోర్స్, Ankit Srinivas
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. 'మాఘ మేళా' పేరుతో చిన్నస్థాయి మేళా ప్రతి ఏటా నిర్వహిస్తారు.
ఈ ఏడాది జనవరి - మార్చి నెలల మధ్య దాదాపు 22 కోట్ల మంది కుంభమేళాను సందర్శించారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.
ఈ నదుల సంగమంలో స్నానం చేస్తే తమ పాపాల ప్రక్షాళన జరుగుతుందని, జననమరణాల చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం సిద్ధిస్తుందని హిందువులు విశ్వసిస్తారు.
ఈ పండుగలో సాధువులు విశిష్టంగా ప్రజలను ఆకర్షిస్తారు. వారు నీటిలో స్నానం చేసి 'హర్ హర్ గంగే' అని నినాదాలు చేస్తూ తమ శరీరాలకు బూడిద పూసుకుంటూ నాట్యం చేస్తూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Ankit Srinivas
అయితే.. ఈ దృశ్యాల వెనుక.. కల్పవాసీలు అనే వృద్ధుల సమాజం ఒకటి.. మోక్షం, ఆధ్యాత్మిక పరిపూర్ణత కోరుతూ ఈ నదుల ఒడ్డునే నెల రోజుల పాటు నివసిస్తారు.
వీరిలో చాలా మందికి ఈ పండుగ కేవలం ఒక ఆధ్యాత్మిక సమాహారం మాత్రమే కాదు. తమ ఒంటరి జీవితాల నుంచి కాస్త విరామంగా కూడా దీన్ని భావిస్తారు.
బీబీసీ వర్చువల్ రియాలిటీ చిత్ర బృందం.. గిరిజా దేవి (68), మనోరమ మిశ్రా (72) అనే ఇద్దరు కల్పవాసి మహిళలను అనుసరించింది. వారిద్దరూ ఇక్కడే తొలిసారి కలుసుకున్నారు. స్నేహితులుగా మారారు.

ఫొటో సోర్స్, Ankit Srinivas
''భారతీయ గ్రామాల్లోని వృద్ధుల్లో ఒంటరితనం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. చాలా మంది యువతీ యువకులు చదువులు, ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లారు. వారి పెద్దలను ఊళ్లలోనే విడిచివెళ్లారు. కానీ మాకు మరో మార్గం లేదు. వారి జీవితాలు, జీవనాధారాలు కూడా ముఖ్యమే'' అంటారు మనోరమ మిశ్రా.
''నాకు నలుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు నాతోనే నివసిస్తున్నారు. అందుకే కుంభమేళాకు రావటం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ఇక్కడ నా వయసున్న వారిని నేను కలుస్తాను. మేమంతా ఒక కుటుంబంగా మసలుకుంటాం'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Ankit Srinivas
గిరిజా దేవిది కూడా ఇదే తరహా కథ. ''నాకు పెళ్లయిన రెండు మూడేళ్లకే.. నేను చాలా పొట్టిగా ఉన్నానంటూ నా భర్త నన్ను వదిలేశాడు. అప్పుడు నా తండ్రి నా సంరక్షణ చూసుకున్నాడు. కానీ ఆయన కూడా 15 సంవత్సరాల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి నేను నా గ్రామంలో ఒంటరి జీవితం గడుపుతున్నాను'' అని ఆమె చెప్పారు.
''కొన్నిసార్లు చాలా రోజుల పాటు నేను మాట్లాడటానికి ఒక్క మనిషి కూడా ఉండరు. ఆ ఒంటరితనం నుంచి ఈ కుంభమేళా కొంత ఊరటనిస్తుంది. ఇది నాకు సంతోషాన్నిస్తుంది. ఇది తాత్కాలికమే. కానీ దీనికోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను'' అని గిరిజా దేవి వివరించారు.
ప్రొడక్షన్:
- డైరెక్షన్, స్క్రిప్ట్, ప్రొడక్షన్: వికాస్ పాండే
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: జిలా వాట్సన్, యాంగస్ ఫోస్టర్
- బీబీసీ వీఆర్ హబ్ ప్రొడ్యూసర్: నియాల్ హిల్
- అసిస్టెంట్ ప్రొడ్యూసర్: సునీల్ కటారియా
హైపర్ రియాలిటీ స్టూడియోస్:
- డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: విజయ చౌదరి
- ఎడిటింగ్ & సౌండ్ డిజైన్: చింతన్ కల్రా
- క్రియేటివ్ డైరెక్టర్: అమర్జ్యోత్ బైద్వాన్
- ఫీల్డ్ ప్రొడక్షన్: అంకిత్ శ్రీనివాస్, వివేక్ సింగ్ యాదవ్
ప్రత్యేక కృతజ్ఞతలు:
- ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
- రాహుల్ శ్రీవాస్తవ్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
- కుంభ్ మేళా అడ్మినిస్ట్రేషన్
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








