భారతీయ వీధుల్లో వణికిస్తున్న వీధి కుక్కలు
భారత దేశంలో ప్రతీ నగరంలో వీధి కుక్కల సమస్య ఉంది.
వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు.
జమ్మూ కశ్మీర్లోని లేహ్లో బీబీసీ ప్రతినిధి జస్టిన్ రౌలట్ ఒక సాహసం చేశారు.
లేహ్ వీధుల్లో రాత్రి సమయంలో తిరగడం ఎంత ప్రమాదకరమో స్వయంగా తిరిగి చూశారు.

ఫొటో సోర్స్, Getty Images
రాత్రి 8 గంటల సమయంలో లేహ్లోని ప్రధాన షాపింగ్ వీధిలో ఆయన పర్యటించారు. హిమాలయ ప్రాంతంలో లేహ్, కార్గిల్ జిల్లాలకు ఇదే ప్రధాన పట్టణం.
ఇలాంటి వీధి పగలు ఎంత రద్దీగా ఉంటుందో మీరు ఊహించొచ్చు. అయితే శీతాకాలం కాబట్టి జనం కాస్త తక్కువగా ఉండొచ్చు.
కానీ లేహ్ ప్రజలను భయపెట్టే మరో కారణం కూడా ఉంది. అదే వీధి కుక్కలు.
గతేడాది ఇక్కడ 180 మంది కుక్కకాటుకు గురయ్యారు. వీరిలో ఒకరు చనిపోయారు కూడా.

ఫొటో సోర్స్, Getty Images
వీధి కుక్కల సమస్య ఒక్క లేహ్లోనే లేదు. భారతదేశం అంతటా ఉంది.
భారతదేశంలో సుమారు 30లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు ఒక అంచనా.
భారతీయులు కుక్కలకు ఆహారం వేసి పెంచి పోషిస్తారు. కుక్కల సంఖ్య పెరగడానికి ఇదొక కారణం.
ఏటా 15లక్షల మంది కుక్కకాటుకు గురవుతున్నట్లు ఒక అంచనా ఉంది.
అంతేకాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ రికార్డుల ప్రకారం భారతదేశంలో రేబిస్ వ్యాధితో ఏటా 20వేల మంది చనిపోతున్నారు. ఇది ప్రపంచం మొత్తం మీద సంభవిస్తున్న రేబిస్ మరణాల్లో మూడోవంతు.

ఫొటో సోర్స్, Getty Images
మీరు రాత్రి సమయంలో వీధుల్లోకి వెళ్తే ఎక్కడపడితే అక్కడ కుక్కల అరుపులు వినిపిస్తాయి. అవి ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో ఊహించలేం.
ఈ సమస్యను పరిష్కరించడం చాలా కష్టం. ఎందుకంటే కుక్కలను చంపడం నేరం. అలా అని వీటికి వాక్సిన్ వేయించే ప్రయత్నం కూడా పూర్తిగా ఫలించడం లేదు.
వీధి కుక్కల సమస్యకు పరిష్కారం లభించే వరకు భారతదేశంలోని ప్రధాన నగరాలు ప్రమాదంలో ఉన్నట్లే.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.









