ఆపరేషన్ గరుడ: వైజాగ్‌లో సీజ్ చేసిన కంటైనర్‌లో ఉన్నది డ్రగ్స్ కాదా? సీబీఐ ఏం చెప్పింది

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం..

ఈ ఏడాది మార్చిలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 'ఆపరేషన్ గరుడ' చేపట్టి విశాఖపట్నం పోర్టులో 25 టన్నుల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ ఉన్న కంటైనర్‌ని స్వాధీనం చేసుకుంది.

ఈ డ్రైడ్ ఈస్టులో డ్రగ్స్ సబ్‌స్టాన్స్ ఉన్నట్లు అనుమానం ఉందని, అందుకే ఈ కంటైనర్‌ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు అప్పుడు సీబీఐ పేర్కొంది.

కానీ, ఎనిమిది నెలల తర్వాత.. అంటే డిసెంబర్ మొదటి వారంలో ఈ కంటైనర్‌లో ఉన్నది కేవలం ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మాత్రమేనని, డ్రగ్స్ కాదని విశాఖ కోర్టు (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కోర్టు)కు సీబీఐ రిపోర్టు అందించింది.

దీని ఆధారంగా ఆ కంటైనర్‌ను విడుదల చేసినట్లు విశాఖపట్నం కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ చెప్పారు.

ఈ కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో డ్రగ్స్ కలిపివున్నట్లు అనుమానిస్తున్నామని, అందులో భాగంగానే కంటైనర్‌ను సీజ్ చేసినట్లు మార్చి 21న విడుదల చేసిన ప్రకటనలో సీబీఐ పేర్కొంది.

ఎనిమిది నెలల తర్వాత, ఆ కంటైనర్‌‌లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని, కేవలం డ్రైడ్ ఈస్టేనని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.

ఈ ఎనిమిది నెలల్లో ఏం తేలింది?

సీబీఐ పట్టుకున్నప్పుడు కంటైనర్‌లో డ్రైడ్ ఈస్ట్‌తోపాటు డ్రగ్ సబ్‌స్టాన్స్ ఉన్నాయని ఎందుకు అనుమానించింది? ఆ తర్వాత ఏం జరిగింది?

ఈ కంటైనర్‌ను బ్రెజిల్ నుంచి విశాఖకు ఆర్డర్ చేసిన సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ యాజమాన్యం ఏమంటోంది?

కోర్టుకు సీబీఐ ఏం చెప్పింది?

విశాఖపట్నం పోర్టులో డ్రైడ్ ఈస్ట్ కంటైనర్‌లో డ్రగ్స్ అనవాళ్లు ఉన్నట్లు అనుమానించామని, ఆ తర్వాత శాంపిల్స్‌ను పరీక్షకు పంపగా.. వాటిలో డ్రగ్స్ అవశేషాలేమీ లేవని రిపోర్టు వచ్చినట్లు కోర్టుకు ఇచ్చిన నివేదికలో సీబీఐ పేర్కొంది.

"నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 ప్రకారం 2024 మార్చి 22న కేసు (u/s 52-A) నమోదు చేసి కంటైనర్ నుంచి సేకరించిన 100 శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించాం. దీనికి సంబంధించిన ఫలితాలను దిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) జూన్ 21న అందజేసింది. ఇందులో ఎటువంటి నార్కోటిక్ డ్రగ్స్ కానీ, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కానీ లేవని పేర్కొంది" అని సీబీఐ విశాఖ ఎన్డీపీఎస్ కోర్టుకు తెలిపింది.

ఆ తర్వాత, సీజ్ చేసిన కంటైనర్‌ను సంధ్య ఆక్వాకు అప్పగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు, సంధ్య ఆక్వా కంపెనీకి అప్పగించినట్లు విశాఖ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

"సీబీఐ విచారణ ముగిసింది. కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో ఎలాంటి డ్రగ్ సబ్‌స్టాన్స్ ఉన్నట్లు తేలలేదని సీబీఐ కోర్టుకు సమర్పించిన క్లోజర్ రిపోర్టులో పేర్కొంది. దాంతో మేం కంటైనర్‌ని విడుదల చేశాం" అని విశాఖపట్నం కస్టమ్స్ ప్రిన్సిపాల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.

ఎన్నికల ముందు ఏం జరిగిందంటే..

ఏపీలో ఎన్నికల హడావుడి ఉన్న సమయంలో.. అంటే, ఈ ఏడాది మార్చి 21న విశాఖ పోర్టులో 25 టన్నుల డ్రగ్స్ దొరికాయంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విశాఖలో దొరికిన అనుమానిత డ్రగ్స్ కంటైనర్ పైనే చర్చ జరిగింది.

మరోవైపు రాజకీయ పార్టీలు ఈ కంటైనర్ మీదంటే, మీదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి.

ఆ కంటైనర్‌ను ఆర్డర్ చేసిన సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులు మాత్రం తమకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

బ్రెజిల్‌లోని డ్రైడ్ ఈస్ట్ సప్లై చేసే కంపెనీకి విశాఖపట్నంలోని సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్‌‌ను విశాఖకు డెలివరీ చేయాలంటూ ఆర్డర్ పెట్టింది. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరిన కంటైనర్ మార్చి 16న విశాఖ చేరుకుంది. బ్రెజిల్ నుంచి ఒక్కో బ్యాగు 25 కేజీల చొప్పున 1000 బస్తాలతో డ్రైడ్ ఈస్ట్ ఉన్న కంటైనర్ విశాఖకి చేరుకుంది. అయితే, ఈ కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్‌పోల్ నుంచి తమకు సమాచారం అందిందని సీబీఐ పేర్కొంది.

విశాఖ పోర్టుకు మార్చి 16న కంటైనర్ (ఎస్‌ఈకేయూ-4375380) చేరుకుంది. సీబీఐ ఈ కంటైనర్‌ను చెక్ చేసి.. దానిలో ''డ్రగ్స్ కలిపి ఉన్నట్లు అనుమానాలున్నాయని'' పేర్కొంటూ ఈ కంటైనర్‌ను సీజ్ చేసింది. విశాఖలోనే సిరిపురం అడ్రస్‌లో ఉంటున్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ప్రతినిధులను పిలిచి వారి ఎదుటే పరీక్షలు నిర్వహించి.. అనుమానస్పద పదార్థాలను తాము ''గుర్తించామని'' చెప్తూ సీబీఐ ఈ కంపెనీపై కేసు నమోదు చేసింది.

బ్రెజిల్‌లోని సాంటోస్ పోర్ట్ (Santos Port) నుంచి విశాఖ చేరుకున్న కంటైనర్‌లో ఒక్కొక్కటి 25 కిలోల బరువున్న 1,000 బస్తాల డ్రైడ్ ఈస్ట్‌తో మిక్స్ చేసిన డ్రగ్స్ ఉన్నాయని అనుమానిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

నార్కోటిక్స్ డిటెక్షన్ మెకానిజమ్‌లను ఉపయోగించి చేపట్టిన ప్రాథమిక పరీక్షల్లో ఈ కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో డ్రగ్స్ కలిపి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు సీబీఐ మార్చి 21న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

"మాకు సమాచారం అందగానే కంటైనర్‌ని సీజ్ చేసి కేసు నమోదు చేసి 100 నమూనాలు సేకరించాం. వాటిని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాం" అని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.

ఆ శాంపిల్స్ ఫలితాలే 21 జూన్ లో సీబీఐకి అందగా.. వాటి ఆధారంగా కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్టులో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని చెప్తూ సీబీఐ విశాఖపట్నం (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కోర్టుకు తెలిపింది.

కంటైనర్‌ను పట్టుకున్నప్పటి నుంచి విశాఖ కోర్టుకు నివేదిక అందించడానికి మధ్య ఎనిమిది నెలల కాలం గడిచింది.

మార్చి నుంచి ఇప్పటి వరకు

మార్చి 21న సంధ్య ఆక్వా కంపెనీపై కేసు నమోదైంది.

ఎన్నికల సమయం కావడంతో సీబీఐ సీజ్ చేసిన ఈ కంటైనర్ అంశంపై వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ నడిచింది.

సంధ్య ఆక్వా కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కోటయ్య చౌదరికి బీజేపీ, టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని వైసీపీ అరోపించింది. ఇదే సమయంలో వీరిద్దరికీ వైసీపీతో లింకులున్నాయని టీడీపీ, బీజేపీలు ఆరోపించాయి.

"విశాఖ పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టివేత విస్మయం కలిగిస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు, పోర్టు సిబ్బంది సహకరించకపోవడం చూస్తుంటే దీని వెనుక అధికార పక్షం ఉన్నట్టుగా కనిపిస్తోంది" అని అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలను అప్పటి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు.

"డ్రగ్స్ వ్యవహారం వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారన్న సందేహం కలుగుతోంది. పురందేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. పురందేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్వామి" అని సజ్జల అప్పట్లో ఆరోపించారు.

డ్రగ్స్ కంటైనర్‌ వైసీపీ నేతలదేనని, ఇది కప్పిపుచ్చుకునేందుకు పురందేశ్వరిపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ నాయకురాలు సాదినేని యామిని ఆ సందర్భంలో విమర్శించారు.

ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది. కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికార పక్షంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి కొనసాగుతున్నారు.

సంధ్యా ఆక్వా ప్రతినిధులు ఏమంటున్నారు?

సంధ్య ఆక్వా కంపెనీకి చెందిన 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్.. సీజ్ అయిన 8 నెలల తర్వాత తిరిగి ఆ కంపెనీకి చేరుకుంది.

"ఇప్పుడు ఈ డ్రైడ్ ఈస్ట్ ఏ స్థితిలో ఉందో చూడాలి. ఇది పనికొస్తుందో లేదో మాకు కూడా తెలియదు. మేం కూడా మళ్లీ ల్యాబ్ పరీక్షలు చేయాలి. ఆ తర్వాత దీని ఉపయోగంపై నిర్ణయం తీసుకోగలం" అని సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

"సీబీఐ సీజ్ చేసిన కంటైనర్‌లోని డ్రైడ్‌ ఈస్ట్‌లో డ్రగ్స్ అవశేషాలు లేవని తేలడంతో.. కంటైనర్ అంశంపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న రాజకీయ పార్టీలు ఇంకా స్పందించలేదు. స్పందించరు కూడా. ఎందుకంటే, ఇప్పుడు దానిపై మాట్లాడటం వలన ఎవరికీ, ఏ ఉపయోగం ఉండదు. ఎన్నికల సమయం కాదుకదా" అన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎస్.ఆనంద్‌బాబు. కానీ, ఈ అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం వల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న మాట మాత్రం వాస్తవమని ఆయన అన్నారు.

ఇంతకీ డ్రైడ్ ఈస్ట్ అంటే?

ఈస్ట్ అంటే ఫంగస్. అంటే ఒక రకమైన సూక్ష్మక్రిములు. వీటిని ఒక చోట నిల్వ చేసి వాటిలోని నీటి పరమాణువులను తొలగించి డ్రైడ్ ఈస్ట్ తయారు చేస్తారు. దీనిలో రెండు రకాలున్నాయి. ఒకటి ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్, మరొకటి యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్. వివిధ రకాలైన ఉపయోగాలను దృష్టిలో పెట్టుకుని యాక్టివ్, ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్టులను తయారు చేస్తారు.

వీటిని రోజువారీ జీవితంలో రొట్టెలు, కేక్‌లు తయారు చేసేందుకు, పెరుగు పులియడానికి, దోసెల పిండి తయారుకావడానికి ఉపయోగిస్తాం. యాక్టివ్, ఇనాక్టివ్ ఫాంలోని డ్రైడ్ ఈస్ట్ వీటి కోసం ఉపయోగిస్తాం.

సాధారణంగా యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్, గింజల రూపంలో ప్యాక్ చేసి ఉంటుంది. ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అయితే పౌడర్ రూపంలో ఉంటుంది. అయితే, దూరం నుంచి చూస్తే రెండూ ఒకేలా కనిపిస్తాయి. కానీ, ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్టుని యాక్టివ్ చేయాలంటే దానిని వేడి చేయడమో లేదా కొంత గోరువెచ్చని నీరు కలిపి వాడుతుంటారు. అవసరాన్ని బట్టి యాక్టివ్, ఇనాక్టివ్ అని అంటామే కానీ.. నిజానికి రెండు డ్రైడ్ ఈస్టులు ఒకటేనని ఆంధ్ర యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ వి.సిద్ధయ్యతో బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)