వ్యోమిక సింగ్ - సోఫియా ఖురేషీ: ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఈ ఇద్దరు మహిళా అధికారులు ఎవరు?

భారత్, ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Ministry of External Affairs, India

ఫొటో క్యాప్షన్, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ

పహల్గాం దాడి తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది చనిపోయారు.

ఈ ఘటన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కఠిన చర్యలు ఉంటాయంటూ మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తాజాగా పాకిస్తాన్‌పై దాడులకు సైన్యం 'ఆపరేషన్ సిందూర్' అని పేరుపెట్టింది.

ఈ ఆపరేషన్ గురించి సమాచారం ఇచ్చేందుకు బుధవారం ఉదయం ఇద్దరు మహిళా సైనికాధికారులు విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ మహిళా అధికారులెవరు? తెలుసుకుందాం..

భారత్, ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్

ఫొటో సోర్స్, @SpokespersonMoD

ఫొటో క్యాప్షన్, గుజరాత్‌కు చెందిన సోఫియాకు ఆర్మీ కుటుంబ నేపథ్యముంది.

కల్నల్ సోఫియా ఖురేషీ

సోఫియా ఖురేషీ భారత సైన్యంలో కల్నల్ హోదా అధికారి.

పుణెలో, 2016లో మల్టీనేషనల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ 'ఫోర్స్ 18' జరిగింది. ఈ ఫోర్స్ 18లో ఏసియన్ ప్లస్ దేశాలు పాల్గొన్నాయి.

భారత గడ్డపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద గ్రౌండ్‌ఫోర్సెస్ ఎక్సర్‌సైజ్ ఇది.

ఈ ఎక్సర్‌సైజ్‌లో 40 మంది సైనికులతో కూడిన భారత ఆర్మీ బృందానికి సిగ్నల్ కార్ప్స్‌కి చెందిన మహిళా అధికారి, లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ నాయకత్వం వహించారు. భారీ స్థాయిలో జరిగిన ఈ బహుళ దేశాల ఆర్మీ ఎక్సర్‌సైజ్‌లో, భారత ఆర్మీ శిక్షణ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా ఆమె అరుదైన ఘనత సాధించారు.

రక్షణ మంత్రిత్వ శాఖ గతంలో చేసిన పోస్ట్‌లలో దీనికి సంబంధించిన వివరాలున్నాయి.

సోఫియా ఖురేషీ ఫోటోలను కూడా రక్షణ శాఖ షేర్ చేసింది.

ఖురేషీ గుజరాత్‌కు చెందిన వారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఖురేషీకి ఆర్మీ కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె తాత ఇండియన్ ఆర్మీలో పనిచేశారు.

మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ అధికారిని ఆమె వివాహం చేసుకున్నారు.

సోఫియా ఖురేషీ 17 ఏళ్ల వయసులో, 1999లో భారత సైన్యంలో చేరారు.

ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో ఆరేళ్లు పనిచేశారు. 2006లో కాంగోలో విశేష సేవలందించారు. శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో భాగంగా, శిక్షణకు సంబంధించిన సహకార కార్యక్రమాల్లో ఆమె సేవలందించారు.

భారత్, ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Ministry of External Affairs, India

ఫొటో క్యాప్షన్, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్‌కు విపత్కర పరిస్థితుల్లోనూ హెలికాప్టర్ నడిపిన అనుభవం ఉంది.

వ్యోమిక సింగ్

ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాకు వివరించిన మరో మహిళా అధికారి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్.

వ్యోమిక సింగ్ భారత వైమానిక దళం (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్)‌లో హెలికాప్టర్ పైలట్. ఆమె ఎప్పుడూ పైలట్ కావాలని కోరుకునేవారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

వ్యోమిక సింగ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌ (ఎన్‌సీసీ)లో ఉన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2019లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని ఫ్లయింగ్ బ్రాంచ్‌లో పైలట్‌‌గా శాశ్వత హోదా పొందారు.

వ్యోమిక సింగ్‌కు పైలట్‌గా 2500 గంటలకు పైగా హెలికాప్టర్లను నడిపిన అనుభవముంది. జమ్ముకశ్మీర్‌తో పాటు ఈశాన్య భారత్‌లోని క్లిష్ట పరిస్థితుల్లో, చేతక్ - చీతా వంటి హెలికాప్టర్లను ఆమె నడిపారు.

అనేక రెస్క్యూ ఆపరేషన్లలోనూ వ్యోమిక సింగ్ కీలకపాత్ర పోషించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ వాటిలో ఒకటి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)