You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కె. విశ్వనాథ్ ఇకలేరు.. హైదరాబాద్లో కన్నుమూసిన దిగ్గజ దర్శకుడు
ప్రముఖ దర్శకుడు, ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ గురువారం రాత్రి చనిపోయారు.
ఆయన వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురవటంతో హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
విశ్వనాథ్ భౌతికకాయాన్ని హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ఆయన నివాసానికి తరలించారు.
కాశీనాథుని విశ్వనాథ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద పులివర్రు గ్రామం. ఆయన 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ప్లస్ టూ చదువుకున్నారు. ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు.
తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్లో పని చేసేవారు. విశ్వనాథ్ కూడా డిగ్రీ పూర్తయ్యాక అదే స్టూడియోలో ఉద్యోగంలో చేరారు.
సౌండ్ రికార్డింగ్ నుంచి డైరక్షన్ వైపు
ఆ స్టూడియోలో తొలుత సౌండ్ రికార్డిస్ట్గా విశ్వనాథ్ సినిమా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా చేరారు.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ఆత్మ గౌరవం’ సినిమాతో విశ్వనాథ్ దర్శకుడయ్యారు. 1965లో విడుదలైన ఆ సినిమాకు ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య నంది లభించింది.
ఆ తర్వాత విశ్వనాథ్ రూపొందించిన చిత్రాల్లో చెల్లెలి కాపురం, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి వంటి చాలా సినిమాలు ఉత్తమ సినిమా విభాగంలో నందులు అందుకున్నాయి.
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమా ఒక సంచలనమైంది. ఆ సినిమాకు నంది అవార్డుతో పాటు జాతీయ అవార్డు కూడా లభించింది.
సప్తపది, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం సినిమాలకూ జాతీయ అవార్డులు వచ్చాయి.
స్వాతి ముత్యం సినిమాను 1986లో 59వ ఆస్కార్ అవార్డులకు విదేశీ చిత్రం కేటగిరీకి ఇండియా నుంచి అధికారికంగా పంపించారు.
ఐదు దశాబ్దాలు.. 51 సినిమాలు
కె.విశ్వనాథ్ ఐదు దశాబ్దాల తన కెరీర్లో 1965 నుంచి 2016 వరకూ 51 సినిమాలకు దర్శకత్వం వహించారు.
తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలకు కూడా విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.
ఆయన ‘శుభ సంకల్పం’ సినిమా నుంచి నటుడిగా తెర మీద కూడా కనిపించారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు.
కె విశ్వనాథ్కు భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఆయన ఉత్తమ దర్శకుడిగా 8 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.
విశ్వనాథ్కు 1994లో జీవిత సాఫల్య పురస్కారంతో ఫిల్మ్ ఫేర్ సత్కరించింది. 2016లో ప్రతిష్ఠాత్మక దాదా ఫాల్కే అవార్డు అందుకున్నారు.
‘కె విశ్వనాథ్ గొప్ప భారతీయ దర్శకుడు’
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ గవర్నర్ తమిలిసై, సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సహా సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.
అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని కేసీఆర్ నివాళులర్పించారు.
భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు విశ్వనాథ్ తన సినిమాలో పెద్ద పీట వేశారని అన్నారు.
సంగీత సాహిత్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె విశ్వనాథ్ అని కేసీఆర్ కొనియాడారు.
‘‘తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్’’ అని జగన్ ట్వీట్ చేశారు.
‘‘విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు’’ అని సీఎం నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అబ్దుల్ రజాక్
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'
- ఫిన్లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
- జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి
- థైరాయిడ్ సమస్య: మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)