అప్పుల్లో కూరుకుపోయిన దేశాన్ని గట్టెక్కించడానికి చందాలు వసూలు చేస్తున్న మలేషియా ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images
మలేషియా ఇప్పటికే చాలా అప్పుల్లో కూరుకుపోయింది. వాటినుంచి ఆ దేశాన్ని బయట పడేయడానికి ప్రజలు కూడా ముందుకొస్తున్నారు. ఏకంగా చందాలు వసూలు చేసి మరీ ప్రభుత్వానికి డబ్బులు సమకూరుస్తున్నారు.
అప్పుల నుంచి బయటపడటానికి ప్రభుత్వం క్రౌడ్ ఫండింగ్ను ఆశ్రయించిన తొలిరోజే దేశవ్యాప్తంగా దాదాపు 14కోట్ల రూపాయలు వసూలయ్యాయి.
మలేషియా చేపట్టిన ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇతర దేశాలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందనే విషయంపై చాలామంది స్పందిస్తున్నారు.
మలేషియాకు చెందిన ఓ 27ఏళ్ల యువతి మొదట ఈ క్రౌడ్ ఫండింగ్ను మొదలుపెట్టారు. తన దేశమంటే తనకెంతో ఇష్టమని, అది అప్పుల్లో ఉంటే చూడలేకపోతున్నానని చెబుతూ ఆమె మొదట వ్యక్తిగతంగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సేకరించడం మొదలుపెట్టారు.
ఆ స్ఫూర్తితో ఏకంగా మలేషియా ప్రభుత్వమే ఈ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలివ్వడానికి ముందుకొస్తున్నారు. ఇలా సేకరించిన నిధుల్ని చాలా పారదర్శకంగా ఉంచుతాం. ఒకే బ్యాంకు ఖాతా ద్వారా వీటిని సేకరిస్తున్నాం’ అని ఆ దేశ ఆర్థికమంత్రి లిమ్ గువాన్ ఎంగ్ అన్నారు.
దక్షిణ కొరియాలోనూ గతంలో ఇలాంటి పరిణామమే తలెత్తింది. 1990ల్లో ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ప్రజల స్వచ్ఛందంగా లైన్లలో నిల్చొని మరీ తమ పెళ్లి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు.
ప్రస్తుత పరిస్థితిని తాము సమర్థంగా ఎదుర్కొంటామని మలేషియా ప్రధాని మహతిర్ మొహమద్ అంటున్నారు. ప్రస్తుతం మలేషియాకు 16లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయి. గత ప్రభుత్వ అవినీతి కారణంగానే దేశం ఇలా అప్పుల్లో చిక్కుకుందని ప్రధాని మహతిర్ ఆరోపిస్తున్నారు.
అమెరికాకు చెందిన ట్విటర్ యూజర్లు కూడా దీనిపై స్పందించారు. అప్పులు తీర్చడానికి అమెరికా కూడా ఇలాంటి పద్ధతులను ఎప్పటికి అనుసరిస్తుందోనని ఒక యూజర్ అన్నారు.
ప్రస్తుతం మలేషియాకు ఉన్న అప్పుల్ని పరిగణనలోకి తీసుకుంటే ఇలా విరాళాల ద్వారా వాటిని తీర్చాలంటే చాలా కాలం పడుతుందని క్రిస్టల్ టాన్ అనే ఆర్థికవేత్త అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








