వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, కాలేయానికి కత్తిపోట్లు, ఒక కంటికి తీవ్ర గాయం

న్యూయార్క్‌లో స్టేజ్‌పై మాట్లాడుతుండగా కత్తిపోట్లకు గురైన రచయిత సల్మాన్ రష్దీ పరిస్థితి విషమంగా ఉంది.

ప్రస్తుతం రష్దీ వెంటిలేటర్‌పై ఉన్నట్లు ఆయన ఏజెంట్ ఆండ్రూ వైలీ ఒక ప్రకటనలో తెలిపారు.

రష్దీ ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నారని, ఒక కన్ను బాగా దెబ్బతిందని చెప్పారు.

‘‘సల్మాన్ తన కంటిని కోల్పోవచ్చు. ఆయన మోచేతిలోని నరాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాలేయానికి కత్తిపోట్లు కావడంతో తీవ్రంగా దెబ్బతింది’’ అని ఆండ్రూ చెప్పారు.

అనుమానితుడు అరెస్ట్

రష్దీపై దాడి చేసినట్లుగా అనుమానిస్తున్న హదీ మతర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 24 ఏళ్ల మతర్ న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూకి చెందినవారు.

''ద శటానిక్ వెర్సస్'' అనే పుస్తకం రాసిన తరువాత, దశాబ్దాలుగా ఆయన చంపేస్తామన్న బెదిరింపులను ఎదుర్కొంటున్నారు.

బుకర్‌ ప్రైజ్‌ను గెలుచుకున్న సల్మాన్‌..న్యూయార్క్‌లోని ఛౌటౌక్వా సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ దాడి జరిగింది.

సల్మాన్ మెడపై, కడుపులో పొడిచారు.

అయితే, దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని న్యూయార్క్ పోలీసులు చెప్పారు.

సల్మాన్‌ను పరిచయం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వేదికపైకి వచ్చి ఆయనపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అక్కడున్న వారు వెంటనే వేదికపైకి వస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

దాడికి పాల్పడిన వ్యక్తి ముఖానికి మాస్కు వేసుకుని ఒక్కసారి జనం లోపలి నుంచి వేదిక మీదికి వచ్చాడని బఫెలో న్యూస్ కు చెందిన జర్నలిస్ట్ మార్క్ సోమర్ బీబీసీకి తెలిపారు.

దీంతో వేదిక దగ్గరున్న వారిలో పది పదిహేను మంది సల్మాన్ రష్దీకి రక్షణగా వెళ్లారని ఆయన వెల్లడించారు.

ఆయన నిత్యం రక్షణలో ఉంటారని, అయినా రష్ధీ స్టేజ్ మీదకు చేరిన క్షణాల్లోనే ఘటన జరిగిందని సోమర్ తెలిపారు.

మెడపై కత్తితో దాడి

సల్మాన్ రష్దీని మెడపై కత్తితో పొడిచినట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు.

సల్మాన్ రష్దీని హెలికాప్టర్‌లో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ప్రస్తుతం దాడి చేసిన వ్యక్తి తమ అదుపులో ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు.

రష్దీపై దాడిని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచల్ ఖండించారు. వెంటనే స్పందించినందుకు పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

సల్మాన్ రష్దీ ఎవరు?

భారత సంతతికి చెందిన సల్మాన్ రష్దీ 1981లో రచించిన ''మిడ్‌నైట్ చిల్డ్రన్'' పుస్తకంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క బ్రిటన్‌లోనే పది లక్షల కాపీలకుపైగా ఈ పుస్తకం అమ్ముడు పోయింది.

1988లో రష్దీ నాలుగో పుస్తకం శటానికి వెర్సస్‌ను ప్రచురించారు. ముస్లింలలో ఈ నవల పెద్ద దుమారమే లేపింది.

ఈ పుస్తకాన్ని ''దైవద్రోహం''గా కొన్ని దేశాలు పేర్కొన్నాయి. దీనిపై నిషేధం కూడా విధించాయి.

శటానిక్ వెర్సస్‌ రాసినందుకు సల్మాన్‌పై ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా ఖొమేనీ ''డెత్ ఫత్వా''ను జారీచేశారు.

రష్దీని చంపితే బహుమానం

2016లో సల్మాన్ రష్దీని హత్య చేసిన వారికి 6 లక్షల డాలర్లు (రూ. 4.77 కోట్లు) ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థల్లో ప్రకటనలు వచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది.

మరోవైపు అయతొల్లా అలీ ఖొమేనీ కూడా 3 మిలియన్ డాలర్లు (రూ.23.89 కోట్లు) ఇస్తామని 1989లో ప్రకటించారు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి: