ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబునాయుడు ప్రకటించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామికంగా మారిందని చెప్పిన చంద్రబాబు, పరిషత్ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చీ రాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల్లో ఎస్ఈసీ రబ్బర్ స్టాంపుగా మారారని కూడా చంద్రబాబు ఆరోపించారు.

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పరిషత్ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని అన్నారు."ఇలాంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఎస్ఈసీ తీరుకు నిరసనగా ఎంపీటీసీ, జపీటీసీ ఎన్నికలను మా పార్టీ బహిష్కరిస్తోంది" అని ప్రకటించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారని, కానీ అలాంటి సంప్రదింపులు ఏమీ లేకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా జరుగుతున్న ఈ ఎన్నికలలో తాము భాగస్వాములం కాలేమని, ఎస్ఈసీ తీరుకు నిరసనగా తమ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తోందని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై జాతీయ స్థాయిలో పోరాడతామని చంద్రబాబు అన్నారు.

కరోనాతో ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ ఆస్పత్రిలో చేరారు.

మార్చి 27న ఆయనకు కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది.

అప్పటి నుంచి సచిన్ ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ వచ్చారు.

కానీ ఇప్పుడు వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్లు సచిన్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.

ముందు జాగ్రత్తగానే ఆస్పత్రిలో చేరుతున్నానని, కొన్ని రోజుల్లో క్షేమంగా బయటకు వస్తానని ఆ ట్వీట్‌లో సచిన్ చెప్పారు.

ప్రతి ఒక్కరు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మార్చి 27న తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని సచిన్ ట్వీట్ చేశారు.

"కోవిడ్‌ను దూరంగా ఉంచడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వచ్చాను. పరీక్షలు కూడా చేయించుకుంటున్నాను. కానీ, ఇవాళ నాకు కోవిడ్ వచ్చినట్లు నిర్ధరణ అయింది. అయితే, లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి" అని టెండూల్కర్ ట్వీట్ చేశారు.

తన కుటుంబంలోని మిగతా వారందరికీ నెగెటివ్ వచ్చిందని ఆయన చెప్పారు.

హోం క్వారెంటైన్లో ఉంటూ డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తున్నానని చెప్పిన సచిన్, తనకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఒకే రోజులో 81 వేలకు పైగా కొత్త కేసులు

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 81,466 కరోనా కేసులు నమోదయ్యాయి.

469 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)