రోహింజ్యా శిబిరాల్లో మంటలు: 15 మందికిపైగా మృతి.. 400 మంది ఆచూకీ గల్లంతు

బంగ్లాదేశ్ కాక్స్ బజార్‌లోని రోహింజ్యా శిబిరం

ఫొటో సోర్స్, TEAM SAIFUL ARAKANI

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ కాక్స్ బజార్‌లోని రోహింజ్యా శిబిరం

రోహింజ్యా శరణార్థి శిబిరంలో సోమవారం చెలరేగిన భారీ మంటల కారణంగా వేల ఇళ్లు కాలిపోగా, చనిపోయినవారి సంఖ్య పెరుగుతోంది. మంటల కారణంగా వేలాది మంది శరణార్థులు నిరాశ్రయులయ్యారు.

ఇప్పటి వరకు 15 మందికి పైగా మరణించారని.. 400 మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని శరణార్థులకు సంబంధించిన ఐరాస ఏజెన్సీ యూఎన్‌హెచ్ఆర్‌సీ వెల్లడించింది.

బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లో ఉన్న శరణార్థి శిబిరం చుట్టూ ఉన్న ముళ్ల కంచె దగ్గర చాలా మంది పిల్లల సహా చిక్కుకుపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని రెఫ్యూజీస్ ఇంటర్నేషనల్ పేర్కొంది.

2017లో మియన్మార్ నుంచి పారిపోయి తలదాచుకున్న కొన్ని లక్షల మంది శరణార్థులు ఈ శిబిరాలలో నివాసం ఉంటున్నారు.

ఈ మంటల కారణంగా సుమారు 50,000 మంది ప్రభావితమై ఉంటారని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి.

సోమవారం తలెత్తిన ఈ మంటలు ఈ శిబిరాలను అత్యంత వేగంగా తుక్కుతుక్కుగా చేశాయి

ప్రపంచ ఆహార కార్యక్రమానికి చెందిన కేంద్రాలు కూడా ఈ మంటల్లో కాలిపోయాయని ప్రపంచ ఆహార సంస్థ తెలిపింది.

"మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ చాలా చోట్ల నుంచి ఇంకా పొగ వస్తూనే ఉంది" అని క్యాంపు ఫైర్ సర్వీస్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్లా బీబీసీ బెంగాలీకి చెప్పారు.

విచారణ కమిటీ ఆస్తి, ప్రాణనష్టం అంచనా వేస్తోందని చెప్పారు.

"శిబిరాలను మంటలు చాలా తక్కువ సమయంలోనే కాల్చేశాయి" అని ప్రత్యక్ష సాక్షులు బీబీసీ కి చెప్పారు.

ఈ మంటలు దక్షిణం వైపు నుంచి మొదలయ్యాయని మొయినా ఖాతూన్ చెప్పారు.

శిబిరాలలో చాలా ఇల్లులు వెదురు, చెక్కతో నిర్మించినవి
ఫొటో క్యాప్షన్, శిబిరాలలో చాలా ఇల్లులు వెదురు, చెక్కతో నిర్మించినవి

"మంటలు ఆగిపోతాయని మొదట నేను అనుకున్నాను. అందుకే ఇంట్లో నుంచి ఏమీ తెచ్చుకోలేదు. మంటలు అంతకంతకూ పెరిగిపోవడంతో నేను పక్కనే ఉన్న స్మశానంలోకి వెళ్లి తల దాచుకున్నాను.

ఇంతటి భయంకరమైన మంటలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు" అని ఆమె చెప్పారు.

కొన్ని వేల ఇళ్లు బూడిదగా మారిపోయాయని శిబిరంలో నివాసముండే సయీద్ ఆలం చెప్పారు.

"మా కోడలు గర్భవతి. ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లేందుకు నేను బంగారం అమ్మాను. ఇప్పుడు నా డబ్బంతా కాలిపోయింది. నా కోడలు కనిపించటం లేదు" అని షోభే మెరాజ్ చెప్పారు.

కోడలి కోసం వెతుకుతున్న షోభే మెరాజ్
ఫొటో క్యాప్షన్, కోడలి కోసం వెతుకుతున్న షోభే మెరాజ్

"రోహింజ్యా శరణార్థులు గత రెండేళ్లలో అనేక భయానకమైన సంఘటనలు చవి చూడాల్సి వచ్చింది. వాళ్ళు చాలా సవాళ్లతో కూడిన జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే వారు చాలా ఒత్తిడితో ఉన్నారు. ఇప్పుడీ మంటలు వారి జీవితాలను మరింత కష్టాల్లోకి నెడతాయి" అని చారిటీ సంస్థ సేవ్ ది చిల్డ్రన్ కంట్రీ డైరెక్టర్ వొన్నో వాన్ మానెన్ చెప్పారు.

మియన్మార్‌ నుంచి పారిపోయి వచ్చిన శరణార్ధులున్న ఈ శిబిరాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద శరణార్థి శిబిరంగా చెబుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)