ఇక్రార్‌ ఉల్ హసన్‌: భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్‌ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు

పాకిస్తాన్‌ టీవీ ప్రజెంటర్ సయ్యద్‌ ఇక్రార్‌ ఉల్‌ హసన్‌ తన ట్వీట్ల కారణంగా దేశంలోని కొంతమందికి టార్గెట్‌ అయ్యారు. దేశద్రోహి అంటూ పలువురు ఆయన్ను విమర్శిస్తున్నారు. అయితే పలువురు సెలబ్రిటీలు ఆయన్ను సమర్ధించారు.

ఇక్రార్‌ ఉల్‌ హసన్‌ ‘సర్‌-ఎ-ఆమ్‌’ అనే టీవీ షోను నిర్వహిస్తుంటారు. జనవరి 17న ఆయన నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ చేసిన ఓ ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేశారు.

అమితాబ్‌ కాంత్‌ భారత్‌ను ప్రపంచ వ్యాక్సీన్‌ హబ్‌గా తన ట్వీట్‌లో అభివర్ణించారు. దీన్ని రీ ట్వీట్‌ను చేసిన హసన్‌ ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్ అనే హెడ్‌లైన్‌ పెట్టి “ పాకిస్తాన్‌ ఇంకా వ్యాక్సీన్‌ను ఆర్డర్‌ చేసిందో లేదో కూడా తెలియదు, తయారు చేయడం తరవాత సంగతి’’ అని కామెంట్‌ చేశారు.

“మనం పోటీ పడాలనుకుంటే సైన్స్‌లో పోటీ పడాలి, మౌలిక సదుపాయాలలో పోటీ పడాలి. ఆర్ధికవ్యవస్థలో, టెక్నాలజీలో పోటీ పడాలి. లేదంటే నిజాలను ఒప్పుకోవాలి’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు హసన్.

రవాణా వ్యవస్థల పోలికలు

అంతకు ముందు హసన్‌ ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ హెడ్‌లైన్‌తో రెండు ఫొటోలను కూడా ట్వీట్‌ చేశారు. అందులో ఒకటి పాకిస్తాన్‌, భారత్‌లలో రవాణా వ్యవస్థలకు అద్దంపట్టే రెండు చిత్రాలున్నాయి.

పాకిస్తాన్‌ ఫొటోలో ఒక పాత వాహనంలో కొందరు ప్రయాణికులు కూర్చుని, కొందరు నిలబడి ప్రయాణిస్తున్న దృశ్యం ఉండగా, ఇండియా చిత్రంలో జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ లోపల సౌకర్యవంతమైన సీట్ల దృశ్యాలు కనిపిస్తాయి.

ఇందులోని జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఫొటోను జనవరి 16న ప్రధానమంత్రి మోదీ పోస్ట్‌ చేశారు. “ఇది అహ్మదాబాద్‌ నుంచి కెవాడియా వెళ్లే జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్” అని ఆయన అందులో పేర్కొన్నారు.

ఇక్రార్‌ ఉల్‌ హసన్‌ ఇంతటితో ఆగలేదు. పాకిస్తాన్‌ పాస్‌పోర్ట్‌, కరెన్సీల బలహీన స్థితిని కూడా ప్రస్తావించారు. “దురదృష్టవశాత్తు పాకిస్తాన్‌ పాస్‌పోర్ట్‌ అఫ్గానిస్తాన్‌, సోమాలియాల పాస్‌పోర్ట్‌లకంటే మాత్రమే మెరుగ్గా ఉంటుంది. పాకిస్తానీ రూపాయి బంగ్లాదేశ్‌ టాకాకు 1.90 పైసలు, ఇండియా రూపాయికి 2.20 పైసలకు సమానం. పాకిస్తాన్‌ కలకాలం జీవించడానికి అల్లా మాకు శక్తినివ్వుగాక’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు హసన్‌.

ఇక్రార్ ఉల్‌ హసన్‌ ట్వీట్లపై పాకిస్తాన్‌లో చాలామంది మండిపడుతున్నారు. కొందరు ఆయన్ను దేశద్రోహిగా అభివర్ణించారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. #ApologiseToTheCountry అన్నహ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌ అవుతోంది.

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ నేత హన్స్‌ మస్‌రూర్ బద్వీ టీవీ ప్రజెంటర్‌ హసన్‌ ట్వీట్‌లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “మీరు భారతదేశంలో ఆశ్రయం పొందాలనుకుంటున్నారా ? లేకపోతే పాకిస్తాన్‌ అందాన్ని చూపించండి” అని ఆయన వ్యాఖ్యానించారు.

మద్దతుగా నిలిచిన ప్రముఖులు

అయితే హసన్‌కు వ్యతిరేకులే కాదు, మద్దతుదారులు కూడా చాలామందే ఉన్నారు. #WeSupportIqrar పేరుతో ఆయన వ్యాఖ్యలను చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు సమర్ధిస్తున్నారు.

ఇక్రార్‌ ఉల్‌ హసన్‌ వ్యాఖ్యలను పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ సమర్ధిస్తూ “ ఒకరిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే ముందు, వారి కామెంట్ల సందర్భాన్ని కూడా అర్ధం చేసుకోవాలి. హసన్‌కు పాకిస్తాన్‌పట్ల ఉన్న అంకితభావాన్ని, ప్రేమను ఎవరూ ప్రశ్నించలేరు” అని ట్వీట్ చేశారు.

పాకిస్తాన్‌కు చెందిన మరో మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్ కూడా ఇక్రార్‌ ఉల్‌ హసన్‌కు మద్దతు పలికారు. “మన దేశ ప్రజలకు మంచి రవాణా వ్యవస్థను కోరుకునే వ్యక్తి చేసిన కామెంట్లను దేశంపట్ల ప్రేమ, విధేయతల పేరుతో ప్రశ్నించలేము’’ అంటూ ట్వీట్‌ చేశారు.

“దేశం కోసం అనేకమార్లు ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి, దేశం కోసమే అవిశ్రాంతంగా పనిచేస్తున్న వ్యక్తితో ఎలా వ్యవహరిస్తామో, తన దేశ ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కావాలని కోరుకుంటూ ఒక ఫొటోను పోస్ట్‌ చేసిన వ్యక్తితో కూడా అలాగే వ్యవహరించాలి’’ అని పాకిస్తానీ గాయకుడు అలీ జాఫర్‌ ట్వీట్ చేశారు.

పాకిస్తానీ నటుడు ఇమ్రాన్‌ అష్రఫ్ కూడా ఇక్రార్‌ ఉల్ హసన్‌కు మద్దతుగా మాట్లాడారు. తన దేశం మంచి గురించి మాట్లాడుతున్న మనిషిపై ద్వేషం చూపిస్తున్నారని ఆయన అన్నారు.

“ఇక్రార్‌ ఉల్ హసన్‌కు సంబంధించి ఒక విషయం నాకు బాగా తెలుసు. ఆయన ఏదైనా రాసినప్పుడు దానికింద ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని రాస్తారు. ఆటోగ్రాఫ్‌ ఇచ్చినప్పుడు కూడా ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌, ఐ సపోర్ట్‌ గవర్నమెంట్‌’ అని పేర్కొంటారు’’ అంటూ ట్వీట్‌ చేశారు ఇమ్రాన్‌ అష్రఫ్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)