రష్యా: ‘కరోనావైరస్ లేదు.. ప్రజారోగ్య ఆదేశాలు పాటించొద్దు’ అంటూ ప్రచారం చేసిన చర్చి ఫాదర్ అరెస్ట్

రష్యా పోలీసులు మంగళవారం ఫాదర్ సెర్గీ అనే ఒక చాంధస మతాధికారిని అరెస్టు చేశారు. రష్యా సంప్రదాయ చర్చి ఆయనను మత ప్రచారం చేయడానికి వీలు లేదని ఏప్రిల్ లోనే బహిష్కరించింది.

ఆయన ఆధీనంలో ఉన్న ఒక మహిళా ఆశ్రమంపై దాడి చేసి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన మైనర్ పిల్లలను ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహిస్తారనే అభియోగాలు ఉన్నాయి.

మతాధికారిగా బహిష్కరణ జరగడంతో ఆయన జూన్ లో యెకాటెరిన్బర్గ్ దగ్గర ఉన్న స్రెడ్నుఉరాల్స్క్ కాన్వెంట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మత ప్రచారం వదిలిపెట్టడానికి మాత్రం అంగీకరించలేదు.

ఆయన కరోనావైరస్ మహమ్మారి లేదని తోసిపుచ్చారు. ప్రజారోగ్య ఆదేశాలను పాటించవద్దని ఆయన అనుచరులను ప్రోత్సహించడంతో మేలో ఆయన మెడలో సిలువ ధరించే హక్కును కూడా సంప్రదాయ చర్చి తొలగించింది.

ఫాదర్ సెర్గీ స్రెడ్నుఉరాల్స్క్ కాన్వెంట్ స్థాపనకు 2000 సంవత్సరంలో సహకారం అందించారు. ఆయన ప్రసంగాలు వినడానికి కొన్ని వందల మంది అనుచరులు అక్కడకు తరలి వెళ్లేవారు.

కరోనావైరస్ మహమ్మారి వలన రష్యా అధికారులు ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్యలో చర్చిలను మూసివేశారు. దాంతో, ఆయన వారిని క్రైస్తు వ్యతిరేక చర్యలకు పాల్పడేవారికి సహకరిస్తున్నారని ఆరోపించారు.

మంగళవారం ఆయన అనుచరులకు పోలీసులకు మధ్య తలెత్తిన ఘర్షణల తర్వాత పోలీసులు దాడి చేసి ఫాదర్ సెర్గీ ని అదుపులోకి తీసుకున్నారు.

ఆ కాన్వెంట్ కి కాపలా వహిస్తున్న వారిలో చాలా మంది తూర్పు యుక్రెయిన్ లో కొనసాగుతున్న వివాదాల్లో రష్యాకు మద్దతుగా పని చేసిన తిరుగుబాటుదారులు అని భావిస్తున్నారు.

ఈ దాడుల్లో ముగ్గురు సన్యాసినిలతో సహా కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి.

ఆ తరువాత అతని మద్దతుదారులు ఒక వీడియోని పోస్టు చేశారు. " దేవుడా! వారిని క్షమించండి. వారేమి చేస్తున్నారో వారికి తెలియదు. ఒక వేళ తెలిసి చేసినా క్షమించండి" అంటూ ఆయనను బంధించిన వారిని ఉద్దేశించి ఆ వీడియోలో మాట్లాడారు.

ఆయన పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఆయన కనీసం 10 మంది సన్యాసినులను ప్రాణాలు తీసుకోమని ప్రోత్సహించినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి.

ఆయన ప్రసంగించిన వీడియో రికార్డింగ్ కూడా యూట్యూబ్ లో పబ్లిష్ చేశారు. ఆయన ప్రసంగాన్ని వింటున్న వారిలో పిల్లలు కూడా ఉన్నారు. "వారు రష్యా కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం సిలువ దగ్గరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేదా" అని ఆ ప్రసంగం వింటున్న వారిని ప్రశ్నించారు.

ఫాదర్ సెర్గీ ఎవరు?

ఫాదర్ సెర్గీ పోలీసుగా పని చేసేవారు. ఆయన జైలు కాలనీలో చేసిన ఒక హత్యా నేరానికి గాను 13 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆయన 1990 చివర్లో జైలు నుంచి విడుదల అయ్యారు.

రష్యాను పాలించిన ఆఖరి చక్రవర్తి నికోలస్ II పై గౌరవంతో ఫాదర్ సెర్గీ తన పేరును నికోలాయ్ రొమానోవ్ అని మార్చుకున్నారు. 1918 లో రెండవ నికోలస్ కుటుంబాన్ని హతమార్చిన తర్వాత వారిని యెకటెరిన్బర్గ్ దగ్గర సమాధి చేసినట్లు చెబుతారు. మత సంస్థల్లో రహస్యంగా జరుగుతున్న చక్రవర్తి (జార్) ఆరాధక ఉద్యమానికి ఫాదర్ సెర్గీని నామమాత్రపు నాయకునిగా భావిస్తారు.

ఆయన గతంలో కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యాలో అతి త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కి సమాన స్థాయిలో క్రైస్తు వ్యతిరేక ఉద్యమం మొదలవుతుందని సూచనలు చేశారు.

రష్యాలో గృహహింస, సెమిటిక్ మతస్థులకు వ్యతిరేకంగా చేసే ప్రసంగాలను నిషేధిస్తూ ప్రభుత్వం చేసిన చట్టాలను కూడా ఆయన విమర్శించారు. ఆయన చాలా మంది రష్యా క్రీడాకారులు, రాజకీయ నాయకులకు మతాధికారిగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)