కరోనావైరస్: అడవి జంతువుల్లో తొలి కరోనా కేసు... నిఘా పెంచాలంటున్న నిపుణులు

    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్

మొట్టమొదటిసారి ఓ అడవి జంతువులో కరోనా వైరస్‌ను గుర్తించారు.

యూటాలోని ఒక మింక్ ఫార్మ్ సమీపంలోని అడవి మింక్‌‌కు కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో గుర్తించినట్లు అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) వెల్లడించింది.

అమెరికా, ఐరోపాల్లోని ఫార్మ్‌లలో ఇప్పటికే కరోనావైరస్ ప్రబలడంతో లక్షలాది మింక్‌లను చంపి పాతిపెట్టేశారు.

అయితే, వైరస్ ప్రబలిన ఫార్మ్స్ చుట్టుపక్కల వివిధ వన్యప్రాణులకు జరిపిన కరోనా పరీక్షల్లో భాగంగా యూటా సమీపంలో ఒక అడవి మింక్‌కూ కరోనావైరస్ ఉన్నట్లు గుర్తించామని యూఎస్‌డీఏ పేర్కొంది.

మిగతా ఎక్కడా ఏ ప్రాణిలోనూ వైరస్ జాడ కనిపించలేదని చెప్పింది.

‘వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్’ దృష్టికి విషయం తీసుకెళ్లామని... అయితే, మింక్ ఫార్మ్స్ చుట్టుపక్కల అడవి జంతువుల్లో ఈ వైరస్ ప్రబలిన ఆనవాళ్లు మాత్రం లేవని యూఎస్‌డీఏ చెప్పింది.

‘‘మాకు తెలిసినంతవరకు అడవిలో స్వేచ్ఛగా తిరిగే జంతువుల్లో ఇదే తొలి ‘సార్స్-కోవిడ్-2’ కేసు అని యూఎస్‌డీఏ పేర్కొంది.

దీంతో ఈ వైరస్ అడవి మింక్‌లో వ్యాపించే ప్రమాదం ఉందని బ్రిటన్‌లోని సర్రే యూనివర్సిటీ పశువైద్య నిపుణుడు డాక్టర్ డాన్ హర్టన్ అన్నారు.

వన్యప్రాణులకూ కరోనా వైరస్ సోకిందేమో తెలుసుకోవాలని.. దీనిపై దృష్టిపెట్టాలని తాజా ఉదంతం చెబుతోందని ఆయన అన్నారు.

అమెరికాలోని జంతుప్రదర్శన శాలల్లో ఉన్న పులులు, సింహాలు, చిరుతల్లోనూ.. అలాగే, పెంపుడు పిల్లులు, కుక్కల్లోనూ కరోనావైరస్ కనిపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)