ఛాయిస్ బ్లైండ్‌నెస్: మీ ఇష్టాలు ఏంటో నిజంగా మీకు తెలుసా? ఈ విషయంలో మీరు సులభంగా మోసపోతారా?

    • రచయిత, డేవిడ్ ఎడ్మండ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇద్దరు వ్యక్తుల ఫొటోలను చూపించి, వారిలో టక్కున ఎవరు నచ్చారో ఎంచుకోమంటే, మీరు ఎవరో ఒకరిని ఎంచుకుంటారు. అది అంత కష్టమైన పనేం కాదు. కానీ, ఆ ఇద్దరిలో ఆ వ్యక్తే మీకు ఎందుకు నచ్చారని అడిగితే మీరు సమాధానం చెప్పగలరా?

ఆ వ్యక్తిలో అంతగా నచ్చిన అంశం ఏముంది? కళ్లు బాగున్నాయా? జుట్టు బాగుందా? ముఖం ఆకారం నచ్చిందా? ఇలా మీలో చాలా ఆలోచనలు మొదలవుతాయి.

అయితే, ఇలా నచ్చిన అంశాన్ని ఎంచుకునే విషయంలో మనుషుల వ్యవహార శైలి గురించి ప్రొఫెసర్ పీటర్ జొహన్సన్ చెబుతున్న వివరాలు తెలుసుకుంటే, ఆశ్చర్యపోకుండా ఉండలేం.

స్వీడన్‌కు చెందిన పీటర్ జోహన్సన్ ఎక్స్పరిమెంటల్ సైకాలజిస్ట్. ఆయనకు మ్యాజిక్ అంటే ఇష్టం. కొంతవరకూ నేర్చుకున్నారు కూడా.

'ఛేంజ్ బ్లైండ్‌నెస్' (మార్పును గుర్తించలేకపోవడం) అనే అంశాన్ని ఉపయోగించుకుని జనాల దృష్టి మరల్చి, మెజీషియన్లు కార్డు ట్రిక్కుల్లాంటివి చేస్తుంటారు. అంటే, ప్రేక్షకుల దృష్టిని మరో అంశం మీదకు వెళ్లేలా చేసి, మార్పును కనిపించకుండా చేస్తారు.

ఇలాంటి మ్యాజిక్ నైపుణ్యాలను పీటర్ కూడా తన ప్రయోగాలకు ఉపయోగించుకున్నారు.

కొన్నేళ్ల క్రితం ఆయన, మరికొంత మంది పరిశోధకులతో కలిసి 'ఛాయిస్ బ్లైండ్‌నెస్' అనే అంశం గురించి ప్రయోగాత్మకంగా అధ్యయనం చేశారు.

ఇద్దరు వ్యక్తుల ముఖాలు కనిపించే ఫొటోలతో ఈ ప్రయోగం చేశారు. ఆ రెండు ఫొటోల్లోని వ్యక్తుల్లో ఎవరు ఆకర్షణీయంగా ఉన్నారో చెప్పమని కొందరిని అడిగారు.

అయితే, ఆ తర్వాత వారికి వారు ఎంచుకున్న వ్యక్తిది కాకుండా, మరో ఫొటో ఇచ్చి... అది వారు ఎంచుకున్న వ్యక్తి ఫొటోనే అని పరిశోధకులు అబద్ధం చెప్పారు. ఇప్పుడు వారిని ఎందుకు ఎంచుకున్నారో చెప్పమని అడిగారు.

ఫొటోలు మారిన విషయాన్ని చాలా మంది పసిగట్టలేకపోయారు. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 25 శాతం మందే ఆ విషయాన్ని గుర్తించారు.

నిజానికి ఆ ఫొటోల్లోని వ్యక్తుల మధ్య జుట్టు రంగు, చెవి పోగులు... ఇలా చాలా తేడాలు ఉన్నాయి.

అయినా, మారిన ఫొటోలో ఉన్న వ్యక్తి తాము ఎంచుకున్న వ్యక్తే అనుకొని వారి ఎంపికను సమర్థించుకుంటూ వాళ్లు వివరణలు ఇచ్చుకుంటూ వచ్చారు.

''తాము పక్కకుపెట్టిన వ్యక్తి ముఖమే, తాము మెచ్చిన ముఖం అనుకుని వాళ్లు పొరపాటుపడ్డారు. ముఖం బాగున్నందుకు ఎంచుకున్నామని చెప్పారు. కొందరైతే చెవి పోగులు ఉన్నందుకు ఆ వ్యక్తి నచ్చినట్లు చెప్పారు. నిజానికి వారు మొదట ఎంచుకున్న వ్యక్తికి అసలు చెవి పోగులు లేవు. ఇలా ముందు వ్యక్తిలో కనిపించని అంశాలను కూడా వాళ్లు ప్రస్తావించారు'' అని పీటర్ చెప్పారు.

ఈ ప్రయోగంతో అర్థమైన విషయం ఏంటంటే... మనం దేన్ని ఎందుకు ఎంచుకున్నామో కూడా మనకు సరిగ్గా తెలియదన్నమాట.

ఒక ముఖం కన్నా ఇంకో ముఖం ఎందుకు నచ్చిందన్న అంశానికి మరీ అంత ప్రాధాన్యత ఉన్నట్లు అనిపించకపోవచ్చు.

అయితే, ఇదే ప్రయోగం రాజకీయ అంశాలపై ఏర్పరుచుకునే అభిప్రాయాల ఆధారంగానూ జరిగింది.

ఈసారి ప్రయోగంలో పాల్గొన్నవారికి పరిశోధకులు ఓ ప్రశ్నావళి ఇచ్చారు. అందులో 12 రాజకీయ పరమైన ప్రశ్నలు ఉన్నాయి. పెట్రోల్ ధర పెరగాలా? వైద్య సదుపాయాలు తగ్గించాలా? పన్నులు పెంచాలా?... ఇలాంటి వివిధ అంశాలను సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా అన్నది జనాలను వాటిలో అడిగారు.

వారు సమాధానాలు ఇచ్చిన తర్వాత, ఆ పేపర్లలో ఉన్న జవాబులను మార్చేసి, మళ్లీ అవి వాళ్ల పేపర్లు అన్నట్లుగానే వారికి తిరిగి ఇచ్చారు.

పెట్రోల్ ధర పెరగొద్దు అన్న వ్యక్తికి, తాను పెరగాలి అన్నట్లుగా సమాధానం ఉన్న పత్రం వచ్చింది.

నిమిషం క్రితం ఇచ్చిన సమాధానాన్ని, మార్చి ఇచ్చినా వాళ్లు గుర్తించలేకపోయారు.

పెట్రోల్ ధర పెరగొద్దని మొదట చెప్పిన వాళ్లు, ఆ తర్వాత తాము పెరగాలని అన్నామేమో అనుకుని, దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. అందుకు బలమైన కారణాలను వాళ్లు చూపించడం గమనార్హం.

ఇలా చాలా మంది తాము మొదట ఇచ్చిన జవాబుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న వాదనను బలపరుస్తూ మాట్లాడారు. వాళ్లు తమ అసలు ఎంపిక అదేమోనని పొరబడ్డారు.

ఈ అధ్యయనం చెబుతున్న విషయం ఏంటంటే, జనాల వైఖరి మారిపోవడం సర్వసాధారణం.

ఒకసారి ఓ వంట నచ్చుతుందున్న వాళ్లు, మరో వంట నచ్చుతుందని చెప్పొచ్చు. ఓ నాయకుడిని, ఓ రాజకీయ పార్టీని సమర్థిస్తూ ఉన్నవాళ్లు... కొంత కాలం తర్వాత మరో నాయకుడిని,మరో పార్టీని ఇష్టపడొచ్చు.

ఈ మార్పును తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. అయితే, మారేవారూ తమ వైఖరి ఎందుకు మార్చుకుంటున్నామో పరిశీలన చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇలా మారే వైఖరితో కొంత ప్రమాదం కూడా ఉంది.

ఉదాహరణకు అమెరికాలో రిపబ్లికన్ పార్టీ సైద్ధాంతికంగా మార్కెట్ స్వేచ్ఛను సమర్థిస్తుంది. కానీ, ఆ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధమైన విధానాలను తీసుకురావాలని మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీని సమర్థించేవాళ్లు తమకు తెలియకుండానే, ఆయనకు ఈ విషయంలో మద్దతుగా నిలిచారు.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు పీటర్ జోహాన్సన్ మరో ప్రయోగం చేశారు.

ఆ సమయంలో డోనల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌కు మధ్య పోటీ జరిగింది.

ఈ ఇద్దరు అభ్యర్థులకు వ్యక్తిత్వం, అనుభవం... ఇలా అంశాల వారీగా మార్కులు ఇవ్వాలని కొందరిని పీటర్ కోరారు. వారు ఇచ్చిన మార్కులను మార్చి ఇచ్చిన తర్వాత, వారు చెప్పే అభిప్రాయాల్లోనూ మార్పులు వచ్చాయి.

ఛాయిస్ బ్లైండ్‌నెస్‌ను కొందరు మోసపూరితంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. లేని అభిప్రాయాన్ని జనానికి కలిగించవచ్చు. రాజకీయ అంశాలపైనా కొత్త ధోరణిని వారిపై రుద్దవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)