కరోనావైరస్: వాసన, రుచి కోల్పోతే... మళ్లీ మామూలుగా అవుతోందా? ఎంత కాలం పడుతోంది?

    • రచయిత, స్మిత ముందసాద్
    • హోదా, బీబీసీ హెల్త్ ప్రతినిధి

కరోనావైరస్ బారిన పడి రుచి, వాసన కోల్పోయిన 90 శాతం మందికి తిరిగి ఒక నెల లోగా రుచి, వాసన చూడటం మెరుగుపడుతున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

ఈ సమస్యలు ఎదుర్కొన్న రోగుల్లో 49 శాతం మందికి రుచి, వాసన పూర్తిగా సాధారణ స్థితికి వచ్చినట్లు, 40 శాతం మందికి పరిస్థితి మెరుగుపడినట్లు ఇటలీలో నిర్వహించిన ఈ అధ్యయనం పేర్కొంది.

కానీ, 10 శాతం మందిలో మాత్రం పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడం గాని, మరింత తీవ్రంగా మారడం కానీ జరుగుతోందని తెలిపారు.

మహమ్మారి తీవ్రత దృష్ట్యా వైరస్ సోకి తగ్గిన తర్వాత కూడా, కొన్ని వేల మంది ప్రజలు దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడవచ్చని నిపుణులు హెచ్చరించారు.

రుచి, వాసన కోల్పోవడాన్ని కూడా కరోనావైరస్ లక్షణాలుగా గుర్తిస్తున్నారు.

తేలికపాటి అనారోగ్యం

ఎవరైనా తేలికపాటి అనారోగ్య లక్షణాలను కలిగి ఉంటే, వెంటనే వారు ఐసొలేషన్‌లో ఉండాలని.. వారితో పాటు కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకోవాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సూచించింది.

ఇటలీలో వైరస్ సోకి, హాస్పిటల్‌లో చేరేంత తీవ్రమైన అనారోగ్యం లేని మొత్తం 187 మందిపై అంతర్జాతీయ వైద్య పరిశోధకుల బృందం సర్వే నిర్వహించింది.

వైరస్ సోకిన కొత్తలో రుచి, వాసన ఎలా ఉన్నాయో, కోలుకున్న తర్వాత ఎలా ఉన్నాయో పరిశీలించాలని వీరికి చెప్పింది.

ఇందులో 113 మంది తమ రుచి, వాసన చూసే లక్షణాలలో తేడా కనిపించినట్లు చెప్పారు.

55 మంది తాము పూర్తిగా సాధారణ స్థితికి వచ్చినట్లు తెలిపారు. 46 మంది రుచి, వాసన మెరుగు పడినట్లు చెప్పారు.

12 మంది మాత్రం తమ లక్షణాలు మరింత తీవ్రంగా పరిణమించాయన్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

తీవ్రమైన వైరస్ లక్షణాలతో బాధపడిన వారికి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది.

వైరస్ లక్షణాలు దీర్ఘ కాలం ఉన్న వారిపై తమ బృందం పరిశోధన చేస్తోందని బ్రిటిష్ రైనోలాజికల్ సొసైటీ అధ్యక్షులు, పరిశోధన బృందంలో సభ్యురాలు ప్రొఫెసర్ క్లెయిర్ హాప్కిన్స్ చెప్పారు.

"వైరస్ వలన కలిగిన రోగాలు, మేము సేకరిస్తున్న కొత్త సమాచారాన్ని పరిశీలిస్తే, అత్యధిక శాతం ప్రజలు ఈ వైరస్ లక్షణాల నుంచి కోలుకుంటున్నప్పటకీ, కొంత మందికి మాత్రం కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది.’’

"ముక్కు భాగం దగ్గర ఉండే కణాలను మాత్రమే ప్రభావితం చేసిన వారు త్వరగా కోలుకుంటూ ఉండవచ్చు. వాసన చూసే నరాలకు కూడా వైరస్ సోకి ఉండటం వలన, కొంత మందికి కోలుకోవడానికి ఎక్కువ రోజులు పడుతూ ఉండవచ్చు. నరాల భాగంలో ఉండే కణజాలం పునరుజ్జీవం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. వైరస్ ప్రభావం ఎంత ఎక్కువ మందిపై ఉందో చూస్తుంటే.. చికిత్స చేయలేని కొన్ని లక్షణాలతో రోగులు వెల్లువలా పెరిగే అవకాశముంది" ఎమొరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో నిపుణుడు డాక్టర్ జాషువా లెవి ఒక జర్నల్‌లో రాశారు.

కానీ, ఇలాంటి లక్షణాలతో బాధపడేవారికి సరైన వైద్య సహాయం అందటం లేదని అభిప్రాయపడ్డారు. ఎక్కువ రోజులు రుచి, వాసన తెలియకుండా ఉన్నవారు వాసన చూసే థెరపీ లాంటివి చేయించుకోవాలని సూచించారు.

ఈ పరిశోధన పత్రం జేఏఎంఏ వోటోలారింజాలజి - హెడ్ అండ్ నెక్ సర్జరీలో ప్రచురితమయింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)