మాస్క్‌ వాడమన్నందుకు మర్డర్‌ - అమెరికాలో స్టోర్‌ గార్డును కాల్చిచంపిన ఓ కుటుంబం

మాస్క్‌ లేదన్న కారణంతో తన కూతురును షాప్‌లోకి రానివ్వనందుకు సెక్యూరిటీ గార్డును కాల్చి చంపిన ఆరోపణలపై ఓ మహిళను అమెరికాలోని మిచిగన్‌ స్టేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె భర్త కుమారుడిపై కూడా కేసులు నమోదు చేశారు. మిచిగన్‌లోని ఫ్లింట్ ప్రాంతంలో ఉన్న ఫ్యామిలీ డాలర్‌ అనే స్టోర్‌లో పనిచేస్తున్న 43ఏళ్ల సెక్యూరిటీ గార్డు కెల్విన్‌ మునెర్లిన్ తలలో బుల్లెట్ గాయంతో శుక్రవారంనాడు మరణించారు. అమెరికాలో కరోనావైరస్‌ తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో మిచిగన్‌ రాష్ట్రం ఒకటి . తన కూతురిని మాస్క్‌ లేనందుకు షాప్‌లోకి రానివ్వలేదని ఆగ్రహించిన 45ఏళ్ల షార్మెల్ టీగ్‌ అనే మహిళ సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపింది. మిచిగన్‌ స్టేట్‌లో స్టోర్లు, బిజినెస్‌ ఏరియాలలో ఫేస్‌ మాస్క్‌ ధరించడం చట్టపరంగా తప్పనిసరి. కాల్పులు జరిపిన మహిళ భర్త ల్యారీ టీగ్‌, కొడుకు రమోనియా బిషప్‌లపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. వారు కూడా సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారన్న ఆరోపణలు చేశారు పోలీసులు. కాల్పులు జరిపిన షార్మెల్ టీగ్‌ అనే మహిళను అరెస్టు చేయగా, తండ్రి, కొడుకు అక్కడి నుంచి పరారయ్యారు. ఉద్దేశపూర్వక హత్య, ఆయుధాల వాడకం ఆరోపణల మీద ముగ్గురిపైనా కేసులు పెట్టారు పోలీసులు. మాస్క్‌లు ధరించకుండా గవర్నర్‌ ఆదేశాలను ఉల్లంఘించారని ల్యారీటీగ్‌పై కేసు నమోదు చేశారు. కరోనావైరస్‌ను సమర్ధవంతంగా అడ్డుకోవడానికి స్టోర్లలోకి వెళ్లేవారు తప్పనిసరిగా ఫేస్‌ మాస్క్‌ వాడాలన్న నిబంధనలు మిచిగన్‌ స్టేట్‌లో అమలులో ఉన్నాయి. అయితే ఈ కేసులో షార్మెల్‌, ల్యారీ టీగ్‌ల కుమార్తెపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు పోలీసులు.

మొదట కొంత వాగ్వాదం జరిగిందని, సెక్యూరిటీ గార్డ్‌ మునెర్లిన్‌తో షార్మెల్ తీవ్రస్థాయిలో గొడవ పడిందని, ఆ తర్వాత తన కారులో వెళ్లిపోయిందని జినెస్సీ కౌంటీ ప్రాసిక్యూటర్‌ డేవిడ్‌ లీటన్ వెల్లడించారు.

కాసేపటికి ఆమె తన కొడుకును, భర్తను వెంటబెట్టుకుని స్టోర్‌ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత గార్డుపై దాడి చేసిందని అధికారులు వెల్లడించారు. ఆమె కొడుకే ట్రిగ్గర్‌ నొక్కాడని చెబుతున్నారు.

''సెక్యూరిటీ గార్డ్‌ కెల్విన్‌ మునెర్లిన్‌ హత్య ఒక అర్ధంలేని, విషాదఘటన. ఈ కేసులో నిందితులైన వారిపై విచారణ జరిపి చట్టపరమైన శిక్షలు అమలు చేస్తాం'' అని ప్రాసిక్యూటర్‌ వెల్లడించారు.

''నా కొడుకు తన విధులు నిర్వర్తించాడు. వాడు చేసిన తప్పేముంది'' అని మునెర్లిన్‌ తల్లి బెర్నాడెట్‌ అసోసియేటెడ్‌ ప్రెస్‌ న్యూస్‌ ఏజెన్సీతో అన్నారు. మునెర్లిన్‌ అంత్యక్రియల కోసం నిధుల సేకరించడానికి గో ఫండ్‌ మీ అనే పేజ్‌ను సిద్ధం చేశారు. దీని ద్వారా 100,000 డాలర్లు (80,000 యూరోలో) సేకరించారు. ఈ వెబ్‌పేజ్ ప్రకారం మునెర్లిన్‌ మరణంతో ఎనిమిదిమంది పిల్లలు అనాథలయ్యారు. కోవిడ్‌-19ను అడ్డుకోడానికి బిజినెస్‌ ఏరియాలో, స్టోర్స్‌లో ప్రవేశించేవారు తప్పకుండా మాస్క్‌ ధరించాలని మిచిగన్‌ గవర్నర్‌ గ్రెచెన్‌ విట్మర్‌ ఆదేశాలు జారీ చేశారు. మాస్క్‌ లేకుండా వచ్చేవారికి సేవలు నిరాకరించవచ్చని తన ఆదేశాలలో గవర్నర్‌ పేర్కొన్నారు. సోమవారంనాటికి మిచిగన్‌ రాష్ట్రంలో 43,950కేసులు నమోదయ్యాయి. అందులో 4,135మంది మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి. గతవారం పెద్ద ఎత్తున స్థానికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అందులో కొందరు ఆయుధాలు ధరించి ఉన్నారు. గవర్నర్‌ తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని స్టేట్‌ హౌస్‌ దగ్గర గుమిగూడిన ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. కరోనావైరస్‌ సంబంధిత నిబంధనలపై అమెరికాలోని పలు ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నుంచి బిజినెస్‌ ఏరియాలో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఓక్లహమాలో అమల్లోకి తెచ్చిన నిబంధనలను, కస్టమర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో అధికారులు రద్దు చేశారు.

ఈ విషయంలో కొంతమంది తమను తుపాకులతో బెదిరించారని స్టిల్‌వాటర్‌ ప్రాంతంలో స్టోర్లలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు వెల్లడించారు. అయితే ఈ నిబంధనలను పాటించేలా కస్టమర్లను ఒప్పించాలని , కఠినంగా అమలు చేయాల్సిన అవసరం లేదంటూ, నిబంధనలను సవరిస్తూ ఓక్లహామా మేయర్‌ విల్‌ జాయిస్‌ నిర్ణయం తీసుకున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)