India Vs New Zealand: ఐదో టీ20లో న్యూజీలాండ్‌పై విజయంతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్

న్యూజీలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారానికి ఎంపికయ్యారు.

లక్ష్యం చిన్నదైనప్పటికీ చివరి ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన భారత్.. న్యూజీలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టు ఓటమి మూటగట్టుకుంది.

భారత బౌలర్లలో బుమ్రా మరోసారి తన పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఇరుకున పెట్టాడు. నాలుగు ఓవర్లలో ఓ మెయిడెన్‌తో వేసి, కేవలం 12 పరుగులే ఇచ్చి, మూడు వికెట్లు తీశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీయ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ సంజూ శాంసన్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు.

అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చారు.

ధాటిగా ఆడిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. 12వ ఓవర్లో బెన్నెట్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

మరోవైపు రోహిత్ కూడా తన బ్యాట్‌కు పని చెప్పాడు. కేవలం 41 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 60 పరుగులు చేశాడు. కానీ 17వ ఓవర్లో జట్టు స్కోరు 138 వద్ద రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు.

శివమ్ దూబే 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఒక ఫోర్, రెండు సిక్సులతో 31 బంతుల్లో 33 పరుగులతో, మనీశ్ పాండే నాలుగు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ సాయంతో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

టీమిండియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఈ మ్యాచ్‌లో కివీస్ సఫలమైంది. బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేశారు.

కివీస్ బౌలర్లలో సౌథీ నాలుగు ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్నాడు.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడినా...

164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. కానీ మధ్యలో

ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, మున్రోలు నిరాశపరిచారు. కానీ వికెట్ కీపర్ సిఫర్ట్, టేలర్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.

ముఖ్యంగా పదో ఓవర్ బౌలింగ్ చేసిన శివమ్ దూబేకు ఈ ఇద్దరు న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. నాలుగు సిక్సులు, ఓ ఫోర్ సాయంతో మొత్తం 34 పరుగులు పిండుకున్నారు.

ఆ తర్వాత కివీస్ జట్టు వడివడిగా వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 116 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి గెలిచే స్థితిలో ఉన్న ఆ జట్టు 10 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది.

నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో సౌథీ కాస్త ప్రతిఘటించినా విజయం భారత్ వశమైంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)