సిడ్నీ టెస్ట్: ఆస్ట్రేలియాపై రిషభ్ పంత్ కొత్త రికార్డు.. ధోనీకి సాధ్యం కానిది రిషబ్ సొంతమైంది

ఫొటో సోర్స్, Getty Images
సిడ్నీ టెస్టులో రెండో రోజు భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆస్ట్రేలియాపై సరికొత్త రికార్డును సృష్టించాడు.
మహేంద్ర సింగ్ ధోనీ, ఫారూఖ్ ఇంజనీర్ లాంటి భారత టాప్ వికెట్ కీపర్లకు కూడా దక్కని ఘనతను సొంతం చేసుకున్నాడు.
సిరీస్లో నాలుగోది చివరిది అయిన టెస్టుకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పేన్ 'బేబీ సిట్టర్' చాలెంజ్ పూర్తి చేసిన పంత్ మైదానంలో ఆతిథ్య జట్టు బౌలర్లను ధాటిగా ఎదుర్కుని కేవలం 137బంతుల్లో సెంచరీ చేశాడు.
దీంతో పంత్ ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయ్యాడు.
చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాతో కీలక భాగస్వామ్యాలు అందించిన పంత్ సిడ్నీ టెస్టులో భారత్ను బలమైన స్థితిలో నిలిపాడు.
భారత్ ఏడు వికెట్ల నష్టానికి 622 పరుగుల దగ్గర తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
రిషభ్ కీలక భాగస్వామ్యాలు
తొమ్మిదో టెస్ట్ ఆడుతున్న రిషబ్ పంత్కు టెస్ట్ కెరీర్లో ఇది రెండో సెంచరీ. ఇంతకు ముందు అతడు ఇంగ్లండ్లో సెంచరీ చేశాడు. ఇంగ్లండ్పై ఓవెల్ టెస్టులో పంత్ 114 పరుగులు చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సెంచరీ చేసిన రిషబ్ పంత్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విటర్లో తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు.
రిషబ్ పంత్ వెస్టిండీస్ మాజీ వికెట్ కీపర్ జెఫ్ డూజాన్ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్ అయ్యాడు.
పుజారాతో కలిసి పంత్ ఐదో వికెట్కు 89 పరుగులు జోడించాడు.

ఫొటో సోర్స్, Getty Images
పుజారా డబుల్ సెంచరీ మిస్
మొదటి రోజు 130 పరుగులతో నాటౌట్గా నిలిచిన పుజారా రెండో రోజు తన జోరు కొనసాగించాడు. కానీ తన డబుల్ సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. 193 పరుగులు చేసి నాథన్ లయన్ బంతికి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత పంత్, రవీంద్ర జడేజాతో కలిసి టీమ్ స్కోరును పరిగెత్తించాడు. పంత్కు అండగా నిలిచిన రవీంద్ర జడేజా 89 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సిడ్నీలో కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన పంత్ ప్రస్తుత టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. సిరీస్లో అతడి కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ పుజారా మాత్రమే.
రెండో రోజు 622 పరుగుల దగ్గర రవీంద్ర జడేజా(81) అవుట్ కాగానే కెప్టెన్ కోహ్లీ భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. పంత్ 159 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
- టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు
- ద్రవిడ్ గురించి ఆయన భార్య విజేత ఏమన్నారు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- ఎవరీ పృథ్వీ షా? సచిన్ ఈ కుర్రాడి గురించి ఏమన్నాడు?
- రోహిత్ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








