రష్యా: వరల్డ్ కప్ను అడ్డుకోవాలన్నదే పశ్చిమ దేశాల ప్రయత్నం

ఫొటో సోర్స్, Reuters
ఫిఫా ప్రపంచకప్ తమ దేశంలో జరగకుండా అడ్డుకునేందుకు బ్రిటన్, అమెరికాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఆరోపించారు.
"జూన్లో ప్రారంభం కావాల్సిన ఫిఫా వరల్డ్ కప్ను రష్యా నుంచి బయటకు తరలించడమే ఆ దేశాల ప్రధాన ఉద్దేశం" అని రష్యా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు.
బ్రిటన్లో మాజీ గూఢచారితో పాటు, ఆయన కుమార్తెపై విష ప్రయోగం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు బ్రిటన్ ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగానే 23 మంది రష్యా రాయబారులను థెరిసా మే ప్రభుత్వం బహిష్కరించింది.
అలాగే ఈ జూన్లో జరగబోయే ఫిఫా ప్రపంచ కప్ను బహిష్కరిస్తున్నట్టు బ్రిటిష్ రాయల్ కుటుంబం ప్రకటించింది. తమ కుటుంబ సభ్యులెవరూ ఆ క్రీడలకు వెళ్లబోరని పేర్కొంది.
1936లో బెర్లిన్ ఒలింపిక్స్ను హిట్లర్ ఎలా వాడుకున్నారో, ఇప్పుడు ఈ వరల్డ్ కప్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ అలా వాడుకుంటున్నారని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి బోరిస్ జాన్సన్ విమర్శించారు.
"ఈ క్రీడలను వాయిదా వేయాలి, లేదంటే మరో దేశంలో నిర్వహించాలి" అని బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ డిమాండ్ చేశారు.
అయితే, ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలను బ్రిటన్ బహిష్కరిస్తుందన్న సూచనలు మాత్రం కనిపించడంలేదు.
సంబంధిత కథనాలు:
బ్రిటన్కు సంఘీభావంగా 20 పైగా దేశాలు రష్యా రాయబారులను తమ దేశం నుంచి బహిష్కరించాయి. వాటిలో అమెరికా కూడా ఉంది. 60 మంది రష్యా రాయబారులను బహిష్కరించిన అమెరికా, సియాటెల్లోని రష్యా కాన్సులేట్ జనరల్ను కూడా మూసివేసింది.
అందుకు ప్రతిచర్యగా 60 మంది అమెరికా దౌత్యాధికారులపై రష్యా వేటు వేసింది. సెయింట్ పీటర్స్బర్గ్లోని అమెరికా కాన్సులేట్ను కూడా మూసివేసింది. అక్కడి నుంచి అమెరికా జాతీయ పతాకాన్ని కూడా తొలగించారు.
శుక్రవారం సాయంత్రం 170 మంది రష్యా దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లారు.

ఫొటో సోర్స్, EPA/ YULIA SKRIPAL/FACEBOOK
నేపథ్యం ఏంటి?
మార్చి 4న తమ దేశంలో మాజీ గూఢచారి సిర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తెపై రష్యా విష ప్రయోగం చేసిందని బ్రిటన్ ఆరోపించింది. దీన్ని రష్యా ఖండించింది.
66 యేళ్ల సిర్గీ స్క్రిపాల్ గతంలో రష్యా సైనికాధికారిగా పని చేశారు.
తన ముప్ఫైమూడేళ్ల కూతురు యూలియా స్క్రిపాల్తోపాటుగా మార్చి 4న సాల్స్బరీలోని వీధిలో ఓ బెంచ్పై అచేతనంగా పడివున్నారు. స్థానికుల సమాచారంతో వీరిని పరీక్షించిన వైద్యులు వీరిపై విషప్రయోగం జరిగిందని ప్రాథమికంగా తెలిపారు.
సెర్గీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉండగా, ఆయన కుమార్తె స్పృహలోకి వచ్చారని తెలిసింది.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









