You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
న్యూయార్క్ బాంబు దాడి: ట్రంప్ను ముందే హెచ్చరించిన బంగ్లాదేశీయుడు
న్యూయార్క్లో తాజాగా జరిగిన బాంబు పేలుడుకు సంబంధించి మరో కోణం బయటకు వచ్చింది.
బాంబు దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్న అకాయేద్ ఉల్లా (27) ముందుగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను హెచ్చరించాడు.
"ట్రంప్.. నీ దేశాన్ని రక్షించడంలో నువ్వు విఫలమయ్యావు" అని ఫేస్బుక్ ఖాతాలో ఉల్లా పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమ ఛార్జ్ సీటులో వెల్లడించారు.
అకాయేద్ ఉల్లా బంగ్లాదేశ్ నుంచి ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చారు.
ఏడాది నుంచి పరిశోధన
"ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కోసం నేను ఈ దాడికి పాల్పడ్డాను. ఐఎస్ లక్ష్యంగా అమెరికా చేస్తున్న విమాన దాడులు నన్ను ఇందుకు పురిగొల్పాయి" అని విచారణలో ఉల్లా వెల్లడించినట్లు పోలీసులు ఛార్జ్ సీటులో పేర్కొన్నారు.
"దాదాపు ఏడాది నుంచి బాంబు తయారు చేయడంపై ఉల్లా పరిశోధనలు చేస్తున్నాడు. ఉల్లా ఇంటిలో ఇందుకు సంబంధించి అనేక సామాగ్రి లభించింది. మన్హటన్ దాడి కోసం కొన్ని వారాల ముందే ప్రణాళిక రచించాడు." అని విచారణ అధికారి జూమ్ కిమ్ తెలిపారు.
అయితే గత సెప్టెంబరులో ఉల్లా తమ దేశం వచ్చాడని అతనికి ఎటువంటి నేర చరిత్ర లేదని బంగ్లాదేశ్ చెప్పింది.
సోమవారం ఉదయం రద్దీ సమయంలో న్యూయార్క్, మన్హటన్లోని పోర్ట్ అథారిటీ టెర్మినల్ వద్ద బాంబు దాడి జరిగింది.
ఉల్లా తన శరీరానికి ‘లో-టెక్ పేలుడు పరికరా’న్ని అమర్చుకుని పేల్చుకున్నాడని.. ఆ పేలుడులో అతడు గాయపడ్డాడని అధికారులు చెప్పారు.
సబ్వేలో జరిగిన ఈ పేలుడులో మరో ముగ్గురు కూడా స్వల్పంగా గాయపడ్డారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)