INDvsSA: 5 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచిన దక్షిణాఫ్రికా

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడి పోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.

134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 137 పరుగులు చేసింది. 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది.

మొదట్లోనే వికెట్లు

దక్షిణాఫ్రికా 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా ఆరంభంలోనే భారత బౌలర్ అర్షదీప్ సింగ్ షాక్ ఇచ్చాడు.

రెండో ఓవర్ తొలి బంతికే క్వింటన్ డీ కాక్‌ను అవుట్ చేశాడు. అప్పటికి దక్షిణఫ్రికా స్కోరు 3 పరుగులు మాత్రమే.

ఆ తరువాత అదే ఓవర్లో మూడో బంతికి రిలీని ఎల్‌బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు అర్షదీప్.

దీంతో 3 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది దక్షిణాఫ్రికా.

5 ఓవర్లలో కెప్టెన్ బవుమాను అవుట్ చేశాడు షమీ.

అయితే అయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశారు.

మార్కరమ్ ఒకవైపు పరుగులు తీస్తుండగా మిల్లర్ అతనికి మద్దతుగా నిలిచాడు.

నిలబడిన మార్కరమ్

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్కరమ్, మిల్లర్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

ఒకవైపు వికెట్లు పడకుండా చూసుకుంటూనే ధాటిగా పరుగులు రాబట్టారు.

మెల్లగా రన్ రేట్ పెంచుకుంటూ వెళ్లారు.

37 బంతుల్లో 48 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో మార్కరమ్‌ను హార్దిక్ పాండ్య అవుట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చిన మార్కరమ్ 41 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 6 ఫోర్లు 1 సిక్స్ కొట్టాడు.

100 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా 4వ వికెట్ కోల్పోయింది. అప్పటికి 15 ఓవర్ల మ్యాచ్ ముగిసింది.

ముగించిన మిల్లర్

మరొక ఎండ్‌లో మిల్లర్ నిలకడగా ఆడాడు. మార్కరమ్ అవుట్ అయినా స్టబ్స్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు.

122 పరుగుల వద్ద స్టబ్స్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు.

మిల్లర్‌కు పార్నెల్ జత కలిశాడు.

చివరి ఓవర్లో 6 బంతుల్లో ఆరు పరుగులు అవసరం అయ్యాయి.

భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవరు తొలి బంతికి పరుగులు రాలేదు.

రెండో బంతికి పార్నెల్ సింగిల్ తీశాడు.

మూడో బంతికి మిల్లర్ ఫోర్ కొట్టాడు.

నాలుగో బంతికి కూడ ఫోర్ కొట్టి మిల్లర్ దక్షిణాఫ్రికాను గెలిపించాడు.

మొత్తం మీద మిల్లర్ 46 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి.

టాప్ ఆర్డర్ కూల్చిన లుంగి ఎంగిడి

తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు కుదురు కోవడానికి సమయం తీసుకున్నా 4వ ఓవర్ వరకు టీం ఇండియా బ్యాటింగ్ బాగానే జరిగింది.

ఆ తరువాత దక్షిణాఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడి బాల్ తీసుకున్నాడు.

తాను వేసిన రెండో బాల్‌కే కెప్టెన్ రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపించాడు ఎంగిడి. రోహిత్ శర్మ 14 బంతుల్లో 15 పరుగులు చేశాడు.

23 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

అదే ఓవరు చివరి బంతికి మరొక ఓపెనర్ రాహుల్‌ను ఎంగిడి అవుట్ చేశాడు. మాక్రమ్‌కు రాహుల్ క్యాచ్ ఇచ్చాడు. 14 బంతుల్లో 9 పరుగులు చేశాడు రాహుల్.

రెండో వికెట్ పడే సమయానికి భారత్ స్కోరు 26 పరుగులు.

7వ ఓవర్‌లో విరాట్ కోహ్లీని పెవిలియన్‌కు పంపాడు ఎంగిడి. ఆ ఓవర్‌ తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచిన కోహ్లీ అయిదో బంతికి దక్షిణాఫ్రికా కెప్టెన్ రబడకు క్యాచ్ ఇచ్చాడు.

ఆ తరువాత ఓవర్లో దీపక్ హుడాను నోకియా అవుట్ చేశాడు. పరుగులు ఏమీ చేయకుండానే దీపక్ హుడా వెనక్కి తిరిగాడు. అదే ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ కావాల్సిన ప్రమాదం నుంచి బయట పడ్డాడు.

9వ ఓవర్లలో మరొక సారి టీం ఇండియాకు షాక్ ఇచ్చాడు ఎంగిడి. 2 పరుగులకే హార్దిక్ పాండ్యాను వెనక్కి పంపించాడు.

49 పరుగులకే టీం ఇండియా 5 వికెట్లు పోగొట్టుకుంది.

సూర్యకుమార్ యాదవ్ పోరాటం

టీం ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ఒకవైపు వికెట్లు పడకుండా చూస్తూనే పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు.

పరిస్థితులు కష్టంగానే ఉన్నప్పటికీ తడబడకుండా సూర్యకుమార్ ఆడాడు. 30 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

కానీ 16వ ఓవర్లలో దినేశ్ కార్తీక్‌ను పార్నెల్ అవుట్ చేశాడు. 15 పరుగులు మాత్రమే కార్తీక్ చేశాడు.

దినేశ్ కార్తీక్ అవుట్ తరువాత కూడా సూర్యకుమార్ యాదవ్ తగ్గలేదు.

19వ ఓవర్లలో రవిచంద్రన్ అశ్విన్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో సూర్యకుమార్ యాదవ్‌‌ను పార్నెల్ వెనక్కి పంపాడు. 68 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. మొత్తం 6 ఫోర్లు 3 సిక్సులు కొట్టాడు.

చివరి ఓవర్లలో షమీ రన్ అవుట్ అయ్యాడు.

చివరకు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది ఇండియా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)