తిరుపతి: మహిళలు నడిపిస్తున్న టీ షాపులు.. ‘ఇక్కడ మగవాళ్లకు ఉద్యోగాలు లేవు’

వీడియో క్యాప్షన్, తిరుపతి: మహిళలు నడిపిస్తున్న టీ షాపులు.. ‘ఇక్కడ మగవాళ్లకు ఉద్యోగాలు లేవు’

తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం

ఇది మహిళలు నడిపే కేఫ్. టీ, కాఫీలతో పాటు జ్యూస్‌లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. యజమానితో పాటు వర్కర్లు అందరూ మహిళలే. పురుషులకు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వరు.

''ఆడవాళ్లకు మాత్రమే పనికలిపించాలనే ఉద్దేశం మాది. జెంట్స్ కి యిక్కడ అంతా లేదు యిక్కడ. ఆడ వాళ్ళకు మాత్రమే పని కలపించే వుద్దేశ్యం తో డ్వాక్రా లాంటి సంఘాలు వున్నాయి కదా. అలాగా నేను యిక్కడ లేడీస్ కే ఉపాధి కల్పించాలని ఉద్దేశం తో చేస్తున్న. యింట్లో చిన్న గిన్నె పెడతాము యిక్కడ పెద్ద గిన్నె పెడతాము అంతే తేడా. యింట్లో నలుగురికి పెడితే యిక్కడ 40 మందికి పెడతాము'' అని షాపు యజమానురాలు మాధవి చెప్పారు.

ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక తిరుపతికి చెందిన మాధవి టీ వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు మూడు షాపులు నిర్వహిస్తున్నారు. అన్నిట్లోనూ ఆడవాళ్లకే ఉద్యోగాలు ఇచ్చారు. ఈ షాపుల్లో 20 మంది వరకు మహిళలు పని చేస్తున్నారు.

''టీ తాగేదానికని వచ్చాను పని ఉందా అని అడిగాను ఇస్తామని చెప్పారు. ఇక్కడే కంటిన్యూ చేసుకుంటున్నా.. ఈడ పనిచేసుకుంటేనే లేకపోతే ఎంలేదు'' అని షాపులో పనిచేసే మహిళ కళ చెప్పారు.

మహిళల టీ షాపు

టీ మాస్టర్ నుంచి క్లీనింగ్, సప్లై అంతా ఆడవాళ్లే చూసుకుంటారు. అందరూ అన్ని పనులూ చేస్తారు. ఇక్కడ వచ్చిన జీతంతో తమ పిల్లల చదువులు సాఫీగా సాగుతున్నాయని కళావతి చెబుతున్నారు.

''మా ఆయన టైలరింగ్ చేస్తాడు. మా ఆయన సంపాదన సరిపోవడం లేదు. నా సంపాదన తోడైతే పిల్లల చదువులకు ఉపయోగపడుతుందని ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాను. నాకు ఇబ్బంది లేకుండా మా పిల్లల చదువులకి జరుగుతోంది'' అని టీ షాపులో పనిచేసే మరో మహిళ కళావతి అన్నారు.

అందరూ మహిళలే ఉండటంతో పని చేయడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తోటి మహిళలు చెబుతున్నారు.

''ఇంతకు ముందు ఎక్కడ పని చేయలేదు. హౌస్ వైఫ్ గా యింట్లోనే వున్నాను. ఇప్పుడు ఎనిమిది నెలలుగా ఇక్కడికి వస్తున్న. ఎప్పుడు ఎక్కడ పనికి పోయింది లేదు. ఇక్కడ అంతా లేడీస్ వున్నారు. ఇక్కడైతే బాగుంటుంది. ఎక్కడ బయట తిరగాల్సిన అవసరం లేదు సేఫ్టీ ఉంటుంది అని ఇక్కడ పనికి చేరాను'' అని ఉమా మహేశ్వరి చెప్పారు.

కొందరు పురుషులు అభ్యంతరకరంగా మాట్లాడుతుంటారని, వాటిని తాము పట్టించుకోబోమని మాధవి అన్నారు. చదువుకుంటూ పార్ట్ టైం పనిచేసే అమ్మాయిలకు కూడా తాము అవకాశం ఇస్తామని చెప్పారు. కరోనా సమయంలో కూడా సిబ్బందికి సగం జీతం ఇచ్చినట్టు వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)