ఆంధ్ర అరటికి విదేశాల్లో అంత డిమాండ్ ఎందుకు?

వీడియో క్యాప్షన్, ఆంధ్ర అరటికి విదేశాల్లో అంత డిమాండ్ ఎందుకు?

ఒకనాడు ఆహార పంటల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉద్యాన పంటల విస్తీర్ణం పెరుగుతోంది. అందులోనూ అరటి సాగు, దిగుబడి ఎక్కువగా ఉంది. ఇటీవల లోక్‌సభకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో అరటి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉంది.

అంతేకాదు గత ఏడాది అరటి ఎగుమతుల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది ఆంధ్రప్రదేశ్. గతంలో మహారాష్ట్ర టాప్‌లో ఉండేది.

విదేశాలకు భారీగా ఆంధ్రా అరటి

భారతదేశంలో అరటిని భారీగా సాగు చేస్తారు. దేశం నుంచి 2020 ఏప్రిల్ నాటికి రూ.447 కోట్ల విలువ చేసే 1,27,230 టన్నుల అరటిని ఎగుమతి చేశారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 47 శాతం అధికం. గత ఏడాది ఒక్క ఏపీ నుంచే 43,935 టన్నుల అరటి ఎగుమతి జరిగింది. అంతకుముందు ఏడాది ఇది 38,500 టన్నులుగా ఉంది. ఈ ఏడాది 50వేల టన్నుల పైబడి ఉంటుందని అధికారిక అంచనాలు చెబుతున్నాయి.

ఈ ఎగుమతుల విలువ సుమారు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. ఏపీ నుంచి ప్రధానంగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతి చేస్తుండగా, దిగుమతి చేసుకునే దేశాల్లో సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉంది. కడప, అనంతపురం జిల్లాల పరిధిలో పండించే గ్రాండ్-9 రకం అరటికి విదేశాల్లో మంచి ఆదరణ కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)