బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్ బిపిన్‌ రావత్‌ చనిపోయారు.

బిపిన్‌ రావత్‌ భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది.

ఆ 11 మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయితేజ కూడా ఉన్నారు.

సాయితేజది చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం.

రక్షణ శాఖలో సాయితేజ లాన్స్‌నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ పని చేస్తున్నారు.

2013లో ఆర్మీలో జాయిన్ అయ్యారు సాయితేజ.

సాయితేజ సోదరుడు కూడా ఆర్మీలోనే ఉన్నారు.

సాయితేజ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సాయితేజ్‌కు భార్య శ్యామల (26), కుమారుడు మోక్షజ్ఞ (5) కుమార్తె దర్శిని (2) ఉన్నారు.

చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు.

ఈరోజు ఉదయమే సాయితేజ తన భార్యతో ఫోన్లో మాట్లాడినట్టు ఆయన బాబాయ్ స్థానిక మీడియా ప్రతినిధులకు తెలిపారు.పిల్లల చదువుల కోసం సాయి తేజ భార్య మదనపల్లెలో ఉంటున్నారు.

సాయితేజ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు.

లాన్స్‌ నాయక్‌ సాయితేజ మృతిపై ఏపీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.

సాయి తేజ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)