బిపిన్ రావత్: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులోని నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.

బిపిన్ రావత్‌ భార్య మధులిక రావత్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారని తెలిపింది.

జనరల్ బిపిన్ రావత్ నీలగిరి హిల్స్‌లోని వెల్లింగ్టన్‌‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ సందర్శనకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్గర్ కూనూర్ సమీపంలో క్రాష్ అయ్యింది.

హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఇతర ఆర్మీ అధికారులను కోల్పోవడం ఎంతో బాధాకరమంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్, ఆయన సతీమణితోపాటు 13 మంది మరణించడం అత్యంత దురదృష్టకరమైన ఘటనగా రాజ్‌నాథ్ తన ట్విటర్ సందేశంలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా జనరల్ రావత్, ఆయన భార్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి ప్రకటించారు.

అంతకుముందు, హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది ప్రయాణికుల్లో 13మంది చనిపోయారని, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని కలెక్టర్ చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

అటు ఏఎన్ఐ వార్తా సంస్థ కూడా విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇదే విషయం పేర్కొంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా డెడ్‌బాడీలను గుర్తిస్తారని చెప్పింది.

అంతకుముందు ఏం జరిగింది?

హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయాన్ని భారత వాయుసేన ఖరారు చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణిస్తున్న వారిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నారని తెలిపింది.

ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించామని పేర్కొంది.

హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్లు, గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. వారిలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్‌లు ఉన్నారని ట్వీట్ చేసింది.

హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14మందిలో ఐదుగురు చనిపోయారని తమిళనాడు అటవీ శాఖా మంత్రి రామచంద్రన్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ట్వీట్ చేసింది.

హెలికాప్టర్ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటుకు వివరణ ఇవ్వనున్నారు.

ప్రమాదంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైందని విని షాక్ అయ్యానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించారు.

హెలికాప్టర్‌లో ఉన్న వారందరి భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్విటర్‌లో రాశారు.

"హెలికాప్టర్‌లో ఉన్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని రాహుల్ గాంధీ అన్నారు.

"చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో సహా మరో 13 మంది ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులో కూలిపోయిందని తెలిసి షాక్‌కు గురయ్యాను. విమానంలో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నాను" అని నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

జనరల్ బిపిన్ రావత్ ఎవరు?

జనరల్ బిపిన్ రావత్ 2020 జనవరిలో దేశానికి తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ (సీడీఎస్)గా నియమితులయ్యారు.

జనరల్ బిపిన్ రావత్ భారత సైన్యంలోని ఫోర్ స్టార్ జనరల్.

ఆయన సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాలలో, తరువాత కటక్‌లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు.

1978 డిసెంబర్‌లో డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లోని పదకొండవ గూర్ఖా రైఫిల్స్ విభాగంలో ఐదవ రెజిమెంట్‌లో చేరారు.

డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లో ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో సహా శిక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. సెంట్రల్ రీజియన్‌లో లాజిస్టిక్స్ డివిజన్ అధికారిగా పనిచేశారు.

ఆర్మీ సెక్రటరీ విభాగంలో అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, సెక్రటరీ ఆఫ్ ఆర్మీగా కల్నల్ హోదాలో పనిచేశారు.

వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన జనరల్ బిపిన్ రావత్ నేషనల్ డిఫెన్స్ కాలేజీ నుంచి వివిధ విభాగాల్లో పట్టభద్రుడయ్యారు.

చెన్నై యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ పట్టా పొందారు. మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు.

అమెరికాలోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లో సైనిక కమాండర్లకు ఇచ్చిన శిక్షణా తరగతులు హాజరయ్యారు.

2016 డిసెంబర్‌లో కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)