హుజూరాబాద్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేసింది.

టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ పేరును తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించినట్లు ఆ పార్టీ వెల్లడించింది.

పార్టీ పట్ల శ్రీనివాస్ నిబద్దతను గుర్తించిన కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎవరు?

గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు.

ఆయన కరీంనగర్ జిల్లా హిమ్మత్ నగర్ గ్రామంలో 1983లో జన్మించారు.

తండ్రి గెల్లు మల్లయ్య మండల స్థాయిలో 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2004లో టీఆర్ఎస్‌లో చేరారు. పలు పదవులను చేపట్టారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి హిమ్మత్‌నగర్ గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు.

డిగ్రీ చదివే రోజుల్లో విద్యార్థి నాయకుడిగా

హైదరాబాద్‌లో డిగ్రీ చదివే రోజుల్లోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు.

2017 నుంచి టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు.

ఉస్మానియా యూనివర్సిటి నుంచి తెలంగాణ విద్యార్థి మహాపాదయాత్రలో పాల్గొన్నారు.

మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారంలలో చురుకైన పాత్ర పోషించారు.

తెలంగాణ ఉద్యమంలో వందకు పైగా కేసులు నమోదయ్యాయి.

చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లలో 36రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు.

మరోవైపు, హుజూరాబాద్ అభ్యర్థిగా బీసీలకు అవకాశం ఇచ్చినందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతిస్తామని బీసీ సంఘాలు మీడియా సమావేశంలో చెప్పాయి.

ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక

ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది.

ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు.

ఆ తర్వాత ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు ఈటల.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)