బాబ్రీ మసీదు కూల్చివేత: ఎప్పుడు ఏం జరిగింది? మసీదు కూల్చివేతకు కుట్రలో ఆరోపణలు ఎదుర్కొంటోంది ఎవరు?

    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

1992, డిసంబర్ 6న అయోధ్యలో 16వ శతాబ్దపు కట్టడమైన బాబ్రీ మసీదును ఒక కరసేవకుల గుంపు కూల్చివేసింది. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలకు ఈ సంఘటన దారి తీసింది. హింస చెలరేగింది. అందులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

మసీదుని తిరిగి పునరుద్ధరిస్తామని అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహరావు ప్రకటించారు.

ఈ ఘటనపై దర్యాపు చేయడానికి డిసెంబర్ 16న ఎంఎస్ లిబర్హాన్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ విచారణ కమిషన్ 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం 2009లో తమ నివేదికను సమర్పించింది.

అయినా, ఇప్పటివరకూ బాబ్రీ మసీదు కూల్చివేతపై కోర్టు తీర్పు వెలువడలేదు.

కానీ ఆ స్థలంలో రామ మందిరం నిర్మించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఆలయ నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.

1992కు ముందే ధ్వంసం...

1992 డిసంబర్ 6కు చాలా రోజుల ముందే ఈ వివాదాస్పద స్థలాన్ని స్వల్పంగా ధ్వంసం చేసి తాత్కాలిక రామ మందిరాన్ని ఏర్పాటు చేశారు.

అయితే, డిసంబర్ 6న మసీదును పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై అదే రోజు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

దోపిడీ, గాయ పరచడం, ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలతో కర సేవకులపై మొదటి ఎఫ్ఐఆర్ నంబర్ 197/1992 దాఖలు చేశారు.

విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ బీజేపీ నేత ఎల్‌కే అడ్వాణీ, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రధాన కార్యదర్శి అశోక్ సింఘాల్, బజరంగ్ దళ్ నాయకుడు వినయ్ కతియార్, ఉమా భారతి, సాధ్వీ రితంభర, మురళీ మనోహర్ జోషి, గిరిరాజ్ కిశోర్, విష్ణు హరి దాల్మియాలపై రెండో ఎఫ్ఐఆర్ 198/1992 నమోదైంది.

మొదటి ఎఫ్ఐఆర్‌లో నమోదైన కేసును సీబీఐకు అప్పగించగా.. రెండో ఎఫ్ఐఆర్‌లో నమోదైన కేసును ఉత్తర ప్రదేశ్ సీఐడీకి అప్పగించారు.

ప్రత్యేక కోర్టుకు

కరసేవకుల మీద వేసిన కేసు సంఖ్య 197ను విచారించడానికి లలిత్‌పూర్‌లో ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటుచేశారు. రెండో ఎఫ్ఐఆర్ సంఖ్య 198ను రాయ్‌బరేలీ లోని ఒక ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు.

ఇదిలా ఉండగా, వివాదాస్పద స్థలంలోని 67 ఎకరాల భూమిని రామ్‌లాలా రక్షణ పేరిట అప్పటి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ఆర్డినెన్స్‌ను 1993 జనవరిలో పార్లమెంట్ ఆమోదంతో చట్టంగా మార్చారు.

బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు కోసం డిసంబర్ 16న ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్‌కు తమ నివేదిక సమర్పించేందుకుగానూ మూడు నెలల గడువు విధించారు. అయితే ఈ గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే వచ్చారు. 17 సంవత్సరాల కాలంలో 48 సార్లు ఈ గడువును పొడిగించారు. ఎట్టకేలకు 2009 జూన్‌లో ఈ విచారణ కమిషన్ తన దర్యాప్తు నివేదికను హోం మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ 17 యేళ్లల్లో కమిషన్ దర్యాప్తుపై రూ. 8 కోట్లు వెచ్చించారు.

మసీదు కూల్చివేత వెనక పెద్ద కుట్రే ఉందని, ఇందులో పాల్గొన్నవారిపై విచారణ జరిపించాలని లిబర్హాన్ కమిషన్ తమ నివేదికలో పేర్కొంది.

మరో 47 కేసులు కూడా..

ఈ వివాదంపై మసీదు కూల్చివేసిన రోజు నమోదైన రెండు ముఖ్యమైన కేసులతోపాటూ మరో 47 కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో విలేకరులపై దాడి, దోపిడీ మొదలైన ఆరోపణలున్నాయి. తరువాత ఈ కేసులన్నిటినీ సీబీఐకు అప్పగించారు.

అనంతరం అలహాబాద్ హైకోర్టు సూచన మేరకు లఖ్‌నవూలో అయోధ్య కేసుల విచారణ కోసం ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. కానీ ఆ నోటిఫికేషన్‌లో రెండో కేసు సంఖ్య 198ను జత చేయలేదు. ఈ కేసు విచారణ రాయ్‌బరేలీలోనే జరుగుతూ వచ్చింది. అయితే, మొదటి కేసు సంఖ్య 197ను సెక్షన్ 120 బీ కింద క్రిమినల్ కేసుగా మార్చారు.

తరువాత, 1993 అక్టోబర్ 5న రెండో కేసు 198ని కూడా జత చేస్తూ సీబీఐ ఉమ్మడి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో బాల్ ఠాక్రే, కల్యాణ్ సింగ్, చంపత్ రాయ్, ధరందాస్, మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో సహా మరి కొందరి పేర్లు జత చేసింది.

1993 అక్టోబర్ 8న యూపీ ప్రభుత్వం, కేసుల బదిలీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రెండో కేసు 198తో సహా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసులన్నీ లఖ్‌నవూ ప్రత్యేక కోర్టులోనే విచారణకు వస్తాయని తేలింది.

నేరపూరిత కుట్ర అభియోగాలు

1996లో లఖ్‌నవూ కోర్టు, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులన్నిటినీ నేరపూరిత కుట్ర (క్రిమినల్ కేసు) విభాగంలో చేర్చాలని ఆదేశించింది. ఈ కేసుల విషయంలో సీబీఐ దాఖలు చేసిన ఒక అనుబంధ చార్జ్‌షీట్‌ ఆధారంగా ఎల్‌కే అడ్వాణీతో సహా నిందితులందరిపై నేరపూరిత కుట్ర కేసును దాఖలు చేసేందుకు వీలుగా సాక్ష్యాలు ఉన్నాయంటూ లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు ఈ నిర్ణయానికొచ్చింది.

ఈ కేసులన్నీ ఒకే ఘటనకు సంబంధించినవి కాబట్టి ఉమ్మడి విచారణ చేపట్టాలని లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. అయితే అడ్వాణీతో సహా పలువురు నిందితులు ఈ ఉత్తర్వును హైకోర్టులో సవాలు చేశారు.

2001 ఫిబ్రవరి 12న ఉమ్మడి చార్జ్‌షీట్‌కు హైకోర్టు అంగీకరించింది. కానీ రెండో కేసు 198ని లఖ్‌నవూ ప్రత్యేక కోర్టు నోటిఫికేషన్లో చేర్చలేదు కాబట్టి ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది నిందితులపై విచారణ చేయడానికి లఖ్‌నవూ ప్రత్యేక కోర్టుకు అనుమతి లేదని కూడా తెలిపింది. దీంతో అడ్వాణీతో సహా 8 మందిపై వేసిన రెండో క్రిమినల్ కేసు సాంకేతికపరమైన చిక్కుల్లో పడింది.

మరోవైపు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా పరమైన లోపాల వల్ల నిందితులపై తప్పుడు అభియోగాలు మోపారని నిందితుల తరఫు లాయర్ వాదించారు.

ఈ సాంకేతిక కారణాలను అడ్డు పెట్టుకుని ఎల్‌కే అడ్వాణీ తదితరులు తమపై ఉన్న క్రిమినల్ కేసును తొలగించుకునే ప్రయత్నాలు చేశారు.

రెండో కేసులో 8 మంది నిందితులపై నేరపూరిత కుట్ర కేసుకు సంబంధించిన సాక్ష్యాలను జత చేస్తూ రాయ్‌బరేలీ కోర్టులో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు, సీబీఐని ఆదేశించింది.

సీబీఐ చార్జ్‌షీట్

2003లో కేసు సంఖ్య 198లో 8 మంది నిందితులపై సీబీఐ అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కానీ కేసు సంఖ్య 198ను నేరపూరిత కుట్ర విభాగంలో జోడించలేకపోయింది ఎందుకంటే మొదట్లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కేసు నంబర్ 197ను నేరపూరిత కుట్ర విభాగంలోనూ, 198ని రెచ్చగొట్టే ప్రసంగాలుగానూ వేరు వేరుగా ఎఫైఆర్ నమోదు చేశారు కాబట్టి.

ఈలోగా, రాయ్‌బరేలీ కోర్టు.. అడ్వాణీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి, ఆయనపై ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని తెలుపుతూ ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.

అయితే, 2005లో అలహాబాద్ హైకోర్టు, రాయ్‌బరేలీ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అడ్వాణీ తదితరులపై కేసులు కొనసాగుతాయని చెప్పింది. అయితే అప్పటికి కూడా కేసు సంఖ్య 198ని నేరపూరిత కుట్రగా గుర్తించలేదు.

2005లో రాయ్‌బరేలీ కోర్టు ఈ కేసును మళ్లీ స్వీకరించింది. 2007లో ఈ కేసు మొదటి విచారణ జరిగింది.

వారే బాధ్యులంటూ నివేదిక

తరవాత రెండు సంవత్సరాలకు 2009లో లిబర్హాన్ కమిషన్ బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తు నివేదికను సమర్పించింది. సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీకి చెందిన నాయకులు బాబ్రీ కూల్చివేతకు దారితీసిన సంఘటనలకు బాధ్యులని ఈ నివేదికలో పేర్కొన్నారు.

2010లో ఈ రెండు కేసులను వేరు చేయాలని, కేసు సంఖ్య 198ని క్రిమినల్ కేసుగా చూడకూడదని వేసిన రివిజన్ పిటీషన్‌ను అలహాబాద్ హై కోర్టు తిరస్కరించింది.

అయోధ్య వివాదంలో సెప్టంబర్ 24న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. తరువాత తీర్పును ఆపాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.

2010లో చారిత్రక తీర్పు

2010 సెప్టెంబర్ 30న అయోధ్య వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్ట్ చారిత్రక తీర్పు ఇచ్చింది.

2011లో సుప్రీంకోర్టు.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

2012లో రెండు కేసులపై ఉమ్మడి విచారణ జరపాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

2015లో కేసు సంఖ్య 198ని క్రిమినల్ కేసుగా చూడాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌పై స్పందించాలని కోరుతూ ఎల్‌కే అడ్వాణీ, ఉమా భారతి, మురళి మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌తో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నాయకులందరికీ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

2017లో సుప్రీం కోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఆరోపణలను పునరుద్ధరించింది. రెండు కేసుల విచారణలూ ఒకేసారి జరపాలంటూ తీర్పునిచ్చింది. ఈ గందరగోళానికి ముగింపు పలికేందుకు అడ్వాణీతో సహా 20 మంది నిందితులపై మళ్లీ క్రిమినల్ కేసు వేయమని ఆదేశాలు జారీ చేసింది.

30న తుది తీర్పు

సుప్రీం కోర్టు ఆదేశాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది...రెండేళ్లలోపు బాబ్రీ మసీదు కేసులో విచారణ పూర్తి చేయాలని గడువు విధించడం.

గత ఏడాది ఏప్రిల్‌లో ఈ గడువు ముగిసింది. అయితే గడువును మరో 9 నెలలకు పొడిగించారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఈ గడువును మరింత పొడిగించారు. రోజూ విచారణ జరుపుతూ ఆగస్ట్ 31లోగా విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మళ్లీ మరో నెల రోజులు వ్యవధి ఇస్తూ సెప్టెంబర్ 30న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులపై తీర్పును వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పు రోజున నిందితులందరూ హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులందరూ నిర్దోషులని సెప్టెంబర్ 30న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)