ముంబయిలో అంబేడ్కర్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

ముంబయిలో డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ నివాసం రాజగృహపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

దాడి సందర్భంగా అక్కడున్న సీసీ కెమెరాలను కూడా దుండగులు ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు.

ఈ విధ్వంసానికి సంబంధించి ఏఎన్‌ఐ వార్తా సంస్థ కొన్ని ఫోటోలను ట్వీట్‌ చేసింది.

ఇంటి ముందున్న పూల మొక్కలను, కుండీలను ధ్వంసం చేసినట్లు అందులో కనిపిస్తోంది.

దాడి విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ఈ సంఘటనను మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

డాక్టర్‌ అంబేడ్కర్ నివాసం 'రాజ్‌గృహ'పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరో ఇద్దరు మంత్రులు జయంత్ పాటిల్, ధనంజయ్ ముండే కూడా ఈ సంఘటనను ఖండించారు.

ప్రజలు ఆవేశానికి లోను కావద్దని డాక్టర్ అంబేద్కర్ మనవడు వంచిత్‌ బహుజన్ అగాధీ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేడ్కర్ విజ్ఞప్తి చేశారు.

"ప్రజలు రాజగృహకు రావద్ద"ని ఆయన సూచించారు. దీన్ని 'చిన్న సంఘటన'గా తీసుకోవాలని, ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగం కూడా శాంతిని కోరుకుంటుందని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)