''లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేదు.. ఇంట్లో తిండి లేదు.. అందుకే దొంగతనం చేశా''

ఒక ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించిన వ్యక్తికి పట్టుకున్న పోలీసులు.. అతడి కుటుంబానికి సరుకులు ఇప్పించిన సంఘటన ఇది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విష్ణు విహార్ కాలనీలోని ఒక ఇంట్లో దొంగతనంగా ప్రవేశించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎందుకు దొంగతనానికి పాల్పడ్డావని పోలీసులు అడిగితే.. ''లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేదు.. ఇంట్లో తిండి లేదు.. అందుకే దొంగతనం చేశా'' అని చెప్పినట్లు ఇండోర్ ఏరోడ్రోమ్ సబ్ ఇన్‌స్పెక్టర్ కల్పనా చౌహాన్ తెలిపారు.

అతడు నిజమే చెప్తున్నాడని పోలీసులు దర్యాప్తులో నిర్ధారించుకున్నట్లు ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది.

దీంతో అతడి కుటుంబానికి అవసరమైన సరుకులను పోలీసులే అందించినట్లు కల్పనా చౌహాన్ తెలిపారు.

కరోనావైరస్‌ను నియంత్రించటానికి రెండు నెలలకు పైగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు, కూలీలు తీవ్ర కష్టాలు పడుతున్న వార్తలు ప్రతి రోజూ వెలుగు చూస్తున్నాయి.

ప్రభుత్వం గత నెల రోజులుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా కూడా లక్షలాది మంది కార్మికులు వందలాది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తుండటం ఆగలేదు.

అనేక చోట్ల ఆకలితో, అలసటతతో కూలీలు చనిపోతున్న వార్తలూ కలచివేస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా వలస కూలీల కష్టాలను తీర్చటానికి ఎటువంటి చర్యలు చేపట్టారని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది.

అందరికీ వసతి, ఆహారం, కనీస సదుపాయాలు కల్పించి తీరాలని నిర్దేశించింది.

గుజరాత్, బిహార్, కేంద్ర ప్రభుత్వాలకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు

ఇదిలావుంటే.. ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులు తిండి, నీరు, కనీస సదుపాయాలు లేక అనారోగ్యం పాలవటం, చనిపోవటం జరుగుతోందన్న మీడియా వార్తలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. గుజరాత్, బిహార్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రైల్వే బోర్డు చైర్మన్‌లకు నోటీసులు జారీచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)