కరోనావైరస్‌: వెల్లుల్లి తింటే నయమైపోతుందా.. వేడిలో బతకలేదా

    • రచయిత, రియాలిటీ చెక్ బృందం
    • హోదా, బీబీసీ న్యూస్

కరోనావైరస్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి చికిత్స లేని రోగం ఇది. అయినప్పటికీ చికిత్సపై ఆన్‌లైన్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారమైన కొన్ని చికిత్సల విషయంలో సైన్స్ ఏం చెబుతోంది..? ఇప్పుడు చూద్దాం.

1.'వెల్లుల్లి'

వెల్లుల్లి ఇన్ఫెక్షన్ల విషయంలో అమోఘంగా పని చేస్తుంది... ఇది ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో తెగ ప్రచారమవుతున్న విషయం.

మరి ఈ ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) ఏం చెబుతోంది?

" నిజానికి వెల్లుల్లిలో బ్యాక్టీరియాను అరికట్టే కొన్ని లక్షణాలున్నాయి. అంత మాత్రాన వెల్లుల్లి కరోనావైరస్‌ నుంచి రక్షిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు."

రోగ నిర్ధారణ విషయంలో వైద్యల సలహాలను పెడచెవిన పెట్టనంత వరకు ఇలాంటి ప్రత్యామ్నాయాల వల్ల పెద్దగా ఎలాంటి హాని ఉండదు.

అయితే కొన్ని సార్లు అవి కూడా జరుగుతుంటాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ఓ మహిళ ఏకంగా కేజీన్నర వెల్లుల్లిని తినడంతో గొంతు ఇన్ఫెక్షన్‌కు గురై ఆస్పత్రిలో చేరారు. సాధారణంగా కూరగాయలు, పళ్లు, మంచి నీళ్లు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే... ఇప్పటి వరకు ఫలానా ఆహారం .. ఫలానా వైరస్‌ను అడ్డుకుంటుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

2.'మిరాకిల్ మినరల్స్'

ప్రముఖ యూట్యూబర్ జోర్డన్ సథెర్ క్లోరిన్ డయాక్సైడ్‌తో కూడిన మిరాకిల్ మినరల్ సప్లిమెంట్లు కరోనావైరస్‌ను తుడిచిపెట్టయగలవంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు.

నిజానికి క్లోరిన్ డయాక్సైడ్ ఓ బ్లీచింగ్ ఏజెంట్. కరోనావైరస్ బయట పడక ముందు కూడా సథెర్ సహా మరి కొంత మంది ఈ మిరాకిల్ మినరల్ సప్లిమెంట్స్ గురించి ప్రచారం చేస్తూ వచ్చారు.

ఈ జనవరిలో ఆయన ఈ సప్లిమెంట్స్ కేవలం క్యాన్సర్ వ్యాధిపైనా కాదు.. కరోనావైరస్‌ను కూడా తుడిచిపెట్టేస్తుందంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు .

అయితే గత ఏడాదే ఈ మిరాకిల్ మినరల్ సప్లిమెంట్‌ను సేవించడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం అంటూ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) హెచ్చరించింది.

ఈ సప్లిమెంట్ సురక్షితం అని కానీ, దానికి వ్యాధుల్ని నిర్మూలించే శక్తి ఉందని కానీ ఇప్పటి వరకు ఎటువంటి పరిశోధన స్పష్టం చేయలేదని తేల్చి చెప్పింది.

అంతే కాదు ఈ డ్రింక్‌ను తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, డయేరియా, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది.

3. 'ఇంట్లోతయారు చేసే హ్యాండ్ శానిటైజర్'

కరోనావైరస్‌ నుంచి రక్షించుకోవడంలో శానిటైజర్లు సాయపడతాయన్నది వైద్యుల మాట. ఈ పరిస్థితుల్లో కోవిడ్ -19 బారిన పడ్డ దేశాల్లో శానిటైజర్లకు కొరత ఏర్పడిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇటలీలో ఈ పరిస్థితి ఉండటంతో అక్కడ ఇంట్లోనే శానిటైజర్ జెల్ తయారు చేసుకునేందుకు అవసరమయ్యే మూలకాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే అక్కడ ప్రచారంలో ఉన్న ఆ జెల్ మూలకాలన్నీఆ దేశంలో ప్రముఖ బ్రాండ్లకు చెందిన శానిటైజర్లలో ఉపయోగించే మూలకాల నకళ్లని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి కేవలం నేలను శుభ్రం చెయ్యడానికి మాత్రమే పని కొస్తాయి తప్ప చర్మానికి సరిపడవని స్పష్టం చేస్తున్నారు.

సాధారణంగా ఆల్కాహాల్‌తో కూడిన జెల్స్‌లో మృదుత్వాన్ని కల్గించే లేపనాలు కూడా ఉంటాయి. అందువల్ల చర్మంపై ఎలాంటి ప్రభావం పడదు. నిజానికి శానిటైజర్ జెల్స్‌లో 60-70 శాతం ఆల్కాహాల్‌ ఉంటుంది.

ఇంట్లోనే ప్రభావవంతమైన శానిటైజర్ తయారు చేసుకోవచ్చనడం పెద్ద బూటకం అంటారు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ సెలి బ్లూమ్ ఫీల్డ్. చివరకు వోడ్కాతో శానిటైజర్ చేసినా అందులో కేవలం 40 శాతం మాత్రమే ఆల్కహాల్ ఉంటుందని వివరించారు.

4. 'వెండి రేణువులతో కూడిన ద్రావణం'

వెండి రేణువులతో కూడిన ద్రావకాన్ని తీసుకోవడం ద్వారా కరోనావైరస్‌ను తరిమికొట్టవచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది.

ఇటీవల అమెరికాలోని ప్రముఖ టెలివాంజలిస్ట్(టీవీల్లో మత ప్రబోధం చేసే వ్యక్తి) జిమ్ బెకర్ టెలివిజన్‌ షోలో పాల్గొన్న ఓ వ్యక్తి ఈ ద్రావకాన్ని తీసుకుంటే 12 గంటల్లో కరోనావైరస్ మాయమవుతుందని చెప్పుకొచ్చారు.

ఇది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది. అయితే వెండి రేణువులతో కూడిన ద్రావణం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

అంతే కాదు ఆ ద్రావణాన్ని తీసుకోవడం వల్ల మూత్ర పిండాలు విఫలం కావడం, అర్జీరియా(చర్మం నీలంగా మారిపోవడం)వంటి తీవ్ర విపరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

5. ప్రతి పావుగంటకు మంచి నీళ్లు తాగితే మంచిదేనా?

ప్రతి పావుగంటకు ఓసారి నీళ్లు తాగితే ఎలాంటి వైరస్‌నైనా తరిమికొట్టవచ్చా.. ? అవునంటోంది ఇప్పుడు సోషల్ మీడియాలోని ఒక పోస్ట్. ఓ జపాన్ డాక్టర్ చెప్పారని కూడా చెప్పుకొస్తోంది.

అయితే ఇదో అబద్దపు ప్రచారం అంటున్నారు ప్రొఫెసర్ బ్లూమ్ ఫీల్డ్. నీళ్లు తాగడం వల్ల వైరస్ ‌ముప్పు ఉండదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

గాలి ద్వారా వ్యాపించే వైరస్ నోటి ద్వారానే మన శరీరంలోకి ప్రవేశించాలని లేదు . శ్వాస పీల్చుకునే సమయంలో కూడా లోపలికి వెళ్లవచ్చు.

అందువల్ల అదే పనిగా నీళ్లు తాగినంత మాత్రాన వైరస్ ముప్పు లేకుండా తప్పించుకోవచ్చన్న వాదనలో ఎలాంటి పస లేదు. అయితే మంచినీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ ముప్పు లేకుండా ఉంటుందని వైద్యులు చెబుతారు.

6. వేడి వైరస్‌ను చంపేస్తుందా..? ఐస్ క్రీంకి దూరంగా ఉండాల్సిందేనా?

వేడి వైరస్‌ను చంపేస్తుందని చాలా మంది చెబుతుంటారు. అందుకే వేడినీళ్లు తాగమని, వేడి నీళ్లతో స్నానం చెయ్యమని, ఎండలో నిల్చోమని సలహాలిస్తుంటారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యూనిసెఫ్ పేరిట కూడా ఇదే ప్రచారం సాగుతోంది. చల్లని పదార్ధాలకు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని ఆ సంస్థ సూచించిదంటూ పోస్టులు పెడుతున్నారు.

అయితే ఇది పూర్తిగా అవాస్తవమని చెప్పారు యూనిసెఫ్ తరపున కరోనావైరస్ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారంపై పని చేస్తున్న షర్లెటీ గొరెంట్జికా. వేసవిలో వైరస్ బయట బతకలేదన్న విషయం మాకు తెలుసు. కానీ కరోనావైరస్ విషయంలో వేడి ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న విషయంలో ఇంత వరకు మాకు ఎలాంటి స్పష్టత లేదని ఆమె తేల్చిచెప్పారు.

ఎండలో నిలబడటం, వేడి నీళ్లు తాగడం ద్వారా చాలా వరకు ప్రభావం పడకుండా చూసుకోవచ్చని ప్రొఫెసర్ బ్లూమ్ ఫీల్డ్ చెప్పారు.

కానీ ఒకసారి శరీరంలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత ఏం చెయ్యలేమని మన శరీరం ఆ వైరస్‌తో పోరాడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

శరీరం బయట వైరస్ చనిపోవాలంటే కనీసం 60 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలని బ్లూమ్ ఫీల్డ్ అన్నారు.

అయితే 60 డిగ్రీల వేడిలో టవల్స్‌ను, బెడ్ షీట్స్‌ను ఉతకడం మంచి ఆలోచనే కానీ అంత వేడితో ఉన్న నీళ్లతో స్నానం చెయ్యడం చర్మానికి ఎంత మాత్రం మంచిది కాదని చెప్పుకొచ్చారు.

ఒక వేళ మీరు జబ్బు పడితే తప్ప వేడి నీళ్లతో స్నానం చెయ్యడం వల్ల కానీ, తాగడం వల్ల కానీ శరీర ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు రాదని బ్లూమ్ ఫీల్డ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)