కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప నాలుగోసారి ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, Twitter
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ వాజుభాయి వాలా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.
మూడుసార్లు మధ్యలోనే పదవికోల్పోయారు
యడియూరప్ప తొలిసారి 2007 నవంబరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అప్పుడు ఆయనకు మద్దతిస్తామని చెప్పిన జేడీఎస్ మనసు మార్చుకోవడంతో నాలుగు రోజులకే ఆయన పదవి కోల్పోయారు.
ఆ తరువాత ఏడాది 2008లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడేళ్ల పాలన తరువాత అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీ ఒత్తిడితో పదవికి రాజీనామా చేశారు.
2018 ఎన్నికల్లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన బలం నిరూపించుకోలేక రెండు రోజులకే రాజీనామా చేశారు.
అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీఎస్ నేత కుమారస్వామి 14 నెలల పాలన తరువాత ఎమ్మెల్యేల రాజీనామాతో బలం కోల్పోయి పదవి పోగొట్టుకోవడంతో ఇప్పుడు యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఫొటో సోర్స్, BJP Karnataka
‘మాదే అతిపెద్ద పార్టీ’
ఈ రోజు ఉదయం గుడికి వెళ్లి దర్శనం చేసుకున్న ఆయన ప్రభుత్వ ఏర్పాటు కోసం రాజ్భవన్కు వెళుతున్నట్లు ప్రకటించారు.
''మా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకు ప్రభుత్వ ఏర్పాటు కోసం కర్ణాటక గవర్నర్ను కలిశాను'' అని యడియూరప్ప ట్వీట్ చేశారు.
''ప్రతిపక్షనేతగా నేనే ఉన్నందువల్ల పార్టీ శాసనసభ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Twitter
గవర్నర్ వాజూభాయి వాలాకు రాసిన లేఖలో ''బీజేపీకి 105 సభ్యుల బలం ఉంది. శాసన సభలో మాదే ఏకైక అతిపెద్ద పార్టీ'' అని పేర్కొన్నారు.
''నేటి ఆ పార్టీ స్థానం దృష్ట్యా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదు'' అని కాంగ్రెస్ పార్టీ ట్వీటర్లో పేర్కొంది.
బీజేపీకి ప్రస్తుతం 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉంది. దీంతో శాసన సభలో వారి బలం 106కు చేరింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో వారి బలం ప్రస్తుతం 76కు తగ్గింది.
జేడీఎస్కు 37 మంది సభ్యులు ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు మూలంగా శాసనసభ సభ్యుల సంఖ్య 224 నుంచి 221కి తగ్గింది.
76 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 13 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జేడీఎస్కు ఉన్న 37 మంది సభ్యుల్లో రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే శ్రీమంత్ పటేల్, బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్. మహేశ్ వారి పదవులకు రాజీనామా చేయనప్పటికీ విశ్వాస పరీక్ష సమయంలో సభకు గైర్హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
పేరు వెల్లడించడానికి ఇష్టపడిని ఓ సీనియర్ రాజకీయనాయకుడు ప్రస్తుత పరిస్థితి గురించి బీబీసీతో మాట్లాడుతూ, ''మా జాతీయ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. మేం కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాం. ఇప్పుడు మేం ప్రభుత్వాన్ని ఏర్పరచకపోతే పరిస్థితి బాగుండదు. రెబెల్ ఎమ్మెల్యేలలో బాధను మేం గమనించాం'' అని పేర్కొన్నారు.
బీజేపీ చేపట్టిన 'ఆపరేషన్ కమల'లో కీలకసూత్రధారులని భావించి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు రమేశ్ జర్కోహ్లీ, మహేశ్ కుమతహల్లీలపై స్పీకర్ రమేశ్ అనర్హతవేటు వేశారు.
రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు ఉపసంహరించుకోడానికి సమయం ఇస్తారా అని స్పీకర్ను మీడియా ప్రశ్నించిన్నప్పుడు ''మీరు ఎందుకు, ఎవరి లబ్ధి కోసం ఈ ప్రశ్నలు వేస్తున్నారో నాకు తెలుసు. నా వరకు ఇది ఊహాజనితమైన ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి సమాధానం చెప్పను'' అని ఆయన పేర్కొన్నారు.
దర్వాడ్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హరీశ్ రామస్వామి కర్ణాటక సంక్షోభంపై బీబీసీతో మాట్లాడుతూ, ''సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కోరిక ఇప్పుడు కాంగ్రెస్కు లేదు'' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- గగన్యాన్: ముగ్గురు భారతీయులు, ఏడు రోజులు, రూ.10 వేల కోట్ల వ్యయం
- 30 ఏళ్లుగా ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను: రాకేశ్ శర్మ
- న్యూయార్క్ ఆకాశంలో వింత కాంతి.. ‘ఏలియన్స్ రాకకు సంకేతమా?’
- నాసా: అంతరిక్ష కేంద్రంలో హాలిడే.. పర్యాటకులకు అనుమతి.. ఒక రాత్రికి అద్దె రూ. 24 లక్షలు
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- బిహార్ వరదల్లో మునగడానికి భారత్, నేపాల్ మధ్య గొడవలే కారణమా?
- తల్లితండ్రులకు చెప్పకుండా కారుతో ఉడాయించిన పిల్లలు...
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- హైటెక్ వ్యవసాయం... వందేళ్లలో ఎంత మారింది?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








