యోగి ఆదిత్యనాథ్‌పై ‘అభ్యంతరకరమైన’ ట్వీట్.. జర్నలిస్ట్, ఎడిటర్ అరెస్ట్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో ‘అభ్యంతరకరమైన వ్యాఖ్య’ చేసినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక విలేకరిని అరెస్ట్ చేశారు.

అరెస్టైన జర్నలిస్ట్ పేరు ప్రశాంత్ కనౌజియా. దిల్లీలో ఉన్న ప్రశాంత్‌ను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు లక్నో తీసుకెళ్లారు.

‘‘ఆయన ట్విటర్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. అందులో ఒక మహిళ తాను యోగి ఆదిత్యనాథ్‌ ప్రియురాలినని చెబుతోంది’’ అని ప్రశాంత్ భార్య జగీషా అరోరా బీబీసీకి తెలిపారు.

ఈ వీడియోతో పాటు ప్రశాంత్.. యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు.

ఈ వ్యవహారంలో ప్రశాంత్‌పై లఖ్‌నవూలోని హజర్‌తగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం సెక్షన్ 66, ఐపీసీ సెక్షన్ 500ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

అరెస్ట్ వ్యవహారంపై సమాజ్‌వాది పార్టీ స్పందించింది. ‘‘చట్టాన్ని రక్షించడంలో విఫలమైన ప్రభుత్వం విలేకరులపై తన ప్రతాపం చూపిస్తోంది’’ అని ట్వీట్ చేసింది.

కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో ‘అభ్యంతరకరమైన వ్యాఖ్య’ చేసినందుకు ఒక టీవీ న్యూస్ చానెల్ హెడ్, ఎడిటర్‌ను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ట్వీట్ కూడా చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)