అయోధ్య కేసులో ముగ్గురు సభ్యులతో మధ్యవర్తుల కమిటీని నియమించిన సుప్రీం కోర్టు... 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

ఫొటో సోర్స్, Getty Images/BBC
భారత సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం అయోధ్య కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం పరిష్కారం కోసం ముగ్గురు మధ్యవర్తులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మధ్యవర్తిత్వ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ గొగోయ్తో పాటు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లు ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
మధ్యవర్తుల కార్యకలాపాలపై మీడియా రిపోర్ట్ చేయడానికి వీలు లేదని కూడా ప్రకటించింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మొహమ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా (రిటైర్డ్) నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో మధ్యవర్తిత్వ కమిటీని నియమించింది.
ఈ కమిటీలో శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచూలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ కోరుకుంటే మరికొంత మంది సభ్యులను కూడా చేర్చవచ్చని కోర్టు తెలిపింది.
ఈ మధ్వవర్తుల కమిటీ ఫైజాబాద్ నుంచి పని చేస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది.
ముఖ్యంగా, మధ్వర్తిత్వ ప్రక్రియను ఈ కమిటీ ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, మొదటి నాలుగు వారాల తరువాత ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రగతి నివేదికను సమర్పించాలని ధర్మాసనం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
అయోధ్య కేసులో ఇంతకుముందు ఏం జరిగింది?
అయోధ్యలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూ వివాదాన్ని ''శాశ్వత పరిష్కారం కోసం'' మధ్యవర్తికి అప్పగించడంపై తీర్పు ప్రకటనను సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు వేసింది.
''ఇది భూ వివాదం మాత్రమే కాదు. మత విశ్వాసాలు, ఉద్వేగాలకు సంబంధించినది. ఎవరు కూల్చారన్నది ఇప్పుడు అప్రస్తుతం. ప్రస్తుత వివాదాన్ని పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలని చూస్తాం. ఒకరి కంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరం అనుకుంటున్నాం'' అని ధర్మాసనంలోని జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు.
''ఒకవేళ సమస్యను మధ్యవర్తికి అప్పగించేలా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే రెండు పక్షాలు మధ్యవర్తుల పేర్లను సూచించాలి’’ అని ధర్మసనానికి సారథ్యం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నిర్దేశించారు.
అఖిల భారతీయ హిందూ మహాసభ ప్రతిపాదించిన మధ్యవర్తులు
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన దీపక్ మిశ్రా, జగదీశ్ సింగ్ ఖెహర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఏకే పట్నాయక్
నిర్మోహి అఖాడా ప్రతిపాదించిన మధ్యవర్తులు
- సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన కురియన్ జోసెఫ్, ఏకే పట్నాయక్, జీఎస్ సింఘ్వి
విచారణ సందర్భంగా- ''మేం కూడా చరిత్ర చదివాం. గతం మీద మా నియంత్రణ లేదు. ప్రస్తుతం గురించి మాత్రమే మేం ఏమైనా చేయగలం'' అని జస్టిస్ బాబ్డే చెప్పారు. అయోధ్య అంశాన్ని హిందువులు మనోభావాలకు సంబంధించినదిగా పరిగణిస్తారని, బాబరు ఇక్కడ రామమందిరాన్ని కూల్చివేశారని, మధ్యవర్తిత్వం నిష్ఫలమవుతుందని హిందూ మహాసభ తరపున న్యాయవాది ఎస్.కె.జైన్ విచారణ పేర్కొన్న తర్వాత ఆయన ఇలా స్పందించారు.
మధ్యవర్తిత్వానికి తాము మద్దతు తెలుపుతున్నామని నిర్మోహి అఖాడా తరపున సీనియర్ న్యాయవాది సుశీల్ జైన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా.. కేసీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది?
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- బీజేపీకి శబరిమల రూపంలో మరో ‘అయోధ్య’ దొరికిందా?
- కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- ‘ఏపీ ప్రత్యేక హోదాను ఏ శక్తి అడ్డుకోలేదు’ -రాహుల్గాంధీ
- అన్నదాత సుఖీభవ పథకం: ఎవరు అర్హులు? కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారు?
- అయోధ్య వాసులకు రామ మందిరం అంటే ఆసక్తి ఎందుకుండదు?
- అయోధ్య వివాదం: 1994 తీర్పును సమీక్షించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








